IT Employees: ఐటీ ఉద్యోగులకు తనిఖీల ముప్పు

ఉద్యోగ కోతలు అమలు చేయడంతో పాటు నూతన నియామకాలు తగ్గించుకుంటున్న ఐటీ సంస్థలు.. పనిచేస్తున్న ఉద్యోగుల నైపుణ్యాలు, సామర్థ్యాలనూ నిశితంగా గమనిస్తున్నాయి.

Updated : 08 Feb 2023 09:22 IST

ఈ ఏడాది వేతన పెంపులు కష్టమే

ద్యోగ కోతలు అమలు చేయడంతో పాటు నూతన నియామకాలు తగ్గించుకుంటున్న ఐటీ సంస్థలు.. పనిచేస్తున్న ఉద్యోగుల నైపుణ్యాలు, సామర్థ్యాలనూ నిశితంగా గమనిస్తున్నాయి. కొవిడ్‌ పరిణామాల సమయంలో అధిక వేతనాలు ఇచ్చి నియమించుకున్న సీనియర్‌ ఉద్యోగుల పనితీరును ఇంకా తీక్షణంగా విశ్లేషిస్తున్నట్లు సమాచారం. ఉత్పాదకతలో తమ సామర్థ్యాన్ని చూపాలని వారిని మానవ వనరుల విభాగాధికారులు కోరుతున్నట్లు చెబుతున్నారు.

అధిక వ్యయాలు, మార్జిన్‌ల క్షీణతే కారణం: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తున్న నేపథ్యంలో ఐటీ కంపెనీల మార్జిన్‌లు తగ్గుతున్నాయి. దీంతో వ్యయాల నియంత్రణ కోసం, ఎక్కువ వేతనాలు పొందుతున్న ఉద్యోగులపై సంస్థలు దృష్టి సారించినట్లు సమాచారం. ఈ ఏడాది వేతన పెంపులను కూడా నిలిపివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అధిక వేతనాలతోనే సమస్య:  కొవిడ్‌ పరిణామాల్లో ప్రాజెక్టులు అధికంగా రావడంతో, 5-12 ఏళ్ల అనుభవం కలిగిన నిపుణులను గత రెండేళ్లలో పెద్ద ఐటీ కంపెనీలు భారీ స్థాయిలో నియమించుకున్నాయి. కంపెనీల మొత్తం ఉద్యోగుల్లో ఇటువంటి వారు 70% ఉన్నారు. ‘అధిక వేతనాలకు అప్పుడు ఉద్యోగులను నియమించుకోవడం ఇప్పుడు సమస్యగా మారింది. సాధారణ వేతనాలతో పోలిస్తే, 50-60 శాతం అధికమొత్తం ఆఫర్‌ చేసి మరీ, అప్పట్లో కావాల్సిన నిపుణులను సంస్థలు చేర్చుకున్నాయి’ అని టీమ్‌ లీజ్‌ డిజిటల్‌ సీఈఓ సునీల్‌ చెమ్మన్‌కోటిల్‌ తెలిపారు. వీరిలో ఎక్కువమందిలో అద్భుత నైపుణ్యాలున్నాయని, వీరిని వేరే వాళ్లతో భర్తీ చేయడం కష్టమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మార్జిన్లు తగ్గాయనే భావనతో, అధిక వేతనాలున్న నిపుణులను వదులుకోకుండా, కంపెనీలు కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుత తనిఖీలు/స్క్రూటినీ వల్ల ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.

* అధిక వేతనాలపై నియమితులైన మధ్యస్థాయి ఉద్యోగులకూ తనిఖీల ముప్పు ఉందని, వీరు కూడా తమ సామర్థ్యాలను నిరూపించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. తగిన సామర్థ్యం లేని ఈ స్థాయి వారిని తొలగిస్తే, సాధారణ వేతనాలకు లభించే కొత్తవారితో భర్తీ చేయొచ్చన్నది కంపెనీల  అభిప్రాయంగా పేర్కొన్నారు.

అంతర్జాతీయంగా ఇదే ధోరణి

కొవిడ్‌ తర్వాత ఆశావహంగా కనిపించిన రంగాల్లో ఐటీ ఒకటి. అయితే ఆర్థిక మందగమన భయాలతో పరిస్థితులు ఒక్కసారిగా మారాయి. అధిక వేతనాలకు సరిపడా పనిలేదంటూ సీనియర్‌ ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీలు, ‘శిక్షణ అనంతరమూ సంతృప్తికర పనితీరు లేదంటూ’ కొత్త ఉద్యోగులనూ ఇంటికి పంపిస్తుండటం గమనార్హం. ఇటీవల అంతర్గత మదింపులో విఫలమైన 600 మంది ఫ్రెషర్స్‌ను ఇన్ఫోసిస్‌ తొలగించింది. 2022 జులై నుంచి చూస్తే.. టెక్‌ దిగ్గజాలు గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, మెటా, అమెజాన్‌ సహా ఐటీ కంపెనీలు దాదాపు 2,00,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి.

బోయింగ్‌లో 2000 ఉద్యోగాల కోత: ఈ ఏడాది ఫైనాన్స్‌, మానవ వనరుల విభాగాల్లో 2,000 మంది ఉద్యోగులను తొలగించడానికి విమాన తయారీ సంస్థ బోయింగ్‌ సిద్ధమవుతోంది. అయితే మొత్తం ఉద్యోగుల సంఖ్యను పెంచుకోనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఏడాది చివరకు 15,000 మందిని, వచ్చే ఏడాది మరో 10,000 మందిని నియమించుకోనున్నట్లు వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని