ఒడుదొడుకుల్లో నష్టాలు

రెండు రోజుల వరుస లాభాలకు గురువారం అడ్డుకట్ట పడింది. ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్‌లో బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, ఐటీ షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది.

Published : 24 Mar 2023 01:35 IST

సమీక్ష

రెండు రోజుల వరుస లాభాలకు గురువారం అడ్డుకట్ట పడింది. ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్‌లో బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, ఐటీ షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. దీంతో సెన్సెక్స్‌ మళ్లీ 58000 పాయింట్ల కిందకు చేరింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేటను 0.25% పెంచిన  నేపథ్యంలో అంతర్జాతీయ సంకేతాలు మిశ్రమంగా మారాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 39 పైసలు పెరిగి 82.20 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.90% తగ్గి 76 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో జపాన్‌ మినహా మిగతావి రాణించాయి. ఐరోపా సూచీలు నష్టాల్లో కదలాడాయి.

సెన్సెక్స్‌ ఉదయం బలహీనంగా ప్రారంభమై, ఒకదశలో 57,838.85 వద్ద కనిష్ఠానికి పడిపోయింది. మళ్లీ కోలుకుని లాభాల్లోకి వచ్చిన సూచీ 58,396.17 వద్ద గరిష్ఠానికి చేరింది. మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు రావడంతో చివరకు 289.31 పాయింట్ల నష్టంతో 57,925.28 వద్ద ముగిసింది. నిఫ్టీ 75 పాయింట్లు కోల్పోయి 17,076.90 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 17,045.30- 17,205.40 పాయింట్ల మధ్య కదలాడింది.

* గ్లోబల్‌ సర్ఫేసెస్‌ షేరు బీఎస్‌ఈలో ఇష్యూ ధర రూ.140తో పోలిస్తే 16.42% లాభంతో రూ.163 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 22.25% దూసుకెళ్లి రూ.171.15 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 22.07% పెరిగి రూ.170.90 వద్ద ముగిసింది.

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 17 డీలాపడ్డాయి. ఎస్‌బీఐ 1.69%, ఏషియన్‌ పెయింట్స్‌ 1.49%, కోటక్‌ బ్యాంక్‌ 1.49%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.40%, విప్రో 1.34%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 1.28%, రిలయన్స్‌ 1.28%, ఇన్ఫోసిస్‌ 1.08%, పవర్‌గ్రిడ్‌ 0.94% చొప్పున డీలాపడ్డాయి. నెస్లే 1.11%, మారుతీ 1.07%, భారతీ ఎయిర్‌టెల్‌ 0.99%, టాఆ మోటార్స్‌ 0.73% లాభపడ్డాయి. రంగాల వారీ సూచీల్లో  స్థిరాస్తి, బ్యాంకింగ్‌, ఐటీ, ఆర్థిక సేవలు, టెక్‌ పడ్డాయి. ఎఫ్‌ఎమ్‌సీజీ, ఆరోగ్య సంరక్షణ, టెలికాం, యుటిలిటీస్‌, విద్యుత్‌ పెరిగాయి. బీఎస్‌ఈలో 2137 షేర్లు నష్టాల్లో ముగియగా, 1379 స్క్రిప్‌లు లాభపడ్డాయి. 118 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.

* బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ వడ్డీ రేట్ల పెంపు: ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు వరుసగా 11వ సారీ బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ వడ్డీ రేట్లను పెంచింది. అంతర్జాతీయంగా బ్యాంకింగ్‌ సంక్షోభం నెలకొన్నా, వడ్డీ రేట్ల పెంపు విషయంలో అమెరికా ఫెడ్‌ బాటలోనే నడిచింది. తాజాగా వడ్డీ రేట్లను 0.25% పెంచి 4.25% చేసింది.

* ఇన్ఫోసిస్‌ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్‌గా ఉన్న కిరణ్‌ మజుందార్‌ షా పదవీ విరమణ పొందినట్లు కంపెనీ ప్రకటించింది. మార్చి 22న ఆమె పదవీకాలం ముగిసింది. కంపెనీ లీడ్‌ స్వతంత్ర డైరెక్టర్‌గా డి.సుందరం నియమితులయ్యారు.

* వాటా విక్రయ వార్తలను అనిల్‌ అగర్వాల్‌ నేతృత్వంలోని వేదాంతా కొట్టిపారేసింది. ఈ వార్తలన్నీ అవాస్తమని స్పష్టం చేసింది.

* గుజరాత్‌లో కొత్త తయారీ కేంద్రాలను  రూ.1000 కోట్ల పెట్టుబడితో పెట్టేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో స్పెషాలిటీ రసాయనాల సంస్థ  అథెర్‌ ఇండస్ట్రీస్‌ ఒప్పందం కుదుర్చుకుంది.

* ఉదయ్‌శివకుమార్‌ ఇన్‌ఫ్రా ఐపీఓ చివరి రోజు ముగిసేసరికి 30.63 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 2 కోట్ల షేర్లను ఆఫర్‌ చేయగా, 61.26 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. ఎన్‌ఐఐల నుంచి 60.42 రెట్లు, క్యూఐబీల నుంచి 40.47 రెట్లు, రిటైల్‌ విభాగంలో14.10 రెట్ల స్పందన కనిపించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని