Gold: పసిడి విక్రయాలు.. అంతంతే

అక్షయ తృతీయ నాడు పసిడిని కొనుగోలు చేస్తే మరింత సంపద జత చేరుతుందన్నది నమ్మకం. తప్పనిసరి అవసరం లేకపోయినా సెంటిమెంటుగా భావించి బంగారు నాణేలు, బిస్కెట్ల రూపంలో మేలిమి బంగారాన్ని పలువురు కొనుగోలు చేస్తుంటారని వ్యాపారులు చెబుతున్నారు.

Updated : 23 Apr 2023 11:09 IST

అక్షయ తృతీయపై అధిక ధర ప్రభావం
తేలికపాటి వస్తువుల కొనుగోలుకే మొగ్గు

ముంబయి: అక్షయ తృతీయ నాడు పసిడిని కొనుగోలు చేస్తే మరింత సంపద జత చేరుతుందన్నది నమ్మకం. తప్పనిసరి అవసరం లేకపోయినా సెంటిమెంటుగా భావించి బంగారు నాణేలు, బిస్కెట్ల రూపంలో మేలిమి బంగారాన్ని పలువురు కొనుగోలు చేస్తుంటారని వ్యాపారులు చెబుతున్నారు. ఈసారి అక్షయ తృతీయ శని, ఆదివారాలు రెండు రోజులు వచ్చింది. కొనుగోలుదార్లు భారీగా దుకాణాలకు తరలి వచ్చినా శనివారం నాడు కొనుగోళ్లు మందకొడిగా సాగాయని విక్రేతలు పేర్కొన్నారు. దీనికి ప్రధాన కారణం పసిడి ధర అధికంగా ఉండటమే అని వారు తెలిపారు.
10 శాతం తగ్గొచ్చు: గత ఏడాది అక్షయ తృతీయ నాటితో పోలిస్తే ఈసారి విక్రయాల పరిమాణం సుమారు 10 శాతం తగ్గే అవకాశం కనిపిస్తోందని వర్తకులు భావిస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి పసిడి ధర సుమారు 20 శాతం మేర పెరిగింది. దీంతో కొనుగోలుదార్లు టోకెన్‌ కొనుగోళ్లకు లేదా తేలికపాటి వస్తువులను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారని వారు వెల్లడించారు. ఆదివారం నాడు విక్రయాలు పుంజుకుంటాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

1-2 గ్రాముల పసిడి నాణేల కొనుగోలు: శనివారం ఉదయం నుంచే ఆభరణాల రిటైల్‌ విక్రయశాలలకు కొనుగోలుదార్లు భారీగా తరలి వచ్చినా, తేలికపాటి ఆభరణాలు లేదా 1-2 గ్రాముల పసిడి నాణేలు కొనుగోలు చేశారని ఆభరణాల విక్రేతలు తెలిపారు. ‘ప్రజల నుంచి ఈసారి సానుకూల స్పందన వచ్చింది. దక్షిణాది నుంచి ప్రోత్సాహకరంగా ఉంది. 2-8 గ్రాముల తేలికపాటి ఆభరణాల కొనుగోళ్లకు ఎక్కువ మంది ప్రజలు మొగ్గు చూపారు. హాల్‌మార్కింగ్‌ కూడా విక్రయాలకు దన్నుగా నిలిచింద’ని ఆలిండియా రత్నాభరణాల దేశీయ మండలి జీజేసీ ఛైర్మన్‌ సాయమ్‌ మెహ్రా వెల్లడించారు. అధిక పసిడి ధర కారణంగా ఈసారి విక్రయాలు పరిమాణం పరంగా 5-7 శాతం తగ్గే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.

20 శాతం పెరిగిన ధర: 24 క్యారెట్ల పసిడి ధర శనివారం 10 గ్రాములు రూ.60,800గా ఉంది. జీఎస్‌టీతో కలిపి 10 గ్రాముల ధర రూ.61,500. గత ఏడాది అక్షయ తృతీయ నాడు జీఎస్‌టీతో కలిపి 10 గ్రాముల పసిడి ధర రూ.50,800 మాత్రమే. ‘విక్రయశాలలకు ప్రజలు భారీగా తరలివచ్చారు. టోకెన్‌ కొనుగోళ్లు ఎక్కువగా జరిగాయి. అధిక ధర వల్ల విక్రయాల పరిమాణం తగ్గింద’ని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) ఇండియా ఎండీ సోమసుందరమ్‌ పీఆర్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని