GST Collections: 11 శాతం పెరిగిన జీఎస్టీ వసూళ్లు

వస్తు సేవల పన్ను వసూళ్లు నవంబర్‌లో రూ.1.46 లక్షల కోట్ల మేర నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే 11 శాతం వృద్ధి నమోదైంది.

Published : 01 Dec 2022 17:18 IST

దిల్లీ: వస్తు సేవల పన్ను (GST) వసూళ్లు మరోసారి గణనీయంగా నమోదయ్యాయి. నవంబర్‌ నెలకు గానూ రూ.1.46 లక్షల కోట్లు వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గతేడాది నవంబర్‌లో వసూలైన 1.31 లక్షల కోట్లతో పోలిస్తే వసూళ్లలో 11 శాతం వృద్ధి నమోదైంది. అదే సమయంలో గత నెల రూ.1.51 లక్షల కోట్లతో పోలిస్తే వసూళ్లు కొంతమేర తగ్గాయి. 1.40 లక్షల కోట్ల ఎగువన వసూళ్లు నమోదుకావడం వరుసగా ఇది తొమ్మిదోసారి.

మొత్తం వసూళ్లలో సీజీఎస్టీ (CGST) కింద రూ.25,681 కోట్లు, ఎస్‌జీఎస్టీ (SGST) కింద రూ.32,651 కోట్లు, ఐజీఎస్టీ (IGST) కింద రూ.77,103 కోట్లు సమకూరినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. సెస్సుల రూపంలో రూ.10,433 కోట్లు వచ్చినట్లు తెలిపింది. దిగుమతైన వస్తువుల ద్వారా వచ్చిన ఆదాయం దాదాపు 20 శాతం వృద్ధి నమోదైనట్లు పేర్కొంది.

ఏపీలో 14, తెలంగాణలో 8 శాతం వృద్ధి

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. వృద్ధిలో ఏపీ తొలి స్థానంలో నిలవగా.. వసూళ్లు పరంగా తెలంగాణ ముందంజలో ఉంది. గతేడాది నవంబర్‌లో ఏపీలో రూ.2,750 కోట్లుగా ఉన్న వసూళ్లు.. ఈసారి 14 శాతం వృద్ధితో రూ.3,134 కోట్లకు పెరిగాయి. తెలంగాణలో గతేడాది రూ. 3,931 కోట్లు నమోదు అవ్వగా.. ఈ సారి 8 శాతం వృద్ధితో వసూళ్లు రూ. 4,228 కోట్లకు పెరిగాయి. ఎప్పటిలానే మహారాష్ట్ర వసూళ్లలో ముందువరుసలో నిలిచింది. గతేడాది నవంబర్‌లో రూ.18,656 కోట్లుగా ఉన్న వసూళ్లు 16 శాతం పెరిగి ఈ ఏడాది రూ. 21,611కోట్లకు చేరాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని