logo

నీటి నాణ్యత.. మా బాధ్యత

ఇంటి వద్దే తాగునీటి నాణ్యత పరిశీలించేందుకు జలమండలి ప్రణాళిక సిద్ధం చేస్తోంది. నీటి సరఫరా జరుగుతున్న సమయంలో సిబ్బంది నేరుగా ఇళ్ల వద్దకు చేరుకొని శాంపిళ్లను సేకరించి అక్కడికక్కడే పరీక్షించనున్నారు.

Published : 06 Feb 2023 03:57 IST

ఇంటి వద్దే పరీక్ష.. ప్రత్యేక యాప్‌ రూపకల్పన
మొబైల్‌ ల్యాబ్‌ను సిద్ధం చేస్తోన్న జలమండలి

ఎలక్ట్రిక్‌ వాహనాలను పరిశీలిస్తున్న ఎండీ దానకిషోర్‌ ఇతర అధికారులు

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటి వద్దే తాగునీటి నాణ్యత పరిశీలించేందుకు జలమండలి ప్రణాళిక సిద్ధం చేస్తోంది. నీటి సరఫరా జరుగుతున్న సమయంలో సిబ్బంది నేరుగా ఇళ్ల వద్దకు చేరుకొని శాంపిళ్లను సేకరించి అక్కడికక్కడే పరీక్షించనున్నారు. ఇందుకు రూ.90 లక్షలతో ప్రత్యేకంగా మొబైల్‌ ల్యాబ్‌ను జలమండలి సిద్ధం చేయనుంది. ఇందులో 20 రకాల పారామీటర్లును పరిశీలించే అవకాశం ఉంది. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద ప్రైవేటు సంస్థలతో జలమండలి  ఒప్పందం చేసుకుంది. ఆయా సంస్థలే ఇందుకు అవసరమైన నిధులను సమకూర్చనున్నాయి. ప్రస్తుతం జలమండలి ఆధ్వర్యంలో నిత్యం 15 వేల నీటి శాంపిళ్లు సేకరించి నగరంలో ఏడు ల్యాబ్‌ల్లో పరీక్షిస్తోంది.ఇందుకు జలమండలికి చెందిన 61 మంది శాంపిల్‌ టేకర్స్‌తోపాటు లైన్‌మెన్లు, స్వయంశక్తి మహిళలు విధులు నిర్వహిస్తున్నారు. స్థానికంగా పైపుల లీకేజీలు ఇతరత్రా కారణాలతో కొన్ని బస్తీల్లో కాలుష్య జలాలు సరఫరా అవుతున్నాయి. అప్పటికప్పుడు వీటిని పరిశీలించడానికి వీలు కావడం లేదు. ఫలితంగా నీటి సరఫరా నిలిపేసి ట్యాంకర్లతో నీటిని అందిస్తున్నారు.తర్వాత కూడా అక్కడ నీటిని తాగేందుకు స్థానికులు జంకుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల సమక్షంలోనే  నీటి పరీక్షలు చేసి భరోసా ఇవ్వనున్నారు. ఇందుకు ‘నాణ్యత’ పేరుతో ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
* మొబైల్‌ ల్యాబ్‌లో పరీక్షించిన తర్వాత ఆ వివరాలను వినియోగదారుడి ఖాతా సంఖ్య (క్యాన్‌ నంబరు), మొబైల్‌ నంబరు, శాంపిళ్లు సేకరిస్తున్న ఫొటోలను ఈ యాప్‌లో నమోదు చేయాలి. ఈ వివరాలన్ని ఉన్నతాధికారుల నుంచి సిబ్బంది వరకు అందుబాటులో ఉంటాయి.త్వరలో దీనిని క్షేత్రస్థాయిలో వినియోగించనున్నారు.
* శాంపిల్‌ టేకర్లు   ఎక్కడ నుంచి నీటి శాంపిళ్లు సేకరిస్తున్నారో తెలియడం లేదు. వారికి కేటాయించిన ప్రాంతాల్లో నిత్యం పర్యటిస్తున్నారో లేదో కూడా పక్కా సమాచారం ఉండటం లేదు. ఈ నేపథ్యంలో వీరందరికి  ఎలక్ట్రికల్‌ వాహనాలు కేటాయించనున్నారు.


సెంట్రల్‌ ల్యాబ్‌ ఏర్పాటు

ప్రస్తుతం గ్రేటర్‌వ్యాప్తంగా ఏడు ల్యాబ్‌ల్లో జలమండలి నీటి నాణ్యతను పరీక్షిస్తోంది. మరోవైపు మొబైల్‌ ల్యాబ్‌ అందుబాటులోకి తేనున్నారు. వీటితోపాటు అధునాతన సెంట్రల్‌ ల్యాబ్‌ను కూడా నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. ఇందులో అధునాతన పరికరాలతో అన్ని రకాల కలుషిత నీళ్లను ఈ ల్యాబ్‌లో పరీక్షించే అవకాశం ఉంది. అత్యంత సూక్ష్మ రసాయన, ఇతర కలుషిత కారణాలు ఉన్నా సరే ఇట్టే గుర్తిస్తారు. నిత్యం సేకరించే శాంపిల్‌ను స్థానిక ల్యాబ్‌తోపాటు ఈ సెంట్రల్‌ ల్యాబ్‌కు పంపిస్తారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని