logo

పెరుగుతున్న పసిడి ధరలు... తగ్గుతున్న వ్యాపారం

బంగారం ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకి వెళుతున్నాయి. గతంలో పెళ్లి ముహూర్తాల సమయంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టేవి. దీనికి భిన్నంగా మార్కెట్‌లో ప్రస్తుతం పసిడి ధర పది గ్రాములు(తులం) రూ.76,000 వరకు పలుకుతోంది.

Updated : 20 Apr 2024 06:16 IST

న్యూస్‌టుడే, జ్యోతినగర్‌(మార్కండేయకాలనీ): బంగారం ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకి వెళుతున్నాయి. గతంలో పెళ్లి ముహూర్తాల సమయంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టేవి. దీనికి భిన్నంగా మార్కెట్‌లో ప్రస్తుతం పసిడి ధర పది గ్రాములు(తులం) రూ.76,000 వరకు పలుకుతోంది. రోజురోజుకీ ధరల్లో హెచ్చుతగ్గులు ఉండటంతో కొనుగోలుదారులు, విక్రయదారులు, ఆభరణాలు చేసే స్వర్ణకారులు ఆందోళన చెందుతున్నారు. ఈనెల 26వ తేదీ వరకే శుభ ముహూర్తాలున్నాయని పండితులు చెబుతున్నారు. ప్రస్తుతం పెరుగుతున్న బంగారం ధరల కారణంగా శుభకార్యాలు నిర్వహించే వారు ఆలోచించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. నూతన వధూవరుల కోసం బంగారు ఆభరాణాలు తయారు చేయించే విషయంలో తమ ఆర్థిక అంచనాలు తలకిందులవుతున్నాయని పలువురు వాపోతున్నారు.

కొనాలంటే.. భయపడుతున్నారు

మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబాల వారి ఇంట్లో ప్రస్తుతం పెళ్లి సంబంధం కుదిరితే బంగారం కొనుగోలు విషయంలో భయపడుతున్నారు. పెరిగిన ధరల కారణంగా పుస్తె, మెట్టెలు కొనాలన్నా సుమారు రూ.40 వేలు అవుతుంది. ఆభరణాలు చేయించాలంటే రూ.లక్షకు పైగా ఖర్చు చేయాల్సిందే. కొంత మంది ధర తగ్గితే బంగారం కొనుగోలు చేద్దామని నెల రోజులుగా ఎదురుచూస్తున్నారు. రోజురోజుకీ ధర పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. భవిష్యత్తులో బంగారం కొనగలమా అనే సందేహం కొనుగోలు దారులు, స్వర్ణకారుల్లో నెలకొంటోంది.

కజాంపురం రాకేష్‌, బంగారం వ్యాపారి

రానున్న రోజుల్లో ఇబ్బందులు

పసిడి ధరల్లో అనూహ్య పెరుగుదల వల్ల కొనుగోలుదారులతో పాటు స్వర్ణకారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గత ఏడాది పది గ్రాముల బంగారం ధర రూ.62 వేలు ఉంటే ప్రస్తుతం రూ.76 వేల పైచిలుకు చేరింది. గత ఏడాది పెళ్లిళ్ల సీజన్‌లో రోజుకు ఐదు తులాల విక్రయాలు చేశాం. ఈసారి రోజుకు తులం కూడా విక్రయించడం గగనంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వర్ణకారులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలి. ధరలు ఇలాగే పెరిగితే రానున్న రోజుల్లో ఇబ్బందులు తప్పవు.

గుగ్గిళ్ల రవీంద్రచారి, జ్యువెల్లర్స్‌ బులియన్‌ మర్చంట్, రామగుండం అధ్యక్షుడు

అంతర్జాతీయ పరిణామాలతో..

అంతర్జాతీయ అనిశ్చితి కారణంగా పుత్తడి ధరలు పెరుగుతున్నాయి. పేద, మధ్యతరగతి వర్గాలకు అందనంత దూరం వెళ్తోంది. చాలామంది శుభ కార్యాలకు బంగారం తప్పనిసరిగా కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుత ధరల నేపథ్యంలో తక్కువ పరిమాణంలో ఆభరణాలు కొంటున్నారు. సీజన్‌లో ఈ ప్రాంతం మార్కెట్లో గతేడాది నిత్యం 20 కిలోల బంగారం అమ్మకాలు జరిగేవి. ప్రస్తుతం 10-12 కిలోలు కూడా విక్రయించడం లేదు. కొనుగోలు, అమ్మకందారులపై తీవ్ర ప్రభావం పడుతోంది.

శ్రీనివాస్‌, స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని