Andhra news: పారిశుద్ధ్య కార్మికుల సమ్మె.. ఒంగోలులో ఉద్రిక్తత

రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, తగ్గేదే లేదంటూ.. పారిశుద్ధ్య కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు.

Updated : 06 Jan 2024 18:13 IST

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, తగ్గేదే లేదంటూ.. పారిశుద్ధ్య కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు. ఆందోళన ప్రారంభించి రోజులు గడుస్తున్నా సర్కారు పట్టించుకోవడం లేదంటూ మండిపడుతున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఒంగోలులోని మున్సిపల్‌ కార్యాలయాన్ని ముట్టడించారు.  కమిషనర్‌ వాహనాన్ని అడ్డుకున్నారు. చెత్తవాహనాలు కార్యాలయం నుంచి బయటకు రాకుండా నిలిపివేశారు. గేటు ఎదుట ఉద్యోగులను అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తోటి కార్మికులను అరెస్టు చేసి తీసుకెళ్తున్న పోలీసు వాహనాన్ని అడ్డుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో వాహనంలోకి ఎక్కించిన కార్మికులను పోలీసులు వెంటనే దించేశారు. పెండింగ్‌లో ఉన్న జీతాలను విడుదల చేస్తామని కార్మికులకు కమిషనర్‌ హామీ ఇచ్చారు.

మరోవైపు రాజంపేట మున్సిపల్‌ కార్యాలయాన్ని కూడా పారిశుద్ధ్య కార్మికులు ముట్టడించారు. కనీస వేతనం రూ.26వేలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. సీఐటీయూసీ నాయకుడు రవితోపాటు పలువురు కార్మికులను పోలీసులు వాహనం ఎక్కించారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసనకు సిద్ధమైన కార్మికులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. విజయనగరం మున్సిపల్‌ కార్యాలయాన్ని ముట్టడించేందుకు వెళ్తున్న వారిని అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు