AAP: మోదీ వ్యతిరేక పోస్టర్లతో.. 22 రాష్ట్రాల్లో ప్రచారానికి ఆప్‌ సిద్ధం..!

మోదీ ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలను వ్యతిరేకిస్తూ ఆమ్ఆద్మీ పార్టీ (AAP) పోస్టర్‌ ప్రచారానికి సిద్ధమైంది. ‘మోదీ హఠావో..దేశ్‌ బచావో’ (Narendra Modi) అనే నినాదంతో 22 రాష్ట్రాల్లో ప్రచారం చేస్తామని వెల్లడించింది. ఈ కార్యక్రమాన్ని ఆప్‌ దిల్లీ యూనిట్‌ ప్రారంభించింది.

Published : 30 Mar 2023 20:18 IST

దిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తున్న ఆమ్‌ఆద్మీ పార్టీ (AAP).. దేశవ్యాప్తంగా ప్రచారానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా ‘మోదీ హఠావో, దేశ్‌ బచావో’ పేరుతో అనేక భాషల్లో పోస్టర్లను ముద్రించింది. వీటితో 22 రాష్ట్రాల్లో తమ ప్రచారాన్ని(Poster Campaign) చేపట్టాలని ఆప్‌ నిర్ణయించింది. ఈ ప్రచారాన్ని ఆప్‌ దిల్లీ యూనిట్‌ కన్వీనర్‌ గోపాల్‌రాయ్‌ దేశ రాజధానిలో ప్రారంభించారు. పౌరులకు ఇచ్చిన హామీలను భాజపా నెరవేర్చలేదనే సందేశాన్ని దేశం మొత్తం తీసుకువెళ్లే లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.

‘ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో భాజపా ఎలా విఫలమైందన్న విషయాన్ని దేశవ్యాప్తంగా తెలియజేసే ఉద్దేశంతోనే ఈ పోస్టర్‌ ప్రచారం చేపడుతున్నాం. రైతులకు ఇచ్చిన హామీలనూ ఇంకా నెరవేర్చలేదు. సమస్యలను పరిష్కరించాల్సింది పోయి.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు భాజపా ప్రయత్నిస్తోంది. వివిధ భాషలతో కూడిన ఈ పోస్టర్లను 22 రాష్ట్రాలకు పంపిస్తున్నాం’ అని ఆమ్‌ఆద్మీ పార్టీ దిల్లీ కన్వీనర్‌ గోపాల్‌ రాయ్‌ పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థల స్వతంత్రతను అడ్డుకోవడంతోపాటు న్యాయ ప్రక్రియపై విశ్వాసం కోల్పోయేలా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ఈ విషయాలను విద్యార్థులకు తెలియజేయడంలో భాగంగా ఏప్రిల్‌ 10 నుంచి ఇటువంటి పోస్టర్లను దేశంలో ఉన్న అన్ని యూనివర్సిటీలకూ అంటిస్తామని అన్నారు.

మరోవైపు మొన్నటివరకు దేశ రాజధాని దిల్లీలో ఆప్‌, భాజపా మధ్య పోస్టర్‌ వార్‌ కొనసాగింది. ‘మోదీ హఠావో, దేశ్‌ బచావో’ అంటూ దిల్లీలోని పలు ప్రాంతాల్లో వేల సంఖ్యలో పోస్టర్లు వెలిసిన కొన్ని రోజులకే ‘కేజ్రీవాల్‌ హఠావో.. దిల్లీ బచావో’ అంటూ పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. మోదీ వ్యతిరేక పోస్టర్లపై దిల్లీ పోలీసులు వందల కేసులు నమోదు చేయగా.. కేజ్రీవాల్‌ పోస్టర్లపై మాత్రం ఆమ్‌ఆద్మీ పార్టీ ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ప్రజాస్వామ్యంలో అటువంటి పోస్టర్లు అంటించేందుకు ప్రతి ఒక్కరికీ హక్కు ఉందని పేర్కొనింది.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని