Galwan: గల్వాన్‌ అమరవీరుడి తండ్రిని.. అర్ధరాత్రి అరెస్టు చేసి.. బలవంతంగా తీసుకెళ్లి..!

గల్వాన్‌ (Galwan) ఘటనలో అమరుడైన సైనికుడి (Soldier) తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. స్మారకచిహ్నం ఏర్పాటు విషయంలో తలెత్తిన వివాదం అరెస్టుకు దారితీసింది.

Published : 28 Feb 2023 18:03 IST

పట్నా: గల్వాన్‌ (Galwan) దుర్ఘటనలో కొడుకు ప్రాణాలు కోల్పోయాడు. ఆయన స్మారకచిహ్నాన్ని (Memorial) ఏర్పాటు చేసేందుకు కేటాయించిన భూమి విషయంలో తలెత్తిన వివాదంతో అమరవీరుడి తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. ఏ మాత్రం గౌరవం లేకుండా రాత్రిపూట ఇంటికి వచ్చి, ఈడ్చుకుంటూ స్టేషన్‌కు తీసుకెళ్లిపోయారు. ఈ ఘటన బిహార్‌ (Bihar)లోని పట్నా సమీపంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. దీంతో సమీపగ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు.

బిహార్‌కు చెందిన జయ్‌ కిశోర్‌ 2020 గల్వాన్‌ ఘటనలో అమరుడయ్యారు. ఆయన స్మారకచిహ్నాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అప్పట్లో ప్రభుత్వం ఆయన స్వగ్రామంలో ఇంటికి దగ్గరగా చిన్న స్థలాన్ని కేటాయించింది. గత ఏడాది ఫిబ్రవరిలో జయ్‌ కిశోర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు. తాజాగా అక్కడ జయ్‌ కిశోర్‌ తండ్రి రాజ్‌కపూర్‌ సింగ్‌ విగ్రహం చుట్టూ గోడ నిర్మించారు. దీంతో రాజ్‌కపూర్‌ ప్రభుత్వ భూమిని ఆక్రమించారని, తమ పొలంలోకి వెళ్లేందుకు మార్గం లేకుండా చేశారని కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

‘‘ పోలీసులు వచ్చి 15 రోజుల్లోగా స్మారకచిహ్నాన్ని తొలగించాలని ఆదేశించారు. అర్ధరాత్రి మా ఇంట్లోకి చొరబడి మా నాన్నను అరెస్టు చేశారు. చొక్కా పట్టుకొని ఈడ్చుకుంటూ లాక్కెళ్లిపోయారు. దుర్భాషలాడారు. అక్కడితో ఆగకుండా పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లిన తర్వాత కూడా చేయి చేసుకున్నారు.’’ అని రాజ్‌కపూర్‌ మరో కొడుకు నంద కిశోర్‌ మీడియాకు చెప్పారు. రాజ్‌కపూర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. స్మారకచిహ్నం చుట్టూ గోడ కట్టడం వల్ల పొలంలోకి వెళ్లేందుకు మార్గం మూసుకుపోయిందని గ్రామస్థులు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చర్చలకు కూడా తావివ్వకుండా రాత్రికి రాత్రే స్మారక చిహ్నం చుట్టూ గోడ నిర్మించినట్లు స్థానిక పోలీసు అధికారి పూనమ్‌ కేసరి తెలిపారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్లు చెప్పారు. అందుకే చర్యలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. స్మారక చిహ్నం ఏర్పాటు వివాదాన్ని పక్కన పెడితే.. ఓ అమరవీరుడి తండ్రిపై ఏమాత్రం గౌరవం లేకుండా అర్ధరాత్రి అరెస్టు చేసి తీసుకెళ్లడాన్ని పరిసరగ్రామాల ప్రజలు తప్పుబడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని