కరోనా దెబ్బకు.. మహారాష్ట్ర గడగడ

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజువారీ పాజిటివ్‌ కేసుల సంఖ్య 60 వేల మార్కును దాటేసింది. గడిచిన 24 గంటల్లో  63,294 మందికి కొవిడ్‌ సోకినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 34,07,245కి చేరింది. తాజాగా 349 మంది మహమ్మారికి బలవ్వడంతో...

Published : 11 Apr 2021 22:44 IST

ముంబయి: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజువారీ పాజిటివ్‌ కేసుల సంఖ్య 60 వేల మార్కును దాటేసింది. గడిచిన 24 గంటల్లో  63,294 మందికి కొవిడ్‌ సోకినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 34,07,245కి చేరింది. తాజాగా 349 మంది మహమ్మారికి బలవ్వగా ఇప్పటివరకు 57,987 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 5,65,587 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు పేర్కొంది. కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. మాస్క్‌ ధరించని వారికి రూ.వెయ్యి  జరిమానా విధించాలని అధికారులను ఆదేశించింది. బహిరంగ ప్రదేశాల్లోనూ, పని ప్రదేశాలు, రవాణా వాహనాల్లోనూ మాస్క్‌ తప్పనిసరి చేస్తూ ఆదేశాలిచ్చింది. వీటిని తప్పనిసరిగా అమలు చేయాలని కలెక్టర్లు, పోలీసులు, ఉన్నతాధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది.

కర్ణాటకలోనూ అదే పరిస్థితి

మరోవైపు పొరుగురాష్ట్రం కర్ణాటకలోనూ కొవిడ్‌ ఉద్ధృతి రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా మరో 10,250 కొత్త కేసులు నమోదైనట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 10,65,290కి చేరింది. కరోనా మహమ్మారి కారణంగా ఇవాళ ఒక్క రోజే 40 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 69,225 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు కర్ణాటక ప్రభుత్వం పేర్కొంది.

దిల్లీలో గరిష్ఠ స్థాయికి..

దేశ రాజధాని దిల్లీని కరోనా గడగడలాడిస్తోంది. గరిష్ఠ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 10,774 కొత్త కేసులు నమోదైనట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,25,197కి చేరింది. దిల్లీలో ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇప్పటి వరకు ఇదే గరిష్ఠం. తాజాగా కరోనా మహమ్మారితో 48 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజధానిలో కరోనా పాజిటివిటీ రేటు 9.43గా నమోదైనట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని