నిర్భయ దోషుల మృతదేహాలు అప్పగింత

నిర్భయ సామూహిక హత్యాచారం కేసులో ఉరితీయబడిన నలుగురు దోషుల మృతదేహాలను వారి కుటుంబాలకు అందజేసినట్లు...

Updated : 20 Mar 2020 18:12 IST

దిల్లీ: నిర్భయ సామూహిక హత్యాచారం కేసులో ఉరితీయబడిన నలుగురు దోషుల మృతదేహాలను వారి కుటుంబాలకు అందజేసినట్లు జైలు అధికారులు తెలిపారు. ముకేశ్‌ సింగ్‌ (32), పవన్‌ గుప్త (25), వినయ్‌ శర్మ (26), అక్షయ్‌ కుమార్‌ సింగ్‌ (31)లను తిహాడ్‌ జైలులో శుక్రవారం ఉదయం 5.30 గంటలకు ఉరి తీశారు. తలారి పవన్‌ జల్లాద్‌ నలుగురు దోషుల్ని నిబంధనల ప్రకారం ఉరితీశారు. 30 నిమిషాల పాటు వారి మృతదేహాల్ని అలాగే వేలాడదీశారు. వైద్యుడు మృతదేహాలను పరిశీలించి నలుగురూ చనిపోయినట్లు ప్రకటించిన తర్వాత దీనదయాళ్‌ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించారు. శవపరీక్ష అనంతరం మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించినట్లు తిహాడ్‌ జైలు డైరెక్టర్ జనరల్ సందీప్ గోయెల్ తెలిపారు.

అక్షయ్‌ మృతదేహాన్ని బిహార్‌లోని ఔరంగాబాద్‌ సమీపంలోని అతని గ్రామానికి తీసుకెళ్తామని జైలు సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. ముకేశ్‌ సింగ్‌ మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులు రాజస్థాన్‌కు తీసుకెళ్తారు. వినయ్‌ శర్మ, పవన్‌ గుప్త మృతదేహాలను దక్షిణ దిల్లీలోని రవిదాస్‌ క్యాంప్‌ సమీపంలోని వారి ఇళ్లకు తరలించనున్నారని జైలు అధికారులు పేర్కొన్నారు. శవపరీక్ష నిర్వహించడానికి ముందు మృతుల కుటుంబసభ్యుల నుంచి అంగీకార పత్రాలను తీసుకొనేందుకు వారిని ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రి, మార్చురీ సమీపంలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆస్పత్రి సిబ్బంది, దోషుల కుటుంబ సభ్యులను తప్ప మరే వ్యక్తిని మార్చురీ సమీపంలోకి అనుమతించలేదు. 16 వేల మంది ఖైదీలు ఉన్న తిహాడ్‌ జైలు దక్షిణాసియాలోనే అతిపెద్ద కారాగారం. ఇందులో ఒకేసారి నలుగురు దోషులను ఉరి తీయడం ఇదే మొదటిసారి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని