మృతుల సంఖ్య 288 కాదు.. 275

ఒడిశాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 275 మంది మృతిచెందినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ప్రదీప్‌కుమార్‌ జెనా చెప్పారు.

Published : 05 Jun 2023 03:15 IST

ఒడిశా సీఎస్‌ వెల్లడి

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: ఒడిశాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 275 మంది మృతిచెందినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ప్రదీప్‌కుమార్‌ జెనా చెప్పారు. స్థానిక లోక్‌సేవా భవన్‌లో ఆదివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కొన్ని మృతదేహాలను పొరపాటున రెండుసార్లు లెక్కించడంతో తొలుత మృతుల సంఖ్య 288గా వచ్చిందని చెప్పారు. అది తప్పని స్పష్టంచేశారు. క్షతగాత్రుల సంఖ్య 1,175గా ఉందని.. వారిలో 793 మంది ఇప్పటికే ఆసుపత్రుల నుంచి డిశ్ఛార్జయ్యారని, మిగతా 382 మందికి ప్రభుత్వ వ్యయంతో చికిత్స అందిస్తున్నామని చెప్పారు. 78 మృతదేహాలను ఇప్పటికే వారి కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు. మరో పది మంది మృతుల వివరాలనూ గుర్తించామని, ఆ భౌతికకాయాల అప్పగింత ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. మిగతా మృతదేహాలను భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌, ఇతర ఆసుపత్రుల్లో భద్రపరుస్తున్నామన్నారు. నిబంధనల ప్రకారం 48 గంటలపాటు ఆయాచోట్ల భద్రపరిచి, తర్వాత డీఎన్‌ఏ పరీక్షలు చేయించి, అవసరమైతే దహన సంస్కారాలు చేయిస్తామన్నారు. మృతుల ఫోటోలను భువనేశ్వర్‌ నగరపాలక సంస్థ యంత్రాంగం వెబ్‌సైట్‌లో పొందుపరిచారని చెప్పారు.


మరణాల సంఖ్యపై అనుమానాలు: మమతా బెనర్జీ

రైలు ప్రమాద మృతుల సంఖ్యపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో బెంగాల్‌వాసులే 61 మంది దుర్మరణం చెందారని చెప్పారు. తమ రాష్ట్రానికి చెందిన మరో 182 మంది ఆచూకీ ఇంకా తెలియరావడం లేదని పేర్కొన్నారు. ఈ లెక్కన మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని కోల్‌కతాలో ఆదివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని