Lakshadweep: లక్షద్వీప్‌లో కొత్త ఎయిర్‌పోర్టు.. యోచనలో కేంద్రం..!

Lakshadweep: లక్షద్వీప్‌లో మరో కొత్త ఎయిర్‌పోర్టును నిర్మించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మాల్దీవులను బాయ్‌కాట్‌ చేయాలంటూ నెట్టింట ప్రచారం జరుగుతున్న వేళ ఈ వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Updated : 09 Jan 2024 15:48 IST

దిల్లీ: లక్షద్వీప్‌ (Lakshadweep)లో ప్రధాని మోదీ ఇటీవల చేపట్టిన పర్యటనతో ఈ దీవుల పేరు ఇప్పుడు మార్మోగుతోంది. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకుల చూపు వీటిపై పడింది. ఈ దీవుల కోసం నెట్టింట తెగ వెతికేస్తున్నారు. అటు కేంద్రం కూడా లక్షద్వీప్‌లో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపర్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే అక్కడ కొత్తగా మరో ఎయిర్‌పోర్టు (Airport)ను నిర్మించేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మిలిటరీ, వాణిజ్య అవసరాల కోసం మినికోయ్‌లో నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

‘‘ఫైటర్‌ జెట్‌లు, సైనిక రవాణా ఎయిర్‌క్రాఫ్ట్‌లతో పాటు వాణిజ్య విమానాల నిర్వహణ సామర్థ్యం ఉండేలా ద్వంద్వ ప్రయోజనాలతో కొత్తగా ఎయిర్‌పోర్టును నిర్మించేందుకు కేంద్రం ప్రణాళికలు చేస్తోంది. మినికోయ్‌ దీవుల్లో ఈ విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి.

లక్షద్వీప్‌లో నిర్లవణీకరణకు సిద్ధం

వాస్తవానికి మినికోయ్‌ దీవుల్లో రక్షణరంగ అవసరాల కోసం ఎయిర్‌ఫీల్డ్‌ను నిర్మించాలని గతంలోనే ప్రతిపాదనలు వచ్చాయి. అరేబియా, హిందూ మహా సముద్రాల్లో సంఘ వ్యతిరేక కార్యకలాపాలు, సముద్రపు దొంగల దాడులు పెరుగుతున్న వేళ.. వాటిపై నిఘాను పెంచేందుకు ఈ ప్రాంతం మెరుగ్గా ఉపయోగపడుతుందని కోస్ట్‌గార్డ్‌ గతంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది.

అయితే, తాజాగా పౌర విమానాలు కూడా రాకపోకలు సాగించేలా ఇక్కడ కొత్త ఎయిర్‌పోర్టును నిర్మించాలని కేంద్రం ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఈ దీవుల పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడుతుందని యోచిస్తోంది. లక్షద్వీప్‌లో ప్రస్తుతం ఒకే ఒక్క ఎయిర్‌పోర్టు ఉంది. 1987-88లో అగత్తి దీవుల్లో దాన్ని నిర్మించారు. ఆ తర్వాత దశలవారీగా విస్తరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని