Gujarat : గుజరాత్‌లో భారీ వర్షాలు.. సురక్షిత ప్రాంతాలకు 12వేల మంది తరలింపు!

గుజరాత్‌ (Gujarat) రాష్ట్రంలో భారీ వర్షాలు (heavy rain) కురుస్తున్నాయి. నర్మదా (Narmada) నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. 

Published : 18 Sep 2023 19:51 IST

Image : InfoGujarat

గాంధీనగర్‌ : గుజరాత్‌ (Gujarat) రాష్ట్రంలో ఆదివారం నుంచి భారీ వర్షాలు (heavy rain) కురుస్తున్నాయి. దాంతో వడోదర, భరూచ్‌, నర్మద, దాహోద్‌, పంచమహల్‌, ఆనంద్‌, గాంధీనగర్‌ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 11,900 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వివిధ చోట్ల వరద నీటిలో చిక్కుకుపోయిన 270 మందిని సహాయక బృందాలు రక్షించాయి. ఈదురుగాలులతో రోడ్లపై కూలిన చెట్లను తొలగించే పనులు వేగవంతం చేసి, రాకపోకలను సుగమం చేస్తున్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ తెలిపారు. గత రెండు రోజుల్లో భరూచ్‌ జిల్లాలో నర్మదా నదీ తీరం వెంట నివసిస్తున్న సుమారు 6 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. సర్దార్‌ సరోవర్‌ జలాశయంలో నీటిమట్టం 40 అడుగులకు చేరిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

అమ్మగా లాలిస్తోంది.. మేయర్‌గా పాలిస్తోంది!

భారీ వర్షాల కారణంగా నర్మదా నదిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. గోల్డెన్‌ బ్రిడ్జి వద్ద ప్రమాదకర నీటిమట్టం స్థాయి 28 అడుగులే కాగా.. ఇప్పుడు 37.72 అడుగులకు చేరిందని అధికారులు తెలిపారు. సర్దార్‌ సరోవర్ జలాశయం నుంచి అత్యధిక స్థాయిలో నీరు విడుదల కావడంతో ఆదివారం ఇక్కడ నీటిమట్టం 40 అడుగులకు చేరింది. దాంతో దాండియా బజార్‌, భరూచ్‌, అంకలేశ్వర్ నగరంలోని కొన్ని ప్రాంతాలు నీట మునిగాయి. క్రమంగా లోతట్టు ప్రాంతాల నుంచి ఆ నీరు తగ్గిపోతోందని విపత్తు ప్రతిస్పందన దళం అధికారులు వెల్లడించారు. 

గుజరాత్‌ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. తక్షణ సహాయం కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌లతో 10 బృందాలను సిద్ధంగా ఉంచారు. ఇప్పటివరకు 12వేల మందిని లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పిన సీఎం.. వరదలో చిక్కుకుపోయిన సుమారు 270 మందిని సహాయక బృందాలు రక్షించాయన్నారు. వడోదర జిల్లాలో ఓ చిన్న ద్వీపంలో చిక్కుకుపోయిన 12 మందిని 48 గంటలపాటు తీవ్రంగా శ్రమించి ఆర్మీ రక్షించింది. కాగా.. గుజరాత్‌ రాష్ట్రంలో మరిన్ని వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతవరణ శాఖ హెచ్చరించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని