Venkaiah Naidu: న్యాయ వ్యవస్థ చట్టాలు చేయలేదు: వెంకయ్యనాయుడు

చట్టాల రూపకల్పనలో న్యాయవ్యవస్థ పాత్ర లేదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) అన్నారు. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థల పాత్రలను భారత రాజ్యాంగం స్పష్టంగా నిర్వచించిందని ఆయన చెప్పారు.

Updated : 17 Jun 2023 18:34 IST

దిల్లీ: చట్టాల రూపకల్పనలో పార్లమెంట్‌, శాసనసభల ప్రాముఖ్యతను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) నొక్కి చెప్పారు. ఈ ప్రక్రియలో న్యాయవ్యవస్థ పాత్ర లేదని అన్నారు. జాతీయస్థాయి శాసనకర్తల సమావేశంలో (National Legislators Conference) ఆయన మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థ చట్టాలను చేయలేదని తెలిపారు. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థల పాత్రలను భారత రాజ్యాంగం స్పష్టంగా నిర్వచించిందని చెప్పారు. అందువల్ల తామే అత్యున్నతమని భావించి ఆయా వ్యవస్థలు తమ పరిమితులను అధిగమించకూడదని ఆయన వ్యాఖ్యానించారు.

‘‘శాసనం చేసే అధికారాలు పూర్తిగా శాసనసభలకు మాత్రమే ఉన్నాయి. శాసన వ్యవస్థ చేసిన చట్టాలు రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఉన్నాయో, లేదో?న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. అంతేగానీ, న్యాయస్థానాలు చట్టం చేయలేవు. శాసనసభలు చట్టం చేస్తే, కార్యనిర్వాహక వ్యవస్థ దానిని అమలు చేస్తుంది. ఈ క్రమంలో ఎవరైనా తమ పరిధి దాటితే వాళ్లు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు.’’ అని వెంకయ్యనాయుడు అన్నారు. పార్లమెంట్‌ చట్టం చేసేంత వరకు ప్రధాన ఎన్నికల కమిషనర్లు, ఎన్నికల కమిషన్ల నియామక అంశంపై ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో రాజ్యాంగబద్ధమైన అధికారాల విభజనపై వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో వెంకయ్యనాయుడి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

పార్లమెంట్‌, శాసనసభల్లో పదేపదే అంతరాయాలు ఏర్పడటంపైనా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు తమ శాసనసభ్యులకు ప్రవర్తనా నియమావళిని రూపొందించాలని సూచించారు. శాసనసభలు, పార్లమెంట్‌లో వికృతంగా ప్రవర్తించడం, పేపర్లు చించివేయడం, మైకులు పగలగొట్టడం లాంటివి చేయకుండా చూసుకోవాలని కోరారు. ‘‘సభలో ప్రతిపక్షం ఉండకూడదని నేను చెప్పను. సభ్యులకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. వారి మధ్య విభేదాలు ఉండొచ్చు. వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. వాస్తవానికి నిరసనలు, విభేదాలు, సమ్మతి-అసమ్మతి, వాదనలు ఇవన్నీ ప్రజాస్వామ్య లక్షణాలు’’ అని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని