ఏంటీ ఇవన్నీ రీమేక్‌లా..!

‘రీమేక్‌’.. ఈ మధ్య సినిమా డిక్షనరీలో పదేపదే కనిపిస్తున్న పదం ఇది. అయితే.. ఇటీవల మనం వింటున్న ఈపదం ఈమధ్య కొత్తగా వచ్చిందేం కాదు. మన దగ్గర ఎప్పటి నుంచో రిమేక్‌ సినిమాలు ఉన్నాయంటారా..? అని మీరు ప్రశ్నించొచ్చు. అయితే.. మీ ప్రశ్నాకు సమాధానం అవుననే చెప్పాలి.

Updated : 05 Mar 2021 12:21 IST

చిరంజీవికి మెగా‘స్టార్‌డమ్‌’ తెచ్చిన సినిమాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘రీమేక్‌’.. ఈ మధ్య సినిమా డిక్షనరీలో పదేపదే కనిపిస్తున్న పదం. మన దగ్గర బాక్సాఫీస్‌ను షేక్‌ చేసిన సినిమాల్లోనూ రీమేక్‌ల హవా బాగానే ఉంది. అగ్ర కథానాయకుల సినీ విజయాల్లో డైరెక్టు సినిమాలదే పెద్ద పాత్ర. అదే సమయంలో రీమేక్‌ సినిమాల పాత్రనీ కాదనలేం! మెగాస్టార్‌ చిరంజీవి తన కెరీర్‌లో ఇటు తెలుగు కథల్లో నటిస్తూనే, కొన్ని రీమేక్‌లతో అభిమానులను ఉర్రూతలూగించారు. ఆ సినిమాలు సూపర్‌డూపర్‌ హిట్‌ అయి చిరంజీవిని మెగాస్టార్‌ని చేశాయి. అలా చిరు సినీ ప్రస్థానంలో బాక్సాఫీసు వద్ద కాసులు కురిపించిన రీమేక్‌లు ఏంటో మీకు తెలుసా?

చట్టానికి కళ్లు లేవు

1981లో ఈ చిత్రాన్ని ఎస్‌.ఏ.చంద్రశేఖర్‌ తెరకెక్కించారు. చిరంజీవి, మాధవి జంటగా నటించారు. అదే ఏడాది వచ్చిన ‘సట్టం ఓరు ఇరుత్తరయ్‌’ అనే తమిళ చిత్రానికి ఇది రీమేక్‌. చిరంజీవికి కెరీర్‌లో తొలి రీమేక్‌ ఇది. తమిళ మాతృకలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించారు. ఈ సినిమా తెలుగులో మంచి విజయం సాధించింది. 

పట్నం వచ్చిన పతివ్రతలు

80ల్లో పుట్టిన చాలామందికి ఈ సినిమా తొలి జ్ఞాపకంగా ఉండే అవకాశం ఉంది. అంతలా ఆడిందీ చిత్రం. కన్నడ చిత్రం ‘పట్టనక్కె బంద పత్నియరు’కు రీమేక్‌ ఇది. చిరంజీవి, మోహన్‌బాబు, రాధిక, గీత, రమాప్రభ నటించిన ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకులతో కన్నీళ్లు పెట్టించింది. ఈ సినిమాకు టి.ఎస్‌.బి.కె మౌళి దర్శకత్వం వహించారు.

ఖైదీ

1983లో వచ్చిన ఖైదీ రీమేక్‌ కాకపోయినా.. ‘ఫస్ట్‌బ్లడ్‌’ అనే సినిమా ఆధారంగా తెరకెక్కించారు. చిరంజీవికి స్టార్‌డమ్‌ తెచ్చిపెట్టిన సినిమా ఇది. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మాధవి, సుమలత, రావుగోపాల్‌రావు కీలక పాత్రల్లో నటించారు.

విజేత

థియేటర్‌లో సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ‘ఏదైనా సాధించాలి’ అన్నంత ఉద్వేగాన్ని, స్ఫూర్తినిచ్చిన చిత్రం ‘విజేత’. చిరంజీవి, భానుప్రియ జంటగా నటించారు. కోదండరామిరెడ్డి తెరకెక్కించారు. హిందీలో వచ్చిన ‘సాహెబ్‌’ చిత్రానికి ఇది రీమేక్‌. 

పసివాడి ప్రాణం

చిరంజీవి, కోదండరామిరెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన మరో రీమేక్‌ ఇది. మలయాళంలో మంచి విజయం సాధించిన ‘పూవిను పుతియా’కు రీమేక్‌గా ‘పసివాడి ప్రాణం’గా తెరకెక్కించారు. ఇందులో చిరంజీవి, విజయశాంతి జంటగా నటించారు. 1987లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లోనే రూ.5కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. దీంతో చిరంజీవి బ్రేక్‌డ్యాన్స్‌ ఒక ట్రెండ్‌ సెట్టర్‌ అయింది. 2015లో హిందీలో వచ్చిన ‘బజ్‌రంగీ భాయీజాన్‌’ను ఈ సినిమా స్ఫూర్తితోనే తెరకెక్కించారు.

ఖైదీ నం.786

ఖైదీగా రెండో విజయాన్ని చిరంజీవి ఈ సినిమాతో తన ఖాతాలో వేసుకున్నారు. తమిళంలో వచ్చిన ‘అమ్మన్‌ కొవిల్‌ కిజకాలె’ అనే చిత్రానికి రీమేక్‌గా ఖైదీ నం.786ను విజయ బాపినీడు తెరకెక్కించారు. చిరంజీవి, భానుప్రియ నటించారు. 

ఘరానా మొగుడు

1986లో వచ్చిన ‘అనురాగ ఆరాలితు’ కన్నడ చిత్రానికి రీమేక్‌గా ‘ఘరానా మొగుడు’ను రాఘవేంద్రరావు తెరకెక్కించారు. చిరంజీవి, నగ్మా జంటగా నటించారు. తెలుగులో రూ.10కోట్లు వసూలు చేసిన తొలి సినిమా ఇదే. ఈ సినిమాతో దేశంలోనే మన మెగాస్టార్‌ అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోగా అవతరించారు. 1993లో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో కూడా ఈ సినిమా ప్రదర్శితమైంది.

హిట్లర్‌

వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందిపడుతున్న చిరంజీవిని ‘హిట్లర్‌’ విజయాల బాటపట్టించింది. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. మలయాళ మాతృక ‘హిట్లర్‌’లో మమ్ముట్టి హీరో.

ఠాగూర్‌

ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ పురస్కారాల వేడుకలో ప్రదర్శితమైందీ చిత్రం. 2003లో వి.వి.వినాయక్‌ తెరకెక్కించారు. చిరంజీవి, జ్యోతిక, శ్రియ నటించారు. తమిళంలో వచ్చిన ‘రమణ’ చిత్రానికి ఇది రీమేక్‌.

శంకర్‌దాదా ఎంబీబీఎస్‌

చిరంజీవికి అవార్డుల పంట పండించిన చిత్రం. జయంత్‌ సి.పరాన్జీ తెరకెక్కించారు. శ్రీకాంత్‌, సొనాలి బింద్రే, పరేశ్‌ రావల్‌ కీలక పాత్రల్లో కనిపించారు. హిందీలో వచ్చిన ‘మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌’ చిత్రానికి రీమేక్‌గా వచ్చిందీ చిత్రం. 2004లో వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో వందరోజులు ఆడటంతో పాటు బాక్సాఫీస్‌ వద్ద రూ.51కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత వచ్చిన ‘శంకర్‌దాదా జిందాబాద్‌’ కూడా హిందీ చిత్ర ‘లగే రహో మున్నాభాయ్‌’కి రీమేక్‌గా వచ్చిందే. ఆ సినిమా కూడా మంచి విజయం సాధించింది.

ఖైదీ నం.150

ఖైదీగా చిరంజీవి కనిపించిన మూడో చిత్రం ఖైదీ నం.150. తమిళ చిత్రం ‘కత్తి’కి రీమేక్‌గా వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కిందీ చిత్రం. దాదాపు దశాబ్దకాలం తర్వాత చిరంజీవి మళ్లీ ఈ సినిమాతో తెరపై కనిపించారు. బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రం భారీ కలెక్షన్లు రాబట్టింది.

 

ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి మరో రీమేక్‌తో రాబోతున్నారు. మలయాళంలో మోహన్‌లాల్‌ హీరోగా వచ్చిన ‘లూసిఫర్‌’ను తెలుగులో తీయబోతున్నారు. మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఆ సినిమా పట్టాలెక్కాల్సి ఉంది. దీని తర్వాత ‘వేదాళం’ రీమేక్‌లోనూ ఆయన నటించనున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని