Dongalunnaru Jagratha review: రివ్యూ: దొంగలున్నారు జాగ్రత్త

Dongalunnaru Jagratha review: శ్రీసింహా నటించిన థ్రిల్లర్‌ మూవీ ఎలా ఉందంటే?

Published : 23 Sep 2022 16:32 IST

చిత్రం: దొంగలున్నారు జాగ్రత్త; నటీనటులు: శ్రీసింహా, సముద్రఖని, ప్రీతి అస్రాని తదితరులు; సంగీతం: కాల భైరవ; ఎడిటింగ్‌: గ్యారీ; సినిమాటోగ్రఫీ: యశ్వంత్‌ సి; నిర్మాత: డి.సురేష్‌బాబు, సునీత్‌ తాటి; దర్శకత్వం: సతీష్‌ త్రిపుర; విడుదల: 23-09-2022

ఈ వారంలో విడుదలైన సినిమాల్లో ప్రధానంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సినిమాలు... మూడు.  అందులో ఒకటి... ‘దొంగలున్నారు జాగ్రత్త’. సర్వైవల్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా ప్రచారంలో నిలిచింది. సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ సమర్పిస్తుండడం... కాన్సెప్ట్‌ చిత్రాలు ఎంచుకుంటూ ప్రయాణం చేస్తున్న శ్రీసింహా నటించడం... సముద్రఖని, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ తదితరులుండటంతో సినిమా చూడాలనే ఆసక్తిని పెంచింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఇంతకీ దొంగలెవరు?

కథేంటంటే: రాజు (శ్రీసింహా కోడూరి) ఓ దొంగ.  కార్లలో ఉండే విలువైన వస్తువుల్ని  దొంగతనం చేస్తుంటాడు. అలా ఒకరోజు దొంగతనం కోసం ఓ కారుని ఎంచుకుంటాడు. తీరా అందులోకి ఎక్కాక లాక్‌ అయిపోతుంది. బయటికి రాకుండా  అందులోనే ఇరుక్కుపోతాడు. అంతలో ఓ వాయిస్‌ అతనికి వినిపిస్తుంది. రాజు అలా కార్‌లో లాక్‌ అయిపోవడం వెనక ఓ వైద్యుడు ఉన్నాడని తెలుస్తుంది. ఇంతకీ ఎవరా  వైద్యుడు? రాజునే ఎందుకు టార్గెట్‌ చేశాడు? కారులోనుంచి అతను బయటపడ్డాడా లేదా? అనేది మిగతాకథ.

ఎలా ఉందంటే: తెలుగు తెరకి ఓ కొత్త జోనర్‌ని పరిచయం చేసిన చిత్రమిది. సర్వైవల్‌ థ్రిల్లర్‌ అంటూ చిత్రబృందం ప్రచారం చేసింది. 4×4 అనే  విదేశీ చిత్రం దీనికి స్ఫూర్తి. పతాక సన్నివేశాలు మినహా దాదాపుగా కథంతా ఒక కారులోనే జరగడం ఈ సినిమా ప్రత్యేకత. అసలు కథలోకి వెళ్లడానికి సమయం పడుతుంది. ఆరంభ సన్నివేశాలు సాగదీతగా, అంతంత మాత్రంగా  అనిపిస్తాయి. దొంగ కారులో ఇరుక్కుపోయాక, అతనికి కారులో వాయిస్‌తో కనెక్ట్‌ అయిన వ్యక్తి పాత్ర మరింత ప్రభావం చూపించడం మొదలుపెట్టాక అసలు కథ జోరందుకున్నట్టు అనిపిస్తుంది.  ఇలాంటి నేర నేపథ్యం ఉన్న కథలకి మరింత ఉత్కంఠ, థ్రిల్లింగ్‌ అంశాలు కీలకం. భావోద్వేగాలతోనూ కట్టిపడేసే ఆస్కారం ఉన్న కథ. ఈ కాన్సెప్ట్‌ బాగానే ఉన్నా దాన్ని ఆసక్తికరంగా తెరపైకి తీసుకు రావడంలో దర్శకుడు విఫలమయ్యారు. దొంగ కారులో లాక్‌ చేయడం వెనక ఉన్న రహస్యం ఒక్కొక్కటిగా బయటకి రావడం ఆసక్తిని రేకెత్తించినా, ఆ తర్వాత సన్నివేశాలతో ఇదొక సాధారణ ప్రతీకార కథలా మారిపోతుంది. దొంగతనాల తర్వాత వాటి తాలూకు ప్రభావం నేపథ్యాన్ని ఆవిష్కరిస్తూ చెప్పిన సందేశం సినిమాకి ప్రధానబలం. పతాక సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. నిడివి తక్కువ అయినా కథ, కథనాలు ప్రేక్షకులపై పెద్దగా ప్రభావం చూపించవు.

ఎవరెలా చేశారంటే: శ్రీసింహా కోడూరి నటన చిత్రానికి ప్రధానబలం. కథంతా తన చుట్టూనే తిరుగుతుంది. కారులోనే కనిపిస్తూ, ప్రతీ సన్నివేశంలోనూ క్లోజప్‌లో కనిపించాల్సి ఉంటుంది. ఇలాంటి పాత్రల్ని పోషించడం కత్తిమీద సాము. ద్వితీయార్ధంలో ఆయన నటన మరింతగా మెప్పిస్తుంది.  సముద్రఖని, శ్రీకాంత్‌, ప్రీతి అస్రాని కీలకమైన పాత్రల్లో కనిపిస్తారు. శుభలేఖ సుధాకర్‌ వాయిస్‌ ఓవర్‌ బలమైన ప్రభావం చూపించింది. సాంకేతిక విభాగాల్లో సంగీతం గురించి మొదట చెప్పుకోవాలి. కాలభైరవ నేపథ్య సంగీతంతో మరోసారి తనదైన ముద్రవేశారు. ఛాయాగ్రాహకుడు యశ్వంత్‌.సి కెమెరా పనితనం మెప్పిస్తుంది. పరిమితుల మధ్యే తనదైన పనితీరుతో ప్రభావం చూపించారు. దర్శకుడు పనితనం కొన్ని సన్నివేశాల్లో మాత్రమే కనిపిస్తుంది. నిర్మాణం సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది.

బలాలు

+ కాన్సెప్ట్‌

సందేశం

నిడివి

బలహీనతలు

- థ్రిల్లింగ్‌ అంశాలు కొరవడటం

ఆరంభ సన్నివేశాలు

చివరిగా: దొంగలున్నారు జాగ్రత్త.. సందేశం ఒక్కటే బాగుంది..

గమనిక: ఈ  సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది.ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని