NTR - Ram Charan: తార్‌మార్‌ తక్కర్‌మార్‌

అగ్ర కథానాయకుడు చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత ఆయన కోసం సీనియర్లు మొదలుకొని... యువతరం దర్శకుల వరకూ కథలు సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికీ ఆయన చుట్టూ యువ దర్శకులే. 

Updated : 25 Apr 2023 11:00 IST

ఓ హీరోతో సినిమా అనుకుంటే సెట్స్‌పైకొచ్చేసరికి వేరొకరు ప్రత్యక్షం
ఊహించని విధంగా మారిపోతున్న కలయికలు

చిత్రసీమలో ఎవరు ఎవరితో జట్టు కడతారో... ఏ కలయికలో సినిమా పట్టాలెక్కుతుందో ఊహించలేం. ఏ కథ ఎవరి కోసం సిద్ధమవుతుందో... అందులో ఎవరు నటిస్తారో చివరి వరకూ ఓ అంచనాకి రాలేం. చిత్ర విచిత్రాలకి నెలవైన చిత్రసీమలో అనూహ్యంగా చోటు చేసుకునే పరిణామాలే ఎక్కువ. దాంతో అంతే అనూహ్యంగా కలయికలు మారిపోతున్నాయి. ఒక హీరోతో అనుకున్న కథలోకి మరో హీరో వస్తున్నాడు. ఒక కథానాయకుడితో కలిసి సినిమా చేయాలనుకున్న దర్శకుడు... మారిన పరిణామాలతో మరో హీరోతో సినిమా చేస్తున్నాడు. ఈ మధ్య టాలీవుడ్‌లో ఈ ధోరణి ఎక్కువగానే కనిపిస్తోంది.  


స్టార్‌ హీరోల సినిమాలంటే బోలెడన్ని లెక్కలు. ఇమేజ్‌... మార్కెట్‌... అభిమానులు... నిర్మాతలతో ఉన్న ఒప్పందాలు... ఇలా ఎన్నెన్నో. అన్నీ కుదిరితేనే సినిమా పట్టాలెక్కుతుంది. ఒక్క విషయం దగ్గర తేడా వచ్చినా అనుకున్న కలయికలో సినిమా పట్టాలెక్కడానికి చాలా సమయం పడుతుంది. అందుకే మొదట కొన్ని కొన్ని కలయికలు ప్రచారంలోకి వచ్చినా... వాళ్లు సినిమా కోసం కొంత దూరం ప్రయాణం చేసినా సరే... అనూహ్యంగా ఆ కలయికలు మారిపోతుంటాయి.  అదే ప్రాజెక్ట్‌ ఎవరూ ఊహించని మరో కొత్త కలయికతో కుదురుతూ ఉంటుంది. గడిచిన రెండు మూడేళ్లలో ఇలాంటి అనూహ్యమైన కలయికలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

గ్ర కథానాయకుడు చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత ఆయన కోసం సీనియర్లు మొదలుకొని... యువతరం దర్శకుల వరకూ కథలు సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికీ ఆయన చుట్టూ యువ దర్శకులే. చిరు రీ ఎంట్రీ సమయంలోనే చిరంజీవి - పూరి జగన్నాథ్‌ కలయికలో సినిమా ప్రచారంలోకి వచ్చింది. ‘ఆటోజానీ’ అనే కథ కూడా  సిద్ధమైంది. కానీ కొన్ని కారణాల రీత్యా ఆ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కలేదు. దాంతో ఆ స్క్రిప్ట్‌ పక్కన పెట్టి దర్శకుడు పూరి జగన్నాథ్‌ వేరే కథానాయకులతో సినిమాలు తీయడం మొదలు పెట్టారు. ‘గాడ్‌ఫాదర్‌’ సినిమా కోసం మొదట ఆ స్క్రిప్ట్‌పై సీనియర్‌ దర్శకుడు వి.వి.వినాయక్‌ కొన్నాళ్లు పనిచేశారు. ఆ తర్వాత ఆయన స్థానంలోకి మోహన్‌రాజా వచ్చి సినిమాని తీశారు. చిరంజీవి - సుజీత్‌ కలయికలోనూ ఓ సినిమా కోసం కొన్ని రోజులు పనులు సాగాయి. కానీ ఆ ప్రాజెక్ట్‌ కుదరలేదు. ఇప్పుడు సుజీత్‌... పవన్‌కల్యాణ్‌తో ‘ఓజీ’ చేస్తున్నారు. కొన్నాళ్ల కిందట చిరంజీవి - వెంకీ కుడుముల కలయికలో సినిమా కుదిరినా... ఆ తర్వాత అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు వెంకీ కుడుముల... నితిన్‌తో సినిమా చేస్తున్నారు. రచన దశలోనూ... పూర్వ నిర్మాణ పనుల దశలోనూ ఒకొక్క సినిమా ఒక్కో కారణంతో ఆగిపోతుంటుంది. మళ్లీ కొత్త బృందాలు రంగంలోకి దిగి మరో సినిమా కోసం కసరత్తులు మొదలుపెడుతుంటాయి.


‘ఆర్‌ఆర్‌ఆర్‌’ హీరోలకూ అదే జరిగింది

రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ల విషయంలోనూ ఇదే జరిగింది. కొన్నేళ్ల కిందట రామ్‌చరణ్‌ - కొరటాల శివ కలయికలో సినిమా కుదిరింది. కానీ అప్పట్లో కార్యరూపం దాల్చలేదు. ‘ఆచార్య’తో ఆ కలయిక కుదిరింది. రామ్‌చరణ్‌ - బుచ్చిబాబు సానా కలయికలో సినిమాని ఎవ్వరూ ఊహించలేదు. మొదట ఎన్టీఆర్‌ - బుచ్చిబాబు కలయికలో సినిమా పక్కా అయ్యింది. ఎన్టీఆర్‌ చేయాల్సిన ప్రాజెక్టులు ఎక్కువగా ఉండటంతో... బుచ్చిబాబు తన కథని రామ్‌చరణ్‌కి వినిపించడంతో ఆయన పచ్చజెండా ఊపారు. ఆ కలయికలో సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత ఎన్టీఆర్‌ - త్రివిక్రమ్‌ కలయికలో సినిమా అనుకున్నారు మొదట. కానీ ఆ స్థానంలో ఎన్టీఆర్‌ - కొరటాల శివ కలయికలో సినిమా మొదలైంది. మరోవైపు త్రివిక్రమ్‌... మహేశ్‌బాబుతో సినిమా చేస్తున్నారు.  అల్లు అర్జున్‌ కూడా ఇదివరకు కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయాలనుకున్నారు. ఆ ప్రాజెక్ట్‌ని అప్పట్లో ప్రకటించారు కూడా. కానీ అల్లు అర్జున్‌ ‘పుష్ప’ కొనసాగింపుపైనే దృష్టి పెట్టారు.


ఇలా మారే చిత్రాలు చాలానే!

సీనియర్‌ కథానాయకుడు వెంకటేష్‌ 75వ సినిమాకి సంబంధించి పూరి జగన్నాథ్‌ మొదలుకొని... తరుణ్‌ భాస్కర్‌ వరకూ పలువురు దర్శకుల పేర్లు వినిపించాయి. కానీ యువ దర్శకుడు శైలేష్‌ కొలను ఆ అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. ఈ కలయికలో  ‘సైంధవ్‌’ సినిమా రూపొందుతోంది. ఇలా తార్‌మార్‌ తక్కెడమార్‌ అనిపించిన ప్రాజెక్టులు చిత్రసీమలో చాలానే. ‘లైగర్‌’ తర్వాత  విజయ్‌ దేవరకొండ - పూరి జగన్నాథ్‌ మరోసారి కలిసి  ‘జనగణమన’ చేయాలనుకున్నారు. కొంత మేర చిత్రీకరణ కూడా చేశారు. ‘లైగర్‌’ పరాజయంతో ఆ ప్రభావం ‘జనగణమన’పై పడింది. ఆ ప్రాజెక్ట్‌ ఆగిపోయింది. విజయ్‌తో ఇప్పుడు యువ దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అంతకుముందు గౌతమ్‌ తిన్ననూరి... రామ్‌చరణ్‌కి కథ వినిపించారు. కానీ ఆ కలయికలో సినిమా కుదరలేదు. నితిన్‌ కథానాయకుడిగా కృష్ణచైతన్య దర్శకత్వంలో సినిమా అనుకున్నప్పటికీ సాధ్యం కాలేదు. ఆ స్థానంలో  కృష్ణచైతన్య... విష్వక్‌సేన్‌తో సినిమా చేస్తున్నారు. శర్వానంద్‌ - కృష్ణచైతన్య కలయిక కూడా ప్రచారంలోకి వచ్చినా.. శర్వానంద్‌ - శ్రీరామ్‌ ఆదిత్య కలయికలో సినిమా పట్టాలెక్కింది. వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా సాగర్‌ కె.చంద్ర సినిమా చేయాలనుకున్నారు. కానీ ఆ స్థానంలో బెల్లంకొండ శ్రీనివాస్‌ కథానాయకుడిగా సాగర్‌ కె.చంద్ర సినిమా పట్టాలెక్కుతోంది. దీంతో ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్లే వరకూ దర్శకుడు ఎవరో, హీరో ఎవరో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని