‘ఇక నేను సినిమా చేయను. వెళ్లిపోతాను’

బాల నటుడిగానే తన నటనా సామర్థ్యం ఏంటో తెలుగు ప్రేక్షకులకు చూపించిన యువ కథానాయకుడు ఎన్టీఆర్‌. గుణశేఖర్‌ దర్శకత్వంలో

Updated : 30 Jan 2020 16:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బాల నటుడిగానే తన నటనా సామర్థ్యం ఏంటో తెలుగు ప్రేక్షకులకు చూపించిన యువ కథానాయకుడు ఎన్టీఆర్‌. గుణశేఖర్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ రాముడిగా నటించిన చిత్రం ‘రామాయణం’. ఎంఎస్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ముఖ్యంగా చిన్నారులకు మంచి వినోదాన్ని పంచింది. ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది.

‘రామాయణం’ చిత్రంలో ఎంతోమంది చిన్నారులు నటించారు. వాళ్లందరినీ అదుపు చేయడం మామూలు విషయం కాదు. చిత్ర యూనిట్‌కు ఇదొక పెద్ద ప్రహసనం. ఒక్కళ్లు కూడా కుదురుగా కూర్చొనేవారు కాదట. ముఖ్యంగా ఇందులో రాముడి పాత్ర వేసిన తారక్‌, తెరవెనుక విపరీతమైన అల్లరి చేసేవాడట. బాణాలు విరగొట్టేసేవాడట. ఇక శివ ధనుర్భంగం సన్నివేశం కోసం చాలా ప్రత్యేకంగా కనపడాలని టేకుతో ఓ విల్లును తయారు చేయించారట దర్శకుడు గుణశేఖర్‌. దాంతో పాటు మరో డూప్లికేట్‌ విల్లును కూడా తయారు చేయించి పక్కన పెట్టారు.

అయితే, షూటింగ్‌ సమయంలో చిత్ర బృందం అంతా సన్నివేశం కోసం సిద్ధం చేసుకుంటుంటే ఎన్టీఆర్‌ మిగతా పిల్లలతో కలిసి డూప్లికేట్‌ విల్లును లేపే ప్రయత్నం చేశారు. అది సులభంగా పైకి లేపగలగడంతో టేకుతో చేసిన విల్లు ఎక్కడుందా? అని వెతికి అందరూ దాన్ని లేపడానికి ప్రయత్నించడం మొదలు పెట్టారు. ఎవరూ పైకి లేపలేకపోయారు. చివరకు తారక్‌ వంతు వచ్చే సరికి దాన్ని బలవంతంగా పైకి లేపి బ్యాలెన్స్‌ చేయలేక కిందపడేయడంతో అది కాస్తా విరిగిపోయింది. దాంతో తారక్‌పై గుణశేఖర్‌కు విపరీతమైన కోపం వచ్చి తిట్టేశారట.

‘ఇక నేను సినిమా చేయను. వెళ్లిపోతాను’ అని ఎన్టీఆర్‌ ఒకటే గోల చేశారట. అంతేకాదు, అన్నపూర్ణా స్టూడియోస్‌లో వానరసైన్యంపై సన్నివేశాలు చిత్రీకరిస్తుంటే, ఆ గెటప్‌లో ఉన్న పిల్లల తోకలు లాగడం, మూతులు పీకడం చేసేవారట తారక్‌. అరణ్యవాసం సన్నివేశాలు తీయడానికి యూనిట్‌ మొత్తం చేలకుడి వెళ్లింది. ఆ సమయంలో అడవిలో విపరీతమైన చలి. పైగా పిల్లలు చొక్కాలు లేకుండా నటించడానికి వణికిపోతుంటే రాముడి పాత్ర ధారి అయిన తారక్‌ వాళ్లని బాణాలతో పొడుస్తూ తెగ ఏడిపించేవాడట.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని