లైట్ల బకాయితో మూతబడిన స్టూడియో

ఆంధ్రప్రదేశ్‌లో మొదటి స్టూడియో రాజమండ్రిలో వెలసిందనేది చరిత్ర. 1936లో ‘సంపూర్ణ రామాయణం’ తీశారు

Published : 03 Feb 2020 15:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆంధ్రప్రదేశ్‌లో మొదటి స్టూడియో రాజమండ్రిలో వెలసిందనేది చరిత్ర. 1936లో ‘సంపూర్ణ రామాయణం’ తీశారు. స్టూడియో పేరు, కంపెనీ పేరు ఒకటే. దుర్గా సినీ టోన్‌. ఒక్క చిత్రంతోనే నిర్మాణం ఆగిపోయింది. ఆ సామాగ్రిని బొబ్బలి రాజావారు, చిక్కవరం జమిందారూ తీసుకుని ఆంధ్ర సినీటోన్‌ పేరుతో విశాఖపట్నంలో స్టూడియో ఏర్పాటు చేశారు. ఆ స్టూడియోలో ‘మోహిని భస్మాసుర(1938), భక్త జయ్‌దేవ్‌(1938), పాశుపతాస్త్ర మూడు సినిమాలు నిర్మించారు.

‘భక్త జయ్‌దేవ్‌’ని హిరేన్‌బోస్‌ డైరక్ట్‌ చేశారు. ‘మోహినీ భస్మాసుర’ను సి.పుల్లయ్య తెరకెక్కించారు. ఇక ‘పాశుపతాస్త్ర’కు కొచ్చెర్లకోట రంగారావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాల కోసం స్టూడియోకి కావాల్సిన లైట్లు ఓ కంపెనీ నుంచి అద్దెకు తెచ్చారు. పై మూడు చిత్రాల తర్వాత, ఇంకో పౌరాణికం ఆరంభమై షూటింగ్‌ దశలో ఉంది. అయితే, లైట్లు ఇచ్చిన కంపెనీకి చెల్లించాల్సిన డబ్బును కట్టాల్సిందని, ఎన్నిసార్లు హెచ్చరికలు పంపినా స్టూడియోవారు పట్టించుకోలేదు. దీంతో ఆ కంపెనీ వాళ్లు అకస్మాత్తుగా స్టూడియోలో ప్రవేశించి, వెలుగుతున్న దీపాల్ని పట్టుకుపోయారట. షూటింగ్‌ ఆగిపోయింది. ఆ తర్వాత కొత్త లైట్లను తీసుకొచ్చే ప్రయత్నం కానీ, బకాయిలు చెల్లించి తీసుకెళ్లిన లైట్లను తిరిగి తీసుకురావడం కానీ చేయలేదు. దాంతో షూటింగ్‌లు లేక స్టూడియో కూడా మూతపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని