Kiran Abbavaram: ఎందుకూ పనికిరావు అన్నవారే స్ఫూర్తి: కిరణ్‌ అబ్బవరం

వరంగల్‌ నిట్‌లో ఏప్రిల్‌ 7 నుంచి స్ప్రింగ్‌ స్వ్రీ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ముందస్తు వేడుకలు మొదలయ్యాయి. త్వరలో విడుదల కానున్న ‘మీటర్‌’ తెలుగు చిత్రం నటీనటులతో సోమవారం మాటామంతి నిర్వహించారు.

Updated : 28 Mar 2023 09:51 IST

నిట్ క్యాంపస్‌, న్యూస్‌టుడే : వరంగల్‌ నిట్‌లో ఏప్రిల్‌ 7 నుంచి స్ప్రింగ్‌ స్వ్రీ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ముందస్తు వేడుకలు మొదలయ్యాయి. త్వరలో విడుదల కానున్న ‘మీటర్‌’ తెలుగు చిత్రం నటీనటులతో సోమవారం మాటామంతి నిర్వహించారు. నటుడు కిరణ్‌ అబ్బవరం, నటి అతుల్య రవి రాగానే.. యువత ఒక్కసారిగా కేరింతలు పెట్టారు. స్టూడెంట్ వెల్ఫేర్‌ డీన్‌ ఆచార్య పులి రవికుమార్‌, ఉత్సవ నిర్వహణ కమిటీ బాధ్యులు స్వాగతం పలికారు. మీటర్‌ చిత్రం టీజర్‌ను తెరపై ప్రదర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు వారు సమాధానాలు ఇచ్చారు. నటుడు కిరణ్‌ మాట్లాడుతూ రాయలసీమ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ పూర్తి చేశానని, బెంగళూరు, చెన్నైలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో ఉద్యోగం చేశానని పేర్కొన్నారు. ఉద్యోగంలో సంతృప్తి లేకపోవడంతో సినిమా రంగంలోకి వచ్చానన్నారు. తొలుత లఘు చిత్రాల్లో నటించానని చెప్పారు. సినిమాలో నటించే విషయం తన కుటుంబ సభ్యులకు చెప్పలేదని, ‘రాజావారు రాణివారు’ చిత్రం తొలి బ్యానర్‌ వచ్చాక తన ఇంట్లో వారికి తెలిసిందన్నారు. అందరూ వరస్ట్‌ స్టూడెంట్ అనే వారని, వరస్ట్‌ ఈజ్‌ ది బెస్ట్‌ అని నిరూపించుకున్నానని చెప్పారు. ఎందుకూ పనికిరావు అన్నవారే తనకు స్ఫూర్తి అన్నారు. నటుడు పవన్‌ కల్యాణ్‌ అంటే ఎంతో ఇష్టమన్నారు. ప్రతి ఒక్కరిలో విషయం ఉంటుంది.. ఏదైనా అనుకుంటే అక్కడే ఆగిపోకుండా ముందుకెళ్లాలి అంటూ స్ఫూర్తి సందేశమిచ్చారు. నటి అతుల్య రవి మాట్లాడుతూ నిట్ విద్యార్థుల్లో ఉత్సాహం చూస్తుంటే తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. అమ్మానాన్న ప్రోత్సాహంతో తాను ఈ స్థాయిలో ఉన్నానని, బాల్యం నుంచి నృత్యం అంటే ఇష్టం ఉన్నప్పటికీ నేర్చుకునే అవకాశం రాలేదన్నారు. మంచి కుటుంబ కథా చిత్రాల్లో నటించాలనేది తన కోరిక అన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి స్టెప్పులు వేశారు. వారితో సెల్ఫీ తీసుకోవడానికి చాలా మంది పోటీపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు