హిట్టు కొట్టగా జట్టుకట్టగా..!

తెలుగు చిత్రసీమలో కథ కంటే.. కలయిక (కాంబినేషన్‌)లకే ఎక్కువ ప్రాధాన్యం అనే మాట తరచూ వినిపించేదే. హీరో - హీరోయిన్‌, హీరో - దర్శకుడు... ఇలా ఏ ఇద్దరు కలిస్తే ప్రేక్షకుల్లో అంచనాలు తారాస్థాయికి వెళతాయో, అలాంటి కలయికలు ఎక్కువగానే కుదురుతుంటాయి. ఇక విజయాలు అందుకున్న కాంబినేషన్‌లో సినిమా అంటే సరే సరి!

Published : 24 Apr 2021 13:32 IST

తెలుగు చిత్రసీమలో కథ కంటే.. కలయిక (కాంబినేషన్‌)లకే ఎక్కువ ప్రాధాన్యం అనే మాట తరచూ వినిపించేదే. హీరో - హీరోయిన్‌, హీరో - దర్శకుడు... ఇలా ఏ ఇద్దరు కలిస్తే ప్రేక్షకుల్లో అంచనాలు తారాస్థాయికి వెళతాయో, అలాంటి కలయికలు ఎక్కువగానే కుదురుతుంటాయి. ఇక విజయాలు అందుకున్న కాంబినేషన్‌లో సినిమా అంటే సరే సరి! క్లాప్‌ కొట్టకముందే వాటిపై ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆత్రుత కనిపిస్తుంటుంది. ముందుస్తు వ్యాపార లావాదేవీల్లోనూ ఆ చిత్రాలు జోరుని ప్రదర్శిస్తుంటాయి. ఈ క్రేజ్‌ని దృష్టిలో ఉంచుకునే... ‘ఓ మంచి కలయికని సెట్‌ చేద్దాం’ అంటూ ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు నిర్మాతలు. అలా సెట్‌ అయ్యిందంటే చాలు... సగం విజయం చేతికందినట్టుగానే భావిస్తుంటారు. తెలుగులో విజయవంతమైన కలయికల్లో సినిమాలు తరచూ రూపొందుతుంటాయి. ఆ దిశగా ఇటీవల మరికొన్ని ప్రాజెక్టులు ఖాయం అయ్యాయి.
ఇది కాంబినేషన్‌ ఫార్ములా
బాలకృష్ణ - బోయపాటి శ్రీనుల.. ‘అఖండ’, అల్లు అర్జున్‌ - సుకుమార్‌ల.. ‘పుష్ప’, వెంకటేష్‌ - వరుణ్‌తేజ్‌ కథానాయకులుగా అనిల్‌ రావిపూడి ‘ఎఫ్‌3’... ఇలా విజయవంతమైన కలయికల్లో రూపొందుతున్న సినిమాలన్నీ ప్రేక్షకుల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నవే. పవన్‌కల్యాణ్‌ - హరీష్‌శంకర్‌ కలయికలోనూ మరో సినిమా ఖరారైన సంగతి తెలిసిందే. ‘గబ్బర్‌సింగ్‌’ తర్వాత ఆ ఇద్దరూ కలిసి చేస్తున్న ఆ చిత్రం ఇంకా సెట్స్‌పైకి  వెళ్లనేలేదు. అప్పుడే అభిమానులు ఆ సినిమా గురించి ప్రత్యేకమైన ఆసక్తితో మాట్లాడుకుంటున్నారు. ఆ కాంబినేషన్లకి ఉన్న బలం అలాంటిది. అందుకే దర్శకులు, హీరోలు మంచి కథ కుదిరిందంటే మళ్లీ మళ్లీ కలిసి పని చేసేందుకు రెడీ అవుతుంటారు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ తర్వాత ఆ కలయికలో ‘బంగార్రాజు’ కోసం ఎప్పట్నుంచో సన్నాహాలు జరుగుతున్నాయి. ‘మనం’ తర్వాత నాగచైతన్య - విక్రమ్‌ కె.కుమార్‌ మరోసారి కలిసి ‘థ్యాంక్‌ యూ’ చిత్రం చేస్తున్నారు. ‘నారప్ప’, ‘టక్‌ జగదీష్‌’, ‘ఖిలాడి’ తదితర చిత్రాలూ ఇదివరకు పునరావృతమైన జట్లతో రూపొందుతున్నవే.  

అయినా సరే..
‘అరవింద సమేత’ తర్వాత ఎన్టీఆర్‌ - త్రివిక్రమ్‌ కలిసి మరో చిత్రాన్ని ప్రకటించారు. విజయవంతమైన కలయికలో రావల్సిన ఆ సినిమా అనూహ్యంగా రద్దయింది. ఆ స్థానంలో ఎన్టీఆర్‌ - కొరటాల శివ సినిమా ఖరారైంది. ఇదీ విజయవంతమైన కలయికలో సినిమానే అయ్యింది. వీళ్లిద్దరూ అంతకుముందు ‘జనతా గ్యారేజ్‌’ చేసిన విషయం తెలిసిందే. ఈసారి పాన్‌ ఇండియా స్థాయి కథతో సినిమా చేయనున్నట్టు ప్రకటించారు. అలాగే ‘రంగస్థలం’ తర్వాత రామ్‌చరణ్‌-సుకుమార్‌ జట్టు మరో సినిమాకీ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరూ కలిసి ఎప్పుడు రంగంలోకి దిగినా సరే, ఆ సినిమాని ‘రంగస్థలం’ విజయాన్ని మించిన అంచనాలతోనే చూస్తారనడంలో సందేహం లేదు. తన తదుపరి సినిమాని ఎన్టీఆర్‌తో చేయాల్సిన త్రివిక్రమ్‌... మహేష్‌తో కలిసి రంగంలోకి దిగనున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌ పునరావృతం అవుతున్నదే. మహేష్‌ - త్రివిక్రమ్‌ కలయికలో ఇదివరకు ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే.  
కొత్త కొత్తగా...
తెలుగు చిత్రసీమలో కొత్త కలయికల జోరు ఎక్కువగానే కనిపిస్తోంది. సెట్స్‌పై ఉన్న ‘హరి హర వీరమల్లు’, ‘రాధేశ్యామ్‌’, ‘ఆచార్య’, ‘లైగర్‌’ తదితర చిత్రాలు కొత్త కలయికల్లో రూపొందుతున్నవే. మహేష్‌ - ఎస్‌.ఎస్‌.రాజమౌళి, ప్రభాస్‌ - ప్రశాంత్‌ నీల్‌, ఎన్టీఆర్‌ -  బుచ్చిబాబు, పవన్‌కల్యాణ్‌ - సురేందర్‌రెడ్డి కలయికల్లోనూ సినిమాలకి రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. మొత్తంగా తెలుగు చిత్రసీమలో కొన్ని సినిమాలు కొత్త,  కొన్నేమో పాత కలయికలతో రూపొందుతూ ప్రేక్షకుల్ని ఊరిస్తున్నాయి.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని