Bhoomi Shetty: ఇంట్లోవాళ్లు నాతో ఆరేళ్లు మాట్లాడలేదు.. హేళన చేశారు: భూమి శెట్టి

‘షరతులు వర్తిస్తాయి’తో నటిగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ భూమిశెట్టి (Bhoomi Shetty). సహజమైన నటనతో తెలుగువారిని మెప్పించారామె. 

Published : 17 Mar 2024 13:14 IST

హైదరాబాద్‌: సీరియల్‌ నటిగా కెరీర్‌ మొదలుపెట్టి.. అనతికాలంలోనే హీరోయిన్‌గా మారి సినిమాల్లోకి అడుగుపెట్టిన కన్నడ భామ భూమి శెట్టి. ఆమె కథానాయికగా నటించిన ‘షరతులు వర్తిస్తాయి’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తన కెరీర్‌ ఎలా మొదలైందో.. శరీర రంగు విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయో ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

‘‘మా సొంతూరు కర్ణాటకలోని కుందపుర. మాదొక రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. జీవితంలో ఏదైనా సాధించాలనే తపన చిన్నప్పటి నుంచి నాకు ఉండేది. కాకపోతే ఇంట్లోవాళ్లు కొన్ని హద్దులు పెట్టారు. ఇంజినీరింగ్‌ చదువుకోవడానికి బెంగళూరు వెళ్తానంటే అంగీకరించలేదు. ‘డిగ్రీ చదువుకుని పెళ్లి చేసుకో. బెంగళూరు వెళ్తే నీతో మాట్లాడం’ అని చెప్పారు. వాటన్నింటినీ పక్కన పెట్టి బెంగళూరు వెళ్లా. ఆరేళ్లు వాళ్లు నాతో మాట్లాడలేదు. చదువుతున్న రోజుల్లోనే ఓ మ్యాగజైన్‌ ఫొటోషూట్‌లో పాల్గొన్నా. ఎన్నో ఆడిషన్స్‌ తర్వాత సీరియల్‌లో నటించే అవకాశం వచ్చింది. నటిని అయ్యాక ఓ రియాల్టీ షోలో పాల్గొని.. కుటుంబానికి క్షమాపణలు చెప్పా. అప్పటి నుంచి వాళ్లు నాతో మాట్లాడటం మొదలుపెట్టారు’’

‘‘శరీర రంగు విషయంలో చిన్నతనం నుంచి అవమానాలు ఎదుర్కొన్నాను. ఎన్నోసార్లు బాధపడ్డా. ఫంక్షన్స్‌కూ వెళ్లేదాన్ని కాదు. ‘ఇలా ఉంటే ఎవరు పెళ్లి చేసుకుంటారు?’, ‘తెల్లగా మారడానికి ఏదైనా సౌందర్య ఉత్పత్తులు వాడొచ్చు కదా’ అంటూ పలువురు సన్నిహితులు చెప్పేవారు. ఇప్పటికీ ఇన్‌స్టాలో నేను ఫొటోలు షేర్‌ చేస్తే.. నల్లగా ఉన్నానని కామెంట్స్‌ చేస్తుంటారు. వాటిని పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే నేను ఎంత అందంగా ఉన్నానో నాకు తెలుసు’’ అని ఆమె బదులిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని