ఫిబ్రవరిలో బొమ్మ హిట్టేనా..!

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌ నుంచి తెలుగు చిత్రపరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ‘క్రాక్‌’ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకోవడమే కాకుండా అధిక మొత్తంలో ...

Updated : 28 Feb 2021 15:34 IST

‘జాంబీరెడ్డి’ టు ‘చెక్‌’ వయా ‘ఉప్పెన’

ఇంటర్నెట్‌డెస్క్‌: లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌ నుంచి తెలుగు చిత్రపరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ‘క్రాక్‌’ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకోవడమే కాకుండా అధిక మొత్తంలో వసూళ్లను రాబట్టడంతో దర్శక నిర్మాతల్లో ఆశలు చిగురించాయి. ఈ క్రమంలోనే కేంద్రప్రభుత్వం థియేటర్లలో నూరు శాతం ఆక్యుపెన్సీకి ఓకే అనడంతో చిత్రపరిశ్రమలో ఆనందం అంబరాన్ని తాకింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నెలలో పలు చిత్రాలు థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించాయి. వాటిల్లో కొన్ని చిత్రాలు మంచిటాక్‌ను తెచ్చుకున్నాయి. ఇంతకీ ఈ నెలలో విడుదలైన సినిమాలు ఏమిటి? హిట్‌ అందుకున్నాయా? లేదా?

సరికొత్త జానర్‌..

హాలీవుడ్‌లో జాంబి జానర్‌ చిత్రాలు తరచూ వస్తుంటాయి. తెలుగుకి మాత్రం కొత్త‌. ఆద్యంతం ఆస‌క్తిని రేకెత్తిస్తూ సాగే ఈ క‌థ‌ల్లో కావ‌ల్సినంత థ్రిల్ ఉంటుంది. అందుకే ఆ జాన‌ర్ విజ‌య‌వంత‌మైంది. తెలుగు ప్రేక్షకులకు జాంబి జానర్‌ను పరిచయం చేస్తూ ప్రశాంతవర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘జాంబీరెడ్డి’. బాలనటుడిగా సుపరిచితులైన తేజ సజ్జా ఈ సినిమాతో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఫిబ్రవరి 5న విడుదలైన ‘జాంబీరెడ్డి’ ప్రేక్షకుల నుంచి మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.

రివ్యూ జాంబీరెడ్డి

కామెడీ + భావోద్వేగం..

టైటిల్‌తోనే సినీప్రియుల్ని ఆకర్షించిన చిత్రం ‘ఎఫ్‌సీయూకే (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌)’. విద్యాసాగ‌ర్ రాజు ద‌ర్శకుడు. జగపతిబాబు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో రామ్ కార్తీక్ - అమ్ము అభిరామి జంట‌గా కనిపించారు. బేబీ స‌హ‌శ్రిత కీలక పాత్ర పోషించింది. కామెడీతోపాటు భావోద్వేగాలు కూడా సమానంగా ఉన్నప్పటికీ ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ స్పందనలకే పరిమితమైంది.

రివ్యూ:‘ఎఫ్‌సీయూకే’ (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌)

ఉప్పెనంత విజయం

వైష్ణవ్‌ తేజ్‌, కృతిశెట్టి నటీనటులుగా వెండితెరకు పరిచయమైన చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రిమూవీ మేకర్స్‌ నిర్మించింది. ‘ప్రేమంటే పట్టుకోవడం నాన్నా. వదిలేయడం కాదు’, ‘నువ్వంటే అదో మాదిరి ఇష్టం బేబమ్మ’... ఇలాంటి డైలాగులతో ట్రైలర్‌లోనే ప్రేక్షకుల్ని అలరించిన ఈ సినిమా ఫిబ్రవరి 12 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఘన విజయాన్ని నమోదు చేసుకుని భారీ కలెక్షన్స్‌తో బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది.

రివ్యూ: ఉప్పెన

థ్రిల్‌ మిస్‌..

థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కి కన్నడంలో మంచి విజయాన్ని సాధించిన ‘కావలుధారి’ని తెలుగులోకి ‘కపటధారి’గా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ప్రదీప్ కృష్ణ‌మూర్తి దర్శకత్వంలో సుమంత్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 12న విడుదలయ్యింది. కథలో ఎన్నో మలుపులు ఉన్నప్పటికీ థ్రిల్‌ మిస్‌ కావడంతో సాధారణ టాక్‌కే ఇది పరిమితమైంది.

రివ్యూ: క‌ప‌ట‌ధారి

బ్లాక్‌బస్టర్‌ జస్టిస్‌..

దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత కథానాయకుడు నరేష్‌ను ‘నాంది’ రూపంలో విజయం వరించింది. విజయ్‌ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలకపాత్ర పోషించారు. భార‌తీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 211 గురించి అవగాహన కలిగించేలా రూపొందించిన ఈ సినిమా ఫిబ్రవరి 19న విడుదలై హిట్‌ టాక్‌ను అందుకుంది.

రివ్యూ: నాంది

ప్రతీకార కథతో అక్షర

బి. చిన్నికృష్ణ డైరెక్షన్‌లో నందితాశ్వేత కీలకపాత్రలో నటించిన చిత్రం ‘అక్షర’. నేటి విద్యా వ్యవ‌స్థ తీరునీ... ర్యాంకుల  కోసం కార్పొరేట్ సంస్థలు విద్యార్థుల జీవితాలతో చెల‌గాట‌మాడుతున్న వైనాన్నీ స్పృశిస్తూ సాగే క‌థ ఇది. అయితే విద్యావ్యవ‌స్థలోని మంచి చెడుల కంటే కూడా... ఓ యువ‌తి ప్రతీకార క‌థే హైలైట్ అయ్యింది. ఫిబ్రవరి 26న విడుదలైంది ఈ సినిమా.

రివ్యూ: అక్షర‌

‘చెక్‌’

‘ఐతే’, ‘అనుకోకుండా ఒక రోజు’ లాంటి విభిన్నకథా చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు చంద్రశేఖర్‌ యేలేటి. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘చెక్‌’. నితిన్‌ కథానాయకుడు. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఉగ్రవాది అనే ముద్రపడిన ఓ ఖైదీ బయటకు ఎలా వస్తాడు?అతనికి క్షమాభిక్ష దొరికిందా?లేదా? అనే ఉత్కంఠకు గురి చేసే కథతో తెరకెక్కిన ‘చెక్‌’ కొన్ని మెరుపులతో పర్వాలేదనిపించింది.

రివ్యూ: చెక్‌

ఇవి మాత్రమే కాకుండా ఉదయ్‌ శంకర్‌ హీరోగా నటించిన ‘క్షణక్షణం’, విశాల్‌ కథానాయకుడిగా నటించిన ‘చక్ర’ చిత్రాలు థియేటర్లలో విడుదలై పర్వాలేదనిపించాయి. వీటితోపాటు ఓటీటీ వేదికగా విడుదలైన ‘మిడ్‌నైట్‌ మర్డర్స్‌’, ‘దృశ్యం-2’.. థ్రిల్లర్‌ కథాంశాలతో ఆకట్టుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని