చిన్నారుల అశ్లీల దృశ్యాలతో వెబ్‌సైట్‌.. యూకేలో ఎన్నారై వైద్యుడి దుశ్చర్య

లండన్‌లో నివసిస్తున్న ఓ భారత వైద్యుడు (Indian Doctor) నీచమైన పనిచేస్తూ పోలీసులకు చిక్కాడు. చిన్నారుల వేధింపుల దృశ్యాలతో వెబ్‌సైట్‌ నడిపి జైలుపాలయ్యాడు.

Published : 26 Jun 2023 13:37 IST

లండన్‌: పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న ఓ ప్రవాస భారతీయుడు పాడు పని చేశాడు. చిన్నారుల లైంగిక వేధింపులకు (child sexual abuse) సంబంధించిన దృశ్యాలతో ఓ వెబ్‌సైట్‌ నడుపుతూ పోలీసులకు చిక్కాడు. దీంతో అతడికి యూకే (UK)లోని ఓ న్యాయస్థానం ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

లండన్‌ (London)లో నివసిస్తున్న డాక్టర్‌ కబీర్‌ గార్గ్‌ వృత్తిరీత్యా సైకియాట్రిస్ట్‌. అయితే, గతకొంతకాలంగా అతడు ‘ది అనెక్స్‌’ అనే డార్క్‌ నెట్‌ వెబ్‌సైట్‌కు మోడరేటర్‌, అడ్మినిస్ట్రేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ వెబ్‌సైట్‌కు ప్రపంచవ్యాప్తంగా 90వేల మంది సభ్యులున్నారు. ఇందులో నిత్యం చిన్నారుల లైంగిక వేధింపుల (child sexual abuse) దృశ్యాలు, ఫొటోలకు సంబంధించి వందలాది లింక్‌లను షేర్‌ చేస్తుంటారు. ఈ వెబ్‌సైట్ గురించి యూకే నేషనల్‌ క్రైమ్‌ ఏజెన్సీకి సమాచారం రావడంతో అధికారులు దీనిపై నిఘా పెట్టారు.

ఈ క్రమంలోనే గతేడాది నవంబరులో కబీర్‌ గార్గ్‌ను తన ఫ్లాట్‌లో అరెస్టు చేశారు. ఆ సమయంలో గార్గ్‌ తన లాప్‌టాప్‌ ఆన్‌ చేసి ఈ వెబ్‌సైట్‌లో మోడరేటర్‌గా లాగిన్‌ అయి ఉన్నట్లు అధికారులు తెలిపారు. అతడి లాప్‌టాప్‌ నుంచి చిన్నారులకు సంబంధించి 7 వేల అశ్లీల చిత్రాలు, వీడియోలు, పలు మెడికల్‌ జర్నల్‌ ఆర్టికల్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ‘‘ఏ స్టడీ ఆన్‌ ఛైల్డ్‌ అబ్యూస్‌ ఇండియా’ అనే జర్నల్‌ కూడా ఉన్నట్లు తెలిపింది. దీంతో గార్గ్‌ను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. నేరం రుజువవడంతో ఈ ఏడాది జనవరిలో కోర్టు అతడిని దోషిగా తేల్చింది. తాజాగా వూల్‌విక్‌ క్రౌన్‌ కోర్ట్‌ అతడికి ఆరేళ్ల జైలు శిక్ష విధించింది.

భారత్‌కు చెందిన కబీర్‌ గార్గ్‌ లఖ్‌నవూలోని కింగ్‌ జార్జ్‌ మెడికల్‌ యూనివర్శిటీ నుంచి ఎంబీబీఎస్‌ పూర్తి చేశాడు. ఆ తర్వాత కొంతకాలం బెంగళూరులోని నేషనల్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్ హెల్త్‌ అండ్‌ న్యూరోసైన్సెస్‌లో పనిచేశారు. అనంతరం యూకే వెళ్లి అక్కడే స్థిరపడినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని