T20 League : ఈ కెరటాలు మళ్లీ ఎగసేనా.?

వాళ్లంతా మేటి ఆటగాళ్లే.. ఎల్లలు దాటే ఫ్యాన్‌ ఫాలోయింగ్‌, ఒంటి చేత్తో మ్యాచ్‌ను శాసించగల సత్తా.. చెప్పుకుంటూ పోతే ఎన్నో రికార్డులు.. అందులో ఎలాంటి

Updated : 26 Mar 2022 13:18 IST

గత సీజన్‌లో పెద్దగా రాణించని ఆటగాళ్లు వీరే..

వాళ్లంతా మేటి ఆటగాళ్లే.. ఎల్లలు దాటే ఫ్యాన్‌ ఫాలోయింగ్‌, ఒంటి చేత్తో మ్యాచ్‌ను శాసించగల సత్తా.. చెప్పుకుంటూ పోతే ఎన్నో రికార్డులు.. అందులో ఎలాంటి సందేహమూ లేదు. ఈ లెక్కలు చూసే కోట్ల రూపాయలు కుమ్మరించి మరీ ఫ్రాంచైజీలు వారిని కొనుగోలు చేశాయి. అయినా ఏం లాభం..? ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్‌’ అన్నట్టుగా గత సీజన్‌లో వారి ప్రదర్శన చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. అయినప్పటికీ త్వరలో ప్రారంభం కానున్న మెగా టోర్నీలోనూ చూపులన్నీ వారిపైనే.!

బౌన్స్ బ్యాక్‌ అవుతాడా..?

 

తన సారథ్యంలో హైదరాబాద్‌కు ట్రోఫీని తెచ్చిపెట్టిన ఘనుడు డేవిడ్‌ వార్నర్‌. 848, 641, 692, 548.. వంటి భారీ పరుగులతో పలు సీజన్లలో మెరిసిన వార్నర్‌.. 2021 ఏడాదిలో మాత్రం పరుగుల కోసం చాలా కష్టాలే పడ్డాడు. ఆ సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన వార్నర్‌ కేవలం 195 పరుగులే చేశాడు. టోర్నీ మొత్తంలో రెండు హాఫ్‌ సెంచరీలు నమోదు చేసినప్పటికీ బ్యాటింగ్‌ సగటు 24.37గా ఉండటం గమనార్హం. అయితే, ఏ కారణం లేకుండా హైదరాబాద్‌ జట్టు నుంచి తప్పించడం, కెప్టెన్సీ నుంచి తనను తొలగించడం బాధించాయని సీజన్‌ తర్వాత వార్నర్‌ వాపోయాడు. అనంతరం జరిగిన టీ20 ప్రపంచకప్‌లో అతడు 289 పరుగులతో చెలరేగి.. ఆస్ట్రేలియా తొలిసారి టీ20 ప్రపంచకప్‌ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

ఇదిలా ఉంటే.. ఈసారి మెగా వేలంలో వార్నర్‌ను దిల్లీ రూ.6.25 కోట్లకు కొనుగోలు చేసింది. మెగా టోర్నీలో ఎక్కడ మొదలెట్టానో అక్కడికే వచ్చానని వార్నర్‌ ఇటీవల సంతోషం వ్యక్తం చేశారు. మరి మార్చి 26 నుంచి ప్రారంభమయ్యే 15వ సీజన్‌లో ఈ స్టార్ బ్యాటర్‌ ఎలా విజృంభిస్తాడో.?చూడాలి.

మిస్టర్‌ కూల్‌ కూడా..!

అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పిన తర్వాత మిస్టర్‌ కూల్‌ మహేంద్ర సింగ్‌ ధోనీకి గత సీజన్‌ మొదటిది. తన సారథ్యంలో 2021 ఏడాదిలో జట్టుకు మరో కప్పు అందిచినప్పటికీ వ్యక్తిగతంగా ధోనీ ప్రదర్శన పెద్దగా ఆకట్టుకోలేదు. 2021లో మొత్తం 16 మ్యాచ్‌ల్లో 14 ఇన్నింగ్స్‌లు ఆడిన ధోనీ 106.54 స్ట్రైక్ రేట్‌తో కేవలం 114 పరుగులే చేశాడు. మిడిలార్డర్‌లో వచ్చినప్పటికీ ధోనీ అత్యధిక పరుగులు 18 నాటౌట్‌గా ఉండటం గమనార్హం. అయితే, కెరీర్‌లో అత్యంత విజయమంతమైన ధోనీని ఈ లెక్కలు చూసి ఓ అంచనా వేయలేం విపత్కర పరిస్థితుల్లోనూ తన ఆలోచన శక్తితో జట్టును విజయ తీరాలకు చేర్చే సత్తా ఈ మహేంద్రుడికే చెల్లుతుంది. అందువల్లే ఈ సీజన్‌లో ధోనీని వేలంలో వదులుకోకుండా కెప్టెన్‌గా అంటిపెట్టుకుంది చెన్నై.

హార్దిక్‌ నడిపిస్తాడా..?

ఫామ్‌లేమితో గత రెండేళ్లుగా క్రికెట్‌కు దూరమైన టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్‌ పాండ్య ఈ సీజన్‌లో కొత్త జట్టు గుజరాత్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. ఇన్నాళ్లు ముంబయిలో పేస్‌-ఆల్‌ రౌండర్‌గా ఉన్న హార్దిక్‌.. గతేడాది పెద్దగా రాణించలేదు. మొత్తంగా 12 మ్యాచ్‌ల్లో 11 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 127 పరుగులే చేశాడు. జట్టులో ఆల్‌రౌండర్‌గా ఉన్నప్పటికీ గత రెండు సీజన్లలో హార్దిక్‌ బౌలింగ్‌పై ముంబయి ఎప్పుడూ ఆధారపడలేదు. అయితే, ప్రస్తుతం బాగా సన్నద్ధమయ్యానని గ్యారంటీ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఒకప్పుడు ముంబయి జట్టులో కీలక ఆల్‌రౌండర్‌గా వెలుగొందిన హార్దిక్‌.. ప్రస్తుత సీజన్‌లో కొత్త జట్టును ఎలా నడిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.

నికోలస్ లెక్క తప్పలేదా..!

టీ20 క్రికెట్‌లో విధ్వంసకర పవర్‌ హిట్టర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు విండీస్ ఆటగాడు నికోలస్‌ పూరన్‌. గతేడాది పంజాబ్‌ తరఫున ఆడిన ఇతడు నాలుగు సార్లు డకౌటై చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. పైగా 12 మ్యాచుల్లో 11 ఇన్నింగ్స్‌లు ఆడి 85 పరుగులే చేశాడు. దీంతో ఈసారి పూరన్‌ను పంజాబ్‌ వదులుకుంది. అయినా, వేలంలో విండీస్‌ ఆటగాళ్లలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. 2022 వేలంలో రూ.10.75 కోట్లకు హైదరాబాద్‌ కొనుగోలు చేసింది. ఈ మేరకు తన లెక్క తప్ప లేదని ఇటీవల టీమ్‌ఇండియాతో జరిగిన టీ20 సిరీస్‌లో విధ్వంసర బ్యాటింగ్‌తో బదులు చెప్పాడు నికోలస్‌.

అయినా ఖరీదైన ఆటగాడిగా..

ముంబయి టాప్‌-ఆర్డర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ కూడా గతేడాది 10 మ్యాచుల్లో కేవలం 241 పరుగులే చేశాడు. అదనపు బౌలర్‌ను ఆడించడానికి పలు సందర్భాల్లో ఇషాన్‌ను జట్టు పక్కన పెట్టాల్సి వచ్చింది. దీని బట్టి అతడు గతేడాది పెద్దగా రాణించలేదనే చెప్పాలి. అయినప్పటికీ 2022 మెగా వేలంలో ముంబయి రూ.15.25 కోట్లతో ఇషాన్‌ కిషన్‌ని దక్కించుకుంది. దీంతో మెగా టోర్నీ చరిత్రలో అత్యంత ఖరీదైన రెండో భారతీయ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

మరికొందరు..

* పేపర్‌పై విజయ్‌ శంకర్‌ మంచి ఆటగాడే. డెత్‌ ఓవర్లలో ఫినిషింగ్ బ్యాటర్‌గా రాణించగలడనే పేరుంది. దాంతో పాటు ఫీల్డింగ్, బౌలింగ్‌ల్లోనూ సత్తా చాటగలడు. అయితే, గత సీజన్‌లలో హైదరాబాద్‌ తరఫున ఆడిన విజయ్‌ పూర్తిగా నిరాశ పరిచాడు. 7 మ్యాచుల్లో కేవలం 28 పరుగులే చేశాడు. తాజాగా గుజరాత్ రూ.1.40 కోట్లకు ఇతడిని కొనుగోలు చేసింది.

* 2020 గతేడాది రాజస్థాన్‌ జట్టులో ఆల్‌రౌండర్‌గా రాహుల్‌ తెవాటియా అందరి దృష్టి ఆకర్షించాడు. కానీ, 2021 సీజన్‌లో మాత్రం పెద్దగా రాణించలేదు. 14 మ్యాచుల్లో 8 వికెట్లు, 11 ఇన్నింగ్స్‌ల్లో 155 పరుగులే చేశాడు. ఈసారి గుజరాత్‌ తెవాటియాను రూ.9 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది.

* గతేడాది దిల్లీ తరఫున ఆడిన రవిచంద్రన్‌ అశ్విన్‌ 13 మ్యాచుల్లో కేవలం 7 వికెట్లు మాత్రమే తీశాడు. తాజా మెగా వేలంలో అశ్విన్‌ను రాజస్థాన్రూ .5 కోట్లకు కొనుగోలు చేసింది.

* హైదరాబాద్‌ తరఫున ఆడిన భువనేశ్వర్‌ 11 మ్యాచుల్లో ఆరు వికెట్లే పడగొట్టాడు. అయినా ఈ రికార్డును పక్కనపెట్టింది హైదారాబాద్ యాజమాన్యం. 2022 మెగా వేలంలో రూ.4.2 కోట్లతో తిరిగి భువీని వెనక్కి తీసుకుంది. 

* ముంబయి తరఫున ఆడిన కృనాల్‌ పాండ్య 13 మ్యాచుల్లో.. 12 ఇన్నింగ్స్‌ల్లో ఆడి కేవలం 140 పరుగులు చేసి, ఐదు వికెట్లు పడగొట్టాడు. 

ఇక ఎన్ని అంచనాలు పెట్టుకున్నా.. మైదానంలో అడుగు పెట్టాక అవన్నీ తారుమారు అవుతాయి. గత సీజన్‌ లెక్కలే ఇందుకో ఉదాహరణ. ఒక సీజన్‌లో పేలవ ప్రదర్శన చేసినంతా మాత్రానా ఆటగాళ్ల ఆటతీరులో ఎటువంటి మార్పు ఉండదు. ఇలా పడిన వాళ్లే ఎన్నోసార్లు బౌన్స్‌ బ్యాకై చరిత్ర సృష్టించారు. అందువల్లే ఒక సీజన్‌ లెక్కలను పరిగణనలోకి తీసుకోకుండా ఆటగాళ్ల దీర్ఘకాలిక ఆట తీరును బట్టే ఫ్రాంచైజీలు భారీ మొత్తాలు చెల్లిస్తుంటాయనేది విదితమే. 

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని