olympics: ఒలింపిక్స్‌ చరిత్రలో పతకానికి అడుగు దూరంలో నిలిచిపోయిన మన అథ్లెట్లు!

టోక్యోలో జరిగిన 2020 ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఒక స్వర్ణం సహా ఏడు పతకాలను భారత్‌ ఖాతాలో వేశారు. భారత్‌ అత్యధిక పతకాలు సాధించింది ఈ ఒలింపిక్స్‌లోనే. అయితే, మరికొంత మంది అథ్లెట్లు కూడా కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసేలా కనిపించారు. కానీ, పతక పోరులో

Published : 09 Aug 2021 18:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టోక్యోలో జరిగిన 2020 ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఒక స్వర్ణం సహా ఏడు పతకాలను భారత్‌ ఖాతాలో వేశారు. భారత్‌ అత్యధిక పతకాలు సాధించింది ఈ ఒలింపిక్స్‌లోనే. అయితే, మరికొంత మంది అథ్లెట్లు కూడా కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసేలా కనిపించారు. కానీ, కాంస్య పోరులో నాలుగోస్థానానికి పరిమితమై ఆ పతకాన్ని చేజార్చుకున్నారు. ఇప్పుడే కాదు.. ఒలింపిక్స్‌లో చరిత్రలో ఇలా నాలుగోస్థానంలో నిలిచి పతకానికి అడుగు దూరంలో ఆగిపోయిన భారత అథ్లెట్లు కొంతమంది ఉన్నారు. వారెవరంటే..!

రణధీర్‌ షిండేస్‌ - ఆంట్వెర్ప్‌(బెల్జియం),1920

ఆంట్వెర్ప్‌-1920 ఒలింపిక్స్‌లో భారతీయులు తొలిసారి పాల్గొన్నారు. ముగ్గురు అథ్లెట్లు, ఇద్దరు రెజ్లర్లు భారత్‌కు ప్రాతినిథ్యం వహించారు. ఈ ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాలు రాలేదు. కానీ.. రెజ్లర్‌ రణ్‌ధీర్‌ షిండేస్‌ స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చారు. ప్రత్యర్థులను చిత్తు చేస్తూ సెమీఫైనల్‌కు చేరుకున్న రణధీర్‌ ఆ మ్యాచ్‌లో ఓడిపోయారు. కాంస్యం కోసం జరిగిన పోటీలోనూ వెనుకబడటంతో రణధీర్‌ నాలుగోస్థానంలో నిలిచి.. తృటిలో పతకాన్ని చేజార్చుకున్నారు.


ఫుట్‌బాల్‌ జట్టు - మెల్‌బోర్న్‌(ఆస్ట్రేలియా),1956

ఇప్పటికీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో భారత్‌ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోతుంది. కానీ, 1956 ఒలింపిక్స్‌లో మన భారత ఫుట్‌బాల్‌ జట్టు దుమ్మురేపింది. లీగ్‌ మ్యాచ్‌లను దాటి క్వార్టర్‌ఫైనల్‌లో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాను ఓడించి సెమీఫైనల్‌ వరకు దూసుకెళ్లింది. అయితే, సెమీస్‌లో యూగోస్లేవియా జట్టు భారత్‌పై ఆధిపత్యం చలాయించడంతో ఓటమి తప్పలేదు. కాంస్య కోసం ఆడిన మ్యాచ్‌లోనూ బల్గేరియా చేతిలో ఓడిపోవడంతో భారత్‌ నాలుగుస్థానానికి పరిమితమైంది. కాంస్య పతకం ఆశలు చెదిరిపోయాయి.


మిల్కా సింగ్‌ - రోమ్‌ (ఇటలీ),1960

మిల్కాసింగ్‌.. ఒలింపిక్స్‌లో పతకం సాధించకపోయినా భారతీయుల మనసు గెలిచిన అథ్లెట్‌. 1960లో నిర్వహించిన ఒలింపిక్స్‌లో మిల్కాసింగ్‌ పురుషుల 400 మీటర్ల స్ప్రింట్‌లో పాల్గొన్నారు. అయితే, ఇందులో మిల్కాసింగ్‌ నలుగోస్థానంలో నిలిచారు. కేవలం 0.1 సెకన్‌ తేడాతో కాంస్య పతకం దక్కించుకునే అవకాశాన్ని కోల్పోయారు. పరుగును మిల్కాసింగ్‌ 45.6 సెకన్లలో పూర్తిచేయగా.. అతడి కంటే ముందుగా 45.5 సెకన్లలో పరుగు పూర్తి చేసి దక్షిణాఫ్రికా అథ్లెట్‌ మాల్కోమ్‌ స్పెన్స్‌ కాంస్యం గెలుచుకున్నాడు.


మహిళల హాకీ జట్టు - మాస్కో(రష్యా),1980

భారత మహిళల హాకీ జట్టు 1980 ఒలింపిక్స్‌లో తొలిసారి అడుగుపెట్టింది. పోలాండ్‌, ఆస్ట్రియాతో జరిగిన తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన భారత జట్టు.. ఆ తర్వాత ఓటములు చవిచూసింది. ఫలితంగా జింబాబ్వే స్వర్ణం సాధించగా.. చెకోస్లేవియా రజతం, ఆతిథ్య దేశం సోవియట్‌ యూనియన్‌(రష్యా) కాంస్య పతకాలు కైవసం చేసుకున్నాయి. భారత్‌ నాలుగో స్థానానికి పరిమితం కావడంతో పతకం చేజారింది.


పి.టి. ఉష - లాస్‌ ఏంజెల్స్‌(అమెరికా),1984

పరుగు పందెం అనగానే గుర్తొచ్చే పేరు పి.టి. ఉష. 1984లో జరిగిన ఒలింపిక్స్‌లో మహిళల 400 మీటర్స్‌ హర్డల్స్‌లో ఆమె.. తృటిలో పతకాన్ని కోల్పోయింది. పరుగును 55.42 సెకన్లలో పూర్తి చేసిన పి.టి. ఉష.. సెకనులో వందోవంతు తేడాతో వెనుకబడి నాలుగోస్థానంలో నిలిచింది. అలా కాంస్య పతకం మిస్‌ అయింది. 


కుంజరాణి దేవి - ఏథేన్స్‌(గ్రీస్‌),2004

వెయిట్‌ లిఫ్టర్‌ కుంజరాణి దేవి 2004 ఒలింపిక్స్‌లో 48కిలోల వెయిట్‌ లిఫ్టింగ్‌లో పాల్గొంది. పోటీలో మొత్తంగా ఆమె 190 కిలోలను ఎత్తింది. అయితే, ఆమె కంటే థాయ్‌లాండ్‌కు చెందిన ఆరీ విరత్తవార్న్‌ కేవలం 10 కిలోలు అదనంగా ఎత్తి మూడోస్థానంలో నిలిచింది. కుంజరాణికి నాలుగుస్థానం రావడంతో కాంస్య పతకం వచ్చే అవకాశం చేజారింది. 


లియాండర్‌ పేస్‌, మహేశ్‌ భూపతి - ఏథేన్స్‌(గ్రీస్‌),2004

2004 ఒలింపిక్స్‌లో భారత టెన్నిస్‌ స్టార్‌ ఆటగాళ్లు లియాండర్‌ పేస్‌, మహేశ్‌ భూపతి కూడా తృటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకున్నారు. టెన్నిస్‌ డబుల్స్‌లో వీరిద్దరు కలిసి పోటీపడ్డారు. తొలి మూడు రౌండ్లలో విజయం సాధించి.. సెమీఫైనల్‌ వరకు దూసుకెళ్లారు. ఆ మ్యాచ్‌లో ఓడిపోవడంతో కాంస్యం కోసం క్రోయేషియాతో తలపడ్డారు. ఎంత శ్రమపడ్డా.. ఓటమి తప్పలేదు. దీంతో క్రోయేషియా మూడోస్థానంతో కాంస్యం గెలుచుకోగా.. భారత్‌ నాలుగుస్థానంలో నిలిచింది. 


జోయ్‌దీప్‌ కర్మాకర్‌ - లండన్‌(యూకే), 2012

జోయ్‌దీప్‌ కర్మాకర్‌.. భారత షూటర్‌. 2012 ఒలింపిక్స్‌లో పురుషుల 50మీటర్ల రైఫిల్‌ ప్రోన్‌ విభాగంలో పోటీ పడ్డాడు. ఫైనల్‌ పోటీలో 104.1 స్కోరు చేసి మొత్తంగా 699.1 స్కోరుతో ఫైనల్‌ ఫలితాల్లో నాలుగు స్థానంలో నిలిచాడు.


సానియా మీర్జా, రోహన్‌ బోపన్న - రియో,(బ్రెజిల్‌), 2016

2016 ఒలింపిక్స్‌లో సానియా మీర్జా-రోహన్‌ బోపన్న జోడీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. కచ్చితంగా పతకం సాధిస్తారని అందరూ భావించారు. కానీ, నిరాశే ఎదురైంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో వీరిద్దరూ సెమీఫైనల్‌ వరకు వెళ్లి ఓటమిపాలయ్యారు. కాంస్య పతక పోరులోనూ అదే ఫలితం రావడంతో నాలుగోస్థానానికి పరిమితమయ్యారు. 


అభినవ్‌ బింద్రా - రియో(బ్రెజిల్‌), 2016

బీజింగ్‌ ఒలింపిక్స్‌-2008లో షూటింగ్‌ విభాగంలో స్వర్ణ పతకం గెలిచిన అభినవ్‌ బింద్రా.. లండన్‌ ఒలింపిక్స్‌-2012లో 16 స్థానంలో నిలిచాడు. రియో ఒలింపిక్స్‌-2016లోనూ పొల్గొన్న అభినవ్‌ బింద్రా.. మంచి ప్రదర్శనే చేశాడు. కానీ, ఫైనల్‌ స్కోరులో నాలుగుస్థానంలో నిలవడంతో తృటిలో కాంస్య పతకం చేజారింది. 


దీపా కర్మాకర్‌ - రియో(బ్రెజిల్‌), 2016

దీపా కర్మాకర్‌.. 2016 ఒలింపిక్స్‌ వరకు ఎవరికి పెద్దగా ఆమె పేరు తెలియదు. కానీ, ఒలింపిక్స్‌ వేదికపై జిమ్నాస్టిక్స్‌లో ఆమె ప్రదర్శన చూసి యావత్‌ భారత దేశం అభినందించింది. జిమ్నాస్టిక్స్‌లో సాహసోపేతమైన ‘ప్రొడునొవా వాల్ట్‌’ ఫీట్‌ చేసి ఔరా అనిపించింది. కానీ, ఫైనల్‌ ఫలితాల్లో ఆమె నాలుగోస్థానానికి పరిమితమైంది. అయినా, దీపా కర్మాకర్‌కు ప్రధాని నుంచి.. సామాన్య పౌరుల వరకు అందరూ అండగా నిలిచారు. 


మహిళల హాకీ జట్టు - టోక్యో(జపాన్‌), 2020

ఒలింపిక్స్‌లో పురుషుల హాకీ జట్టుతోపాటు మహిళల జట్టు కూడా అద్భుతమైన ప్రదర్శన కనబర్చింది. అయితే, సెమీస్‌లో ఆ జట్టు అర్జెంటీనా చేతిలో ఓటమిపాలైంది. ఆనంతరం రాణీ రామ్‌పాల్‌ జట్టు కాంస్య పతకం కోసం బ్రిటన్‌తో తలపడి.. అందులోనూ ఓటమిపాలైంది. అలా కాంస్య పతకాన్ని అందుకోలేపోయింది. 


అదితి అశోక్‌ - టోక్యో(జపాన్‌), 2020

ఎవరూ ఊహించని రీతిలో భారత గోల్ఫర్‌ అదితి అశోక్‌ విశేషంగా రాణించింది. చివరి క్షణాల్లో ఒలింపిక్స్‌కు వెళ్లిన ఆమె అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. టాప్‌ ప్లేయర్లను కూడా వెనక్కినెడుతూ ఫైనల్‌ వరకూ చేరుకుంది. దాంతో పతకంపై ఆశలు పెంచిన అదితి దురదృష్టవశాత్తు నాలుగో స్థానానికి పరిమితమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని