ఫౌజీ గేమ్‌కి పబ్‌జీ సెగ..!

కేంద్రం చైనా యాప్‌లను నిషేధించిన తర్వాత దేశీయ యాప్‌లకు డిమాండ్ పెరిగింది. ఇటీవల విడుదలైన ఫౌజీ గేమ్‌ ఇందుకు ఉదాహరణ. ఈ గేమ్ విడుదలైన 24 గంటల్లో 3 లక్షల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. పబ్‌జీపై నిషేధం తర్వాత దేశీయ పరిజ్ఞానంతో ఫౌజీ గేమ్‌... 

Published : 04 Feb 2021 22:35 IST

ఇంటర్నెట్ డెస్క్‌: కేంద్రం చైనా యాప్‌లను నిషేధించిన తర్వాత దేశీయ యాప్‌లకు డిమాండ్ పెరిగింది. ఇటీవల విడుదలైన ఫౌజీ గేమే ఇందుకు ఉదాహరణ. ఈ గేమ్ విడుదలైన 24 గంటల్లో 3 లక్షల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. పబ్‌జీపై నిషేధం తర్వాత దేశీయ పరిజ్ఞానంతో ఫౌజీ గేమ్‌ తీసుకొస్తున్నట్లు బాలీవుడ్ నటుడు అక్షయ్‌ కుమార్‌ ప్రకటించారు. ఈ ఏడాది గణతంత్రదినోత్సవ కానుకగా ఫౌజీని విడుదల చేశారు. తర్వాత కొద్ది రోజులకే ఉచిత గేమింగ్ యాప్‌ జాబితాలో మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఈ గేమ్‌కు కొత్త సమస్య వచ్చింది. గత రెండు రోజులుగా ప్లేస్టోర్‌లో గేమ్‌ రివ్యూలో 1 స్టార్‌ రేటింగ్‌లు వెల్లువెత్తుతున్నాయట..! దీంతో ఈ గేమ్‌ రేటింట్ ఒక్కసారిగా 4.5 నుంచి 3.2 పడిపోయింది.

ఈ పరిస్థితి కారణం పబ్‌జీ గేమ్‌ ప్రియులేనట. పబ్‌జీపై నిషేధం విధించడంతో తమ కోపాన్ని ఈ విధంగా ప్రదర్శిస్తున్నారని పలు గేమింగ్ వెబ్‌సైట్లు వెల్లడించాయి. పబ్‌జీకి ప్రత్యామ్నాయంగా ఫౌజీ గేమ్‌ తీసుకొచ్చారనే ప్రచారం జరగడం కూడా ఈ సమస్యకు ప్రధాన కారణం. ఫౌజీ విడుదల సందర్భంగా స్టూడియో ఎన్‌కోర్‌ సంస్థ ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. పబ్‌జీని, ఫౌజీని కలిపి చూడొద్దని కోరింది. రెండు గేమ్‌ల మధ్య వ్యత్యాసం ఉందని తెలిపింది. అయితే ఫౌజీ గేమింగ్‌ ప్రియుల అంచనాలను అందుకోలేకపోయిందని పలువురు టెక్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గ్రాఫిక్స్‌ పరంగా కొంత మేర ఫర్వాలేదనిపించినా, ఒక్కరే ఆడేలా రూపొందించడం గేమింగ్ ప్రియులను నిరుత్సాహపరించింది. ఈ నేపథ్యంలో నెగిటివ్ రేటింగ్ రూపంలో మరో కొత్త సమస్య వచ్చి చేరింది. అయితే త్వరలోనే మల్టిపుల్‌ ప్లేయర్స్‌ ఫీచర్‌తో పాటు మరికొన్ని  కొత్త ఫీచర్స్‌తో అప్‌డేట్ చేయనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 

ఇవీ చదవండి..

రివ్యూ: ‘ఫౌ-జీ’ గేమ్‌

ఫౌజీ: కేవలం ఆట కాదు..అంతకు మించి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని