అజ్ఞాత కాల్స్‌కు వాట్సప్‌ చెక్‌!

మొబైల్‌కు ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉంటే చాలు. ఉచితంగా, తేలికగా కాల్స్‌ చేసుకోవటానికి వాట్సప్‌ మంచి వేదిక. అందుకే ఇది చాలా ప్రాచుర్యం పొందుతోంది. ఇప్పుడు చాలామంది వాట్సప్‌ వీడియో, ఆడియో కాల్స్‌తోనే పనులు కానిచ్చేస్తున్నారు.

Published : 28 Jun 2023 00:23 IST
మొబైల్‌కు ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉంటే చాలు. ఉచితంగా, తేలికగా కాల్స్‌ చేసుకోవటానికి వాట్సప్‌ మంచి వేదిక. అందుకే ఇది చాలా ప్రాచుర్యం పొందుతోంది. ఇప్పుడు చాలామంది వాట్సప్‌ వీడియో, ఆడియో కాల్స్‌తోనే పనులు కానిచ్చేస్తున్నారు. కానీ ఇటీవల స్పామ్‌ కాల్స్‌ పెరిగిపోవటం ఆందోళన కలిగిస్తోంది. తెలియనివారు, వేరే దేశాలకు చెందినవారూ ఫోన్‌ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. దీన్ని అరికట్టటానికే వాట్సప్‌ ఇటీవల ఒక మంచి ఫీచర్‌ తీసుకొచ్చింది. అజ్ఞాత వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్‌ను డిఫాల్ట్‌గా అడ్డుకోవటం దీని ప్రత్యేకత. ఇందుకోసం ముందుగా వాట్సప్‌ తాజా వర్షన్‌కు అప్‌డేట్‌ చేసుకోవాలి. అనంతరం సెటింగ్స్‌ ద్వారా ప్రైవసీ విభాగంలోకి వెళ్తే కాల్స్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. దీన్ని తాకితే ‘సైలెన్స్‌ అన్‌నోన్‌ కాలర్‌’ ఫీచర్‌ దర్శనమిస్తుంది. దీన్ని ఎనేబుల్‌ చేసుకుంటే తెలియనివారి నుంచి వచ్చే కాల్స్‌ బెడదను తప్పించుకోవచ్చు. గమనించాల్సిన విషయం ఏంటంటే- దీన్ని ఎనేబుల్‌ చేసుకున్నా కాల్స్‌ నోటిఫికేషన్‌ అందుతాయి. కాల్‌ లాగ్స్‌లో అవి కనిపిస్తాయి. కానీ రింగ్‌ కావు. అర్ధరాత్రో, అపరాత్రో లేవాల్సిన అవసరముండదు. ఇదే కాదు.. సెటింగ్స్‌ విభాగంలో కొత్త ప్రైవసీ చెకప్‌తోనూ భద్రతను పెంచుకోవచ్చు.
  • ‘చూజ్‌ హూ కెన్‌ కాంటాక్ట్‌ యూ’ ఫీచర్‌ ద్వారా ర్యాండమ్‌గా మనల్ని గ్రూప్‌లో చేర్చటాన్ని అరికట్టొచ్చు. బ్లాక్‌ చేసిన కాంటాక్టులను తనిఖీ చేసుకోవచ్చు.
  • ‘కంట్రోల్‌ యువర్‌ పర్సనల్‌ ఇన్ఫో’ సాయంతో ప్రొఫైల్‌ ఫొటో, లాస్ట్‌ సీన్‌ స్టేటస్‌, రీడ్‌ రిసీప్ట్స్‌ను ఎవరెవరు చూడొచ్చో నిర్ణయించుకోవచ్చు.
  • ‘యాడ్‌ మోర్‌ ప్రైవసీ టు యువర్‌ చాట్స్‌’ ద్వారా ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్టెడ్‌ బ్యాకప్స్‌ను ఎనేబుల్‌ చేసుకోవచ్చు.
  • ‘యాడ్‌ మోర్‌ ప్రొటెక్షన్‌ టు యువర్‌ అకౌంట్‌’తో టూ-స్టెప్‌ వెరిఫికేషన్‌ను ఎనేబుల్‌ చేసుకోవచ్చు. దీంతో వాట్సప్‌ డేటాను హ్యాకర్ల బారినపడకుండా కాపాడుకోవచ్చు. అదనపు భద్రత కావాలంటే వాట్సప్‌ కోసం ప్రత్యేకంగా స్క్రీన్‌ లాక్‌నూ ఏర్పాటు చేసుకోవచ్చు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని