కన్నెపల్లి పంపుహౌస్‌కు రూ.వెయ్యి కోట్ల నష్టం!

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన  కన్నెపల్లి (లక్ష్మి) పంపుహౌస్‌కు భారీగానే నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. దెబ్బతిన్న మోటార్లు, ఇతర పరికరాల నష్టం సుమారు రూ.వెయ్యికోట్ల వరకు ఉండే అవకాశం

Published : 12 Aug 2022 03:59 IST

12 నుంచి 17 వరకు పూర్తిగా దెబ్బతిన్న మోటార్లు

ఈ ఆరూ కాళేశ్వరంలో కొత్తగా అదనపు టీఎంసీకి ఏర్పాటు చేసినవి

ఈనాడు హైదరాబాద్‌, ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాల్‌పల్లి: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన  కన్నెపల్లి (లక్ష్మి) పంపుహౌస్‌కు భారీగానే నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. దెబ్బతిన్న మోటార్లు, ఇతర పరికరాల నష్టం సుమారు రూ.వెయ్యికోట్ల వరకు ఉండే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. మోటార్లన్నింటినీ పూర్తి స్థాయిలో పరిశీలించాకే తుది అంచనాకు రావచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మేడిగడ్డ బ్యారేజీ నుంచి అన్నారం బ్యారేజీకి నీటిని ఎత్తిపోసేందుకు జయశంకర్‌ జిల్లా మహదేవ్‌పూర్‌ మండలం కన్నెపల్లి వద్ద పంపుహౌస్‌ నిర్మించారు. మొదట రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు ఒక్కొక్కటి 40 మెగావాట్ల సామర్థ్యంలో 11పంపులు, మోటార్లు ఏర్పాటు చేశారు. తర్వాత మూడో టీఎంసీ కోసం మరో 6పంపులు, మోటార్లను అమర్చారు. గత నెలలో వచ్చిన భారీవరదకు పంపుహౌస్‌ మునగగా, నీటిని తోడటం ప్రారంభించాక ఇప్పుడిప్పుడే పంపుహౌస్‌కు, మోటార్లకు జరిగిన నష్టం వెలుగులోకి వస్తోంది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం 12 నుంచి 17వ మోటారు వరకు పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలిసింది. ఈ 6 కొత్తగా అదనపు టీఎంసీకి ఏర్పాటు చేసిన మోటార్లని సమాచారం. మిగిలిన వాటిలో రెండింటికి మరమ్మతు చేయాల్సి వస్తుందని, 9 మోటార్లకు ఇబ్బంది లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. పంపుహౌస్‌ మునిగిన తర్వాత ఆ పరిసర ప్రాంతాల్లోకి అధికారులు ఎవరినీ పోనివ్వలేదు. తాజాగా కొన్ని ఫొటోలు వెలుగులోకి రావడంతో పంపుహౌస్‌కు జరిగిన తీవ్రనష్టం తెలిసింది.

కన్నెపల్లి పంప్‌హౌస్‌లోని 17 బాహుబలి మోటార్లు మిరుమిట్లు గొలిపే విద్యుద్దీపాల కాంతుల్లో మెరిసిపోయేవి. వరదఉద్ధృతికి వాటి రూపురేఖలు మారిపోయాయి. పంపుహౌస్‌ అంతా దెబ్బతిన్న మోటార్లు, పడిపోయిన రక్షణగోడల శిథిలాలు, విరిగిన ఈవోటీ క్రేన్లు, కేబుళ్లు, చిందరవందరగా పడిన సామగ్రితో ఉన్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చిన ఫొటోలను బట్టి తెలుస్తోంది. కొన్ని మోటార్లు స్థానభ్రంశం కావడంతోపాటు వాటి పైభాగంలో ఉండే సాఫ్ట్‌లు దెబ్బతిన్నాయి.

కొనసాగుతున్న పనులు..

నీటిని తోడి మోటార్లు బయట పడిన తర్వాత బురద, ఇతర శకలాలను తొలగించే పనులు కొనసాగుతున్నాయి. దాదాపు 500 మంది వరకు పనుల్లో నిమగ్నమయ్యారు. కొత్తగా ఆరు మోటార్ల కొనుగోలకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. ఆస్ట్రియా, ఫిన్లాండ్‌ దేశాల నుంచి  ఇంజినీరింగ్‌ నిపుణులు వస్తున్నట్లు సమాచారం. వారు రాగానే మోటార్ల పనితీరును పరిశీలించనున్నారు. నష్టానికి సంబంధించిన అంచనా కూడా తేలే అవకాశం ఉంది. ఈవోటీ క్రేన్లు, లిఫ్టుల భాగాలను పూర్తిస్థాయిలో తొలగించలేదు. ప్యానెల్‌ బోర్డుల తీగలను పరిశీలించారు. 60 శాతం వరకు తీగలు ధ్వంసం కాగా 40 శాతం వరకు పనిచేస్తాయని తెలిసింది. పంపుహౌస్‌కు ముందు భాగంలోని ఫోర్‌బే వద్ద నీటిని, వరదను తోడి శుభ్రపరిచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని