హైదరాబాద్‌ సీబీఐ కోర్టుకు వివేకా హత్య కేసు ఫైళ్లు

సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసు హైదరాబాద్‌ సీబీఐ కోర్టుకు చేరింది. కడప సెషన్స్‌ కోర్టు నుంచి ఈ కేసు ఫైళ్లు హైదరాబాద్‌ సీబీఐ కోర్టుకు చేరాయి.

Updated : 25 Jan 2023 05:58 IST

నిందితులకు తాజాగా సమన్లు

ఈనాడు, హైదరాబాద్‌: సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసు హైదరాబాద్‌ సీబీఐ కోర్టుకు చేరింది. కడప సెషన్స్‌ కోర్టు నుంచి ఈ కేసు ఫైళ్లు హైదరాబాద్‌ సీబీఐ కోర్టుకు చేరాయి. ఈ కేసులో దర్యాప్తు సంస్థలు సేకరించిన వాంగ్మూలాలూ సీబీఐ కోర్టుకు వచ్చాయి. పత్రాలన్నింటినీ కోర్టు సిబ్బంది పరిశీలించి, తాజాగా ఫైళ్లను రూపొందించి, వాటిని సీబీఐ కోర్టు న్యాయమూర్తి ముందుంచాలి. అనంతరం పాత కేసు నంబరు స్థానంలో ఇక్కడ కేసు నంబరును కేటాయించాలి. హైదరాబాద్‌ సీబీఐ కోర్టు కేసు నంబరు కేటాయించి విచారణ నిమిత్తం తీసుకున్నాక.. విచారణ తేదీని నిర్ణయించి, ఈ కేసులో ఉన్న అయిదుగురు నిందితులకు సమన్లు జారీచేయనుంది. అనంతరం ప్రతి విచారణకు నిందితులు ఇక్కడే హాజరుకావాలి. సాక్షులనూ ఇక్కడే హాజరుపరచాలి. కీలక సాక్షుల నుంచి సీఆర్‌పీసీ సెక్షన్‌ 164 కింద వాంగ్మూలాల నమోదు బాధ్యతను సీబీఐ కోర్టు హైదరాబాద్‌లోని మేజిస్ట్రేట్లకు అప్పగించాలి.

రిమాండు పొడిగింపు సీబీఐ కోర్టు నుంచే..

ఈ కేసులో జైల్లో ఉన్న నిందితులకు రిమాండు పొడిగింపునకూ హైదరాబాద్‌ సీబీఐ కోర్టు నుంచే ఉత్తర్వులు పొందాలి. ప్రస్తుతం కడప జైలులో గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్‌ ఉన్నారు. రిమాండు గడువు తీరగానే వారిని వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సీబీఐ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఈ కేసులో దస్తగిరి అప్రూవర్‌గా మారారు. ఎర్ర గంగిరెడ్డి బెయిలు రద్దు కోరుతూ సీబీఐ దాఖలుచేసిన పిటిషన్‌ కూడా సుప్రీంకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయింది.

దర్యాప్తు ఇక్కడి నుంచే

కోర్టు విచారణతో పాటు ఇకపై దర్యాప్తు కూడా హైదరాబాద్‌ సీబీఐ కార్యాలయం నుంచే కొనసాగనుంది. ఇందులోభాగంగా వైకాపా ఎంపీ అవినాశ్‌రెడ్డికి సీబీఐ నోటీసులు జారీచేసింది. దర్యాప్తులో భాగంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. వివేకా హత్యకేసులో అవినాశ్‌రెడ్డి అనుమానితుడిగా ఉన్నారు. సాక్ష్యాల ధ్వంసంలో కీలకపాత్ర పోషించారని, వివేకా గుండెపోటుతో మరణించారంటూ ప్రచారం చేశారని ఆరోపణలున్నాయి. విచారణకు హాజరుకావడానికి అవినాశ్‌రెడ్డి వారం  గడువు కోరారు.


వివేకా హత్య కేసు నిందితులు త్వరలో హైదరాబాద్‌ జైలుకు?

ఈనాడు డిజిటల్‌, కడప: వివేకా హత్య కేసులో కడప కేంద్ర కారాగారంలో రిమాండులో ఉన్న నిందితులను త్వరలో హైదరాబాద్‌కు తరలించే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. కడప కేంద్ర కారాగారంలో వై.సునీల్‌యాదవ్‌ (ఏ2), గజ్జల ఉమాశంకర్‌రెడ్డి (ఏ3), దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి(ఏ5) ఉన్నారు. కేసులో మొదటి నిందితుడు ఎర్ర గంగిరెడ్డి (ఏ1) బెయిలుపై ఉన్నారు. దస్తగిరి అప్రూవర్‌గా మారడంతో బెయిలు లభించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు