ఉపాధ్యాయ ఖాళీలపై సమావేశానికో మాట

ప్రభుత్వ పాఠశాలల్లో 771 పోస్టులే ఖాళీగా ఉన్నాయి. పదవీవిరమణ వయసు 62ఏళ్లకు పెంచడం వల్ల ఖాళీలు రాలేదు.

Published : 23 Sep 2023 05:25 IST

గత అసెంబ్లీ సమావేశాల్లో 771.. ఇప్పుడు 8,366 అవసరమన్న మంత్రి బొత్స
ప్రభుత్వ లెక్కల ప్రకారం 18,520 పోస్టులు ఖాళీ
హేతుబద్ధీకరణ, విలీనంతో భారీగా రద్దు


ప్రభుత్వ పాఠశాలల్లో 771 పోస్టులే ఖాళీగా ఉన్నాయి. పదవీవిరమణ వయసు 62ఏళ్లకు పెంచడం వల్ల ఖాళీలు రాలేదు. మంజూరు పోస్టులను ఎక్కడా రద్దుచేయలేదు.

2023 మార్చి 20న శాసనమండలిలో మంత్రి బొత్స సమాధానం

8,366 పోస్టులు అవసరం. వాటి భర్తీకి చర్యలు తీసుకుంటాం.

శాసనమండలి ప్రశ్నోత్తరాల్లో మంత్రి బొత్స సత్యనారాయణ


ఈనాడు, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలపై ప్రభుత్వ ప్రకటనలు గందరగోళంగా మారాయి. గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా 771 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రకటించిన మంత్రి బొత్స సత్యనారాయణ.. తాజాగా 8,366 పోస్టులు అవసరమని శాసనమండలిలో ప్రకటించారు. ఇప్పుడు ఇన్ని పోస్టులు ఎక్కడి నుంచి వచ్చాయి? మంత్రి లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం ప్రకారం రాష్ట్రంలో మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు 1,88,162 ఉంటే పనిచేస్తున్న వారు 1,69,642 మంది. ఈ లెక్కన 18,520 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మంత్రి 8,366 పోస్టులే అవసరమన్నారు. మిగతా 10,154 పోస్టులను ప్రభుత్వం రద్దు చేసేస్తుందా? లేక తరగతుల విలీనం, ఉపాధ్యాయుల సర్దుబాటు కారణంగా అవసరం లేకుండా పోయాయా? ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్‌ రాష్ట్రంలో 23వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని లెక్కతేల్చారు. చంద్రబాబు 7,900 పోస్టులకే డీఎస్సీ ఇచ్చారని, తాను అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ నిర్వహిస్తానని హామీ గుప్పించారు. వచ్చి నాలుగున్నరేళ్లు గడచినా ఇంతవరకు మెగా డీఎస్సీ నిర్వహించలేదు.

హేతుబద్ధీకరణతో పోస్టులు మాయం

పోస్టుల హేతుబద్ధీకరణ, 3,4,5 తరగతుల విలీనం, 1-9 తరగతుల్లో ఒకే మాధ్యమం, 9,10 తరగతుల్లో సెక్షన్‌కు 60మంది విద్యార్థులను పెంచిన ప్రభుత్వం... పోస్టులు భారీగా మిగుల్చుకుంది.

  • ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణతో సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌(ఎస్జీటీ) పోస్టులు 7వేలకుపైగా మిగులుగా ఉన్నట్లు ప్రభుత్వం తేల్చింది. 3,4,5 తరగతులకు సబ్జెక్టు టీచర్లతో బోధనంటూ వీటిని ఉన్నత, ప్రాథమికోన్నత బడుల్లో కలిపేసింది. దీంతో ఎస్జీటీ పోస్టుల అవసరం లేకుండా పోయింది.
  • పాఠశాల విద్యాశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఎంపీపీ పాఠశాలల్లో 4,102 ఎస్జీటీలు అవసరం కాగా.. 9,912 మంది మిగులుగా ఉన్నారు. సర్దుబాటు చేసిన తర్వాత ఇంకా 5,817 మంది మిగలనున్నారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే ఎస్జీటీల అవసరం ఉంది. భవిష్యత్తులో డీఎస్సీ నిర్వహించినా ఎస్జీటీ పోస్టులు ఉండకపోవచ్చు.
  • అర్హత కలిగిన ఎస్జీటీలకు సబ్జెక్టు టీచర్లుగా పదోన్నతులు కల్పించడంతో మరోపక్క స్కూల్‌ అసిస్టెంట్ల పోస్టులు తగ్గిపోయాయి.
  • కొత్త నియామకాలు లేకపోగా.. ఉన్న పోస్టులను ప్రభుత్వం రద్దుచేసింది. ఆదర్శ పాఠశాలల్లో 3,260 పోస్టులకు సర్వీసు నిబంధనల కోసమంటూ 4,764 ఎస్జీటీ పోస్టులను రద్దు చేశారు.
  • అయిదు అదనపు డైరెక్టర్ల పోస్టులను సృష్టించేందుకు 2021 అక్టోబరులో 15, కొత్తగా 692 మండల విద్యాధికారుల పోస్టులను సృష్టించేందుకు 1,145 ఆర్ట్‌, క్రాఫ్ట్‌, డ్రాయింగ్‌ పోస్టులను ప్రభుత్వం రద్దుచేసింది.
  • హైస్కూల్‌ ప్లస్‌లో ఇంటర్మీడియట్‌ బోధనకు 1,752 స్కూల్‌ అసిస్టెంట్ల కోసం 1,752 ఎస్జీటీ పోస్టులను తొలగించింది. కర్నూలు జిల్లాలో ప్రధానోపాధ్యాయుల పోస్టుల కోసం 76 ఎస్జీటీ పోస్టులను రద్దుచేసింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని