AP Govt: మావాడైతే చాలు.. సీనియారిటీతో మాకేం పని

‘మేం అరాచకాలకు తెగబడ్డా.. అక్రమాలకు పాల్పడ్డా.. వాటికి వెన్నుదన్నుగా ఉండాలి. మాకు రాజకీయంగా గిట్టని వారిని అక్రమ కేసులతో వేధించాలి.. ప్రతిపక్షాలు పల్లెత్తి మాటన్నా సరే వారిని అణచివేయాలి. భయపెట్టాలి.

Updated : 19 Feb 2024 13:55 IST

11 మంది సీనియర్లను తొక్కేసి డీజీపీగా రాజేంద్రనాథరెడ్డి నియామకం
రెండేళ్ల నుంచి ఇన్‌ఛార్జిగా ఆయనే
పూర్తిస్థాయి డీజీపీ నియామకం కోసం కేంద్రానికి జాబితా పంపని జగన్‌ ప్రభుత్వం
సుప్రీంకోర్టు ఆదేశాలన్నా లెక్కలేదు..
యూపీఎస్సీ మార్గదర్శకాలు బేఖాతర్‌

ఈనాడు-అమరావతి: ‘మేం అరాచకాలకు తెగబడ్డా.. అక్రమాలకు పాల్పడ్డా.. వాటికి వెన్నుదన్నుగా ఉండాలి. మాకు రాజకీయంగా గిట్టని వారిని అక్రమ కేసులతో వేధించాలి.. ప్రతిపక్షాలు పల్లెత్తి మాటన్నా సరే వారిని అణచివేయాలి. భయపెట్టాలి. దాడులు చేసే మమ్మల్ని వదిలేసి రివర్స్‌ కేసులతో బాధితులను హడలెత్తించాలి. మా మాటే చట్టం కావాలి. ఐపీసీ (ఇండియన్‌ పీనల్‌ కోడ్‌) పక్కనపెట్టి జేపీసీ (జగన్‌ పీనల్‌ కోడ్‌) అమలు చేయాలి. సీఆర్‌పీసీ (క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌) స్థానంలో వైఎస్‌ఆర్‌సీపీ (వైఎస్‌ఆర్‌ క్రిమినల్‌ ప్రోసీజర్‌ కోడ్‌) పాటించాలి. వీటన్నింటికీ తోడు అదనంగా ‘మా వాడు’ అయిఉండాలి. ఈ కనీస అర్హతలుంటే చాలు.. సీనియారిటీ జాబితాలో అట్టడుగున ఉన్నా సరే... మిగతా అధికారులందర్నీ కిందకు తొక్కేసి మరీ డీజీపీగా కొనసాగిస్తుంటాం. సీనియారిటీలో ముందుకొచ్చేంతవరకూ కూడా ఏ ఇబ్బందీ రాకుండా ఇన్‌ఛార్జి హోదాలో కొనసాగిస్తుంటాం’ అనే రీతిలో జగన్‌ ప్రభుత్వం వ్యవహరిస్తోంది.

సుప్రీంకోర్టు ఆదేశాలంటే లెక్కలేదు. యూపీఎస్సీ మార్గదర్శకాలు బేఖాతర్‌.. తాను చెప్పిందల్లా చేసే వారే డీజీపీ (పోలీసు దళాల అధిపతి). దాని కోసం నిబంధనలను కాల రాస్తోంది. డీజీపీ హోదా కలిగిన 11 మంది సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను పక్కనపెట్టేసి మరీ కేవీ రాజేంద్రనాథరెడ్డిని ఇన్‌ఛార్జీ డీజీపీ (పోలీసు దళాల అధిపతి)గా నియమించిన జగన్‌ ప్రభుత్వం..రెండేళ్లుగా ఆయన్ను అదే హోదాలో కొనసాగిస్తోంది. పూర్తిస్థాయి (రెగ్యులర్‌) డీజీపీ ఎంపిక కోసం అర్హులైన అధికారుల వివరాలతో జాబితా పంపాలని కేంద్ర హోంశాఖ పదే పదే లేఖలు రాస్తున్నా ఖాతరు చేయడం లేదు. డీజీపీ నియామకం విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకోవడమే లేదు. ఈ నేపథ్యంలోనే ‘తాత్కాలిక డీజీపీ వద్దు.. పూర్తిస్థాయి డీజీపీని వెంటనే నియమించండి’ అంటూ కేంద్ర హోంశాఖ తాజాగా మరోసారి ఏపీ ప్రభుత్వానికి లేఖ పంపించింది.

సీనియారిటీలో అట్టడుగున ఉన్నా పట్టం

వడ్డించే వాడు మనవాడైతే అన్నట్లుగా.. పోస్టింగ్‌ ఇచ్చేది ‘‘మనవాడు’’ కావటంతో సీనియారిటీలో అట్టడుగున ఉన్నప్పటికీ రాజేంద్రనాథరెడ్డిని ఇన్‌ఛార్జి డీజీపీగా నియమించుకున్నారు. 1992 బ్యాచ్‌ అధికారైన ఆయనను అదనపు డీజీపీ నుంచి డీజీపీగా పదోన్నతి పొందిన కొద్ది రోజుల్లోనే...పోలీసు దళాల అధిపతిగా నియమిస్తూ 2020 ఫిబ్రవరి 15న జగన్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీజీపీ ర్యాంకులో అప్పటికి వీఎస్‌కే కౌముది (1986 బ్యాచ్‌) ఎన్‌.వి.సురేంద్రబాబు, ఏ.ఆర్‌.అనూరాధ (1987 బ్యాచ్‌), ఏబీ వెంకటేశ్వరరావు, కేఆర్‌ఎం కిషోర్‌కుమార్‌, సీహెచ్‌. ద్వారకా తిరుమలరావు (1989 బ్యాచ్‌), అంజనా సిన్హా (1990 బ్యాచ్‌), మాదిరెడ్డి ప్రతాప్‌, మహ్మద్‌ హసన్‌ రెజా (1991), హరీష్‌కుమార్‌ గుప్తా, పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు (1992)ఉన్నారు. సీనియారిటీ జాబితాలో వీరంతా రాజేంద్రనాథరెడ్డి కంటే ముందు వరుసలో ఉన్నప్పటికీ వైకాపా ప్రభుత్వం వారందర్నీ కిందకు తొక్కిపెట్టి ‘‘తమ వాడికి’’ డీజీపీగా పట్టం కట్టి పైకి తీసుకొచ్చింది.

రెండేళ్లలో అయిదుగురు అధికారుల పదవీ విరమణ

రాజేంద్రనాథరెడ్డి ఇన్‌ఛార్జి డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత రెండేళ్ల వ్యవధిలో డీజీ ర్యాంకు అధికారులైన వీఎస్‌కే కౌముది, ఎన్‌.వి.సురేంద్రబాబు, ఏ.ఆర్‌.అనూరాధ, కేఆర్‌ఎం కిషోర్‌కుమార్‌, మహ్మద్‌ హసన్‌ రెజాలు పదవీ విరమణ చేశారు. పూర్తిస్థాయి డీజీపీ ఎంపిక కోసం అప్పట్లోనే జగన్‌ ప్రభుత్వం కేంద్రానికి జాబితా పంపించి ఉంటే వీరందరి పేర్లు అందులో పొందుపరచాల్సి వచ్చేది. కానీ దురుద్దేశంతో తాత్సారం చేయటం వల్ల వీరికి పోలీసు దళాల అధిపతిగా పనిచేసే అవకాశం దక్కనీయకుండా చేసింది.

  • సీనియర్‌ అధికారులు ఒక్కొక్కరూ పదవీ విరమణ చేయటంతో.. ప్రస్తుతం (2024 జనవరి 18 నాటికి) రాజేంద్రనాథరెడ్డి సీనియారిటీ జాబితాలో ఏడో స్థానానికి ఎగబాకారు. ప్రస్తుతం ఆయన కంటే ముందు వరుసలో ఏబీ వెంకటేశ్వరరావు, సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు, అంజనా సిన్హా, మాదిరెడ్డి ప్రతాప్‌, హరీష్‌కుమార్‌ గుప్తా, పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు ఉన్నారు. కానీ వారందర్నీ పక్కనపెట్టి మరీ రాజేంద్రనాథరెడ్డినే ఇంకా ఇన్‌ఛార్జిగా కొనసాగిస్తున్నారు.
  • 1993, 1994 బ్యాచ్‌లకు చెందిన ఐపీఎస్‌ అధికారులకు జనవరి నెలలో అదనపు డీజీపీ నుంచి డీజీపీగా పదోన్నతులు రావాలి. కానీ భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా వాటికి కూడా మోకాలడ్డారు.

ఇది క్విడ్‌ ప్రోకో కాకపోతే మరేంటి?
ఇన్‌ఛార్జి డీజీపీగా వ్యవహరిస్తున్న రాజేంద్రనాథరెడ్డి తొలి నుంచి వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. ప్రతిపక్షాలపై ఎన్ని దాష్టీకాలు జరుగుతున్నా ఆయన ఏ రోజూ పట్టించుకోలేదు. ఈయన హయాంలో ప్రతిపక్ష నాయకులు, ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నించేవారిపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారు. ప్రతిపక్షాలకు చెందిన వారిపై ఫిర్యాదులివ్వడానికి వచ్చేవారిని సాదరంగా ఆహ్వానించి మరీ ఫిర్యాదులు స్వీకరిస్తారు. వైకాపా నాయకుల దాష్టీకాలపై ఫిర్యాదులివ్వడానికి వెళ్లే ప్రతిపక్ష నాయకుల్ని ఆయన కలవనే కలవరు. కనీసం కార్యాలయం లోపలికి కూడా అనుమతించరు. ఇందుకోసమే ఆయన్ను ఇన్‌ఛార్జి డీజీపీగా కొనసాగిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది క్విడ్‌ ప్రోకో కాకపోతే మరేంటి అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.


దురుద్దేశపూరిత తాత్సారం

  • డీజీపీగా ఉన్న గౌతమ్‌సవాంగ్‌ను ఆకస్మికంగా, అర్ధంతరంగా ఆ పోస్టు నుంచి పక్కకు తప్పించి.. ఆ స్థానంలో ఇన్‌ఛార్జి డీజీపీగా కేవీ రాజేంద్రనాథరెడ్డిని నియమించిన జగన్‌ ప్రభుత్వం నిబంధనలను తుంగలో తొక్కింది.
  • ప్రకాశ్‌సింగ్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. రాష్ట్ర క్యాడర్‌లో డీజీపీ హోదాలో ఉన్న అధికారుల్లో సీనియారిటీ ప్రకారం అయిదుగురి పేర్లను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించాలి.  సర్వీసు రికార్డు, నిజాయితీ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత వారిలో ముగ్గురి పేర్లను యూపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. అందులో ఒకర్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి డీజీపీగా ఎంపిక చేయాలి.
  • ఇన్‌ఛార్జి డీజీపీని నియమించి రెండేళ్లవుతున్నా... పూర్తిస్థాయి డీజీపీ నియామకం కోసం జగన్‌ ప్రభుత్వం ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి జాబితా పంపలేదు. దురుద్దేశంతోనే ఈ తాత్సారం చేసిందని సీనియర్‌ ఐపీఎస్‌లు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. ఒకవేళ యూపీఎస్సీకి జాబితా పంపిస్తే.. సీనియారిటీలో 12వ స్థానంలో ఉన్న రాజేంద్రనాథరెడ్డి పేరు అందులో పొందుపరచడం సాధ్యం కాదు. దీంతో తమకు కావాల్సిన వ్యక్తి రెగ్యులర్‌ డీజీపీ అయ్యేందుకు అవకాశం ఉండదు. అందుకే సీనియారిటీ జాబితాలో రాజేంద్రనాథరెడ్డి పేరు ముందు వరుసలోకి వచ్చేంతవరకూ జాబితా పంపకుండా నిలిపేశారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని