ఆక్రమించి నిర్మిస్తాం.. అడ్డుకుంటే అంతు చూస్తాం!

తిరుపతి నగరంతోపాటు చుట్టుపక్కల హథీరామ్‌జీ మఠానికి వందల ఎకరాల భూములు ఉండగా.. ఇప్పుడు వీటిలో పదుల ఎకరాలు కూడా మిగల్లేదు.

Updated : 21 Mar 2024 07:11 IST

హథీరామ్‌జీ మఠం భూముల్లో దర్జాగా నిర్మాణాలు
హైకోర్టు స్టేటస్‌కో ఇచ్చినా ఆగని విల్లాల నిర్మాణం
ఫొటోలు తీయడానికి వెళ్లిన మఠం ఉద్యోగులపై దాడి
పోలీసులకు ఫిర్యాదు చేస్తే అంతుచూస్తామంటూ హెచ్చరికలు  
వైకాపా అంటే ‘చెవి’కోసుకునే నేతదే అక్కడ హవా

ఈనాడు-అమరావతి: తిరుపతి నగరంతోపాటు చుట్టుపక్కల హథీరామ్‌జీ మఠానికి వందల ఎకరాల భూములు ఉండగా.. ఇప్పుడు వీటిలో పదుల ఎకరాలు కూడా మిగల్లేదు. జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైకాపా నేతలు రెట్టించిన ఉత్సాహంతో ఈ భూములను ఆక్రమిస్తున్నారు. అధికార పార్టీ అంటే ‘చెవి’ కోసుకుంటా అనేలా హడావుడి చేసే ఓ కీలక నేత ఆధ్వర్యంలో తిరుపతి అవిలాల ప్రాంతంలో మఠం భూముల ఆక్రమణ తారస్థాయికి చేరింది. తాజాగా హైకోర్టులో స్టేటస్‌కో ఉన్నప్పటికీ మఠం భూముల్లో నిర్మాణాలు నిరాటంకంగా సాగుతున్న వైనాన్ని ఫొటోలు తీసేందుకు వెళ్లిన మఠం ఉద్యోగులపై.. ‘చెవి’కోసుకునే నేత అనుయాయులు దాడి చేసి చితక్కొట్టారు. చంపుతామంటూ బెదిరించారు. అయినా సరే దేవాదాయశాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

తిరుపతి గ్రామీణ మండలంలోని అవిలాల పరిధిలో దాదాపు 200 ఎకరాలకు పైనే హథీరామ్‌జీ మఠం భూములున్నాయి. వీటిని సాగు పేరిట లీజు తీసుకున్నట్లు చూపించి, భారీ భవంతులు, విల్లాలు నిర్మించేస్తున్నారు. గత ఏడాది వరకు మఠం బాధ్యతలు చూసిన మహంతు అర్జున్‌దాస్‌ వీటిని అడ్డుకునే ప్రయత్నాలేవీ చేయలేదు. ముఖ్యంగా అధికార పార్టీలో కీలక నేత ఆధ్వర్యంలో ఈ మఠం భూముల్లో దందా సాగింది. ఎందరో వైకాపా నేతలు వీటిలో పాగావేసి సొంతం చేసుకునేలా చూశారు. ఇదే భూముల్లో ముగ్గురు డీఎస్పీలు, నలుగురు సీఐలకు ఆ కీలక నేత విల్లాలు కట్టించి ఇచ్చారనే ఆరోపణలున్నాయి. తాజాగా ఎంఆర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ ఎదురుగా సర్వే నంబరు 242/బిలో హథీరామ్‌జీ మఠానికి చెందిన 9.89 ఎకరాల్లో ఇద్దరు వేర్వేరుగా సాగు చేసుకునేందుకు లీజు తీసుకున్నారు. దీనిపై అభ్యంతరాలు ఉన్నప్పటికీ కోర్టు ద్వారానే ఆ లీజులు ఆదేశాలు రప్పించుకొని, ఎకరాకు ఏటా రూ.2 వేల చొప్పున చెల్లించేందుకు అంగీకరించారు. అయితే వాటిలో భవంతులు నిర్మిస్తున్నారు. ఇందులో 5.73 ఎకరాల్లో ఇద్దరు సోదరులు విల్లాలు నిర్మిస్తుండటంపై గత నెల మొదటి వారంలో మఠం అధికారులు ఆక్రమణ తొలగింపు నోటీసు (దేవాదాయశాఖ సెక్షన్‌ 83 నోటీసు) జారీచేశారు. దీనిపై నిర్మాణాలు చేస్తున్న లీజుదారులు హైకోర్టును ఆశ్రయించగా, మఠం అధికారులు అక్కడి నిర్మాణాల ఫొటోలను కోర్టు ముందు ఆధారాలుగా చూపారు. దీంతో యథాతథ స్థితి కొనసాగించాలంటూ హైకోర్టు ఆదేశించింది.

ఉద్యోగులపై దాడి.. చంపుతామంటూ హెచ్చరిక

కోర్టు ఆదేశాలున్నప్పటికీ ఆ భూముల్లో నిర్మాణాలు మాత్రం ఆపలేదు. దీంతో ప్రస్తుత పరిస్థితిపై ఫొటోలు తీసుకురావాలంటూ ఇద్దరు మఠం ఉద్యోగులను అధికారులు సోమవారం పంపారు. ఫొటోలు తీస్తున్న ఆ ఇద్దరు ఉద్యోగులను కీలక నేత అనుయాయులు ఓ గదిలో బంధించి చితక్కొట్టినట్లు తెలిసింది. చివరగా వారి చేతిలో డబ్బులు ఉంచి, ఫొటోలు తీసినట్లు సమాచారం. ఎవరికైనా ఫిర్యాదు చేసినా, మీడియాకు ఇదంతా చెప్పినా.. డబ్బులు డిమాండ్‌ చేశారంటూ ఏసీబీకీ పట్టిస్తామని, బయటకు ఇదంతా తెలిస్తే మీ అంతు చూస్తామని తీవ్రస్థాయిలో హెచ్చరించినట్లు తెలిసింది. ఎంఆర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ ఎదురుగా ఉన్న భూమిలోనే ఇదంతా జరిగినా.. ఇప్పటి వరకు మఠం అధికారులుగానీ, దేవాదాయశాఖ ఉన్నతాధికారులు గానీ పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం విస్మయం కలిగిస్తోంది. ఆ ఉద్యోగులు ఇద్దరూ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చేందుకు భయపడుతున్నట్లు తెలిసింది. ఈ విషయం దేవాదాయశాఖ కమిషనర్‌కు కూడా తెలిసిందని సమాచారం. అయితే ‘ముఖ్య’నేతకు అత్యంత సన్నిహితుడైన కీలక నేత దీనివెనుక ఉండటంతోపాటు, అదే ప్రాంతంలో ఇద్దరు పోలీసు అధికారులు నిర్మించుకున్న భవంతులు కూడా ఉండటంతో.. దేవాదాయశాఖ అధికారులు మౌనంగా ఉన్నారనే విమర్శలు వస్తున్నాయి.

నిషేధిత జాబితాలో ఉన్నా.. అడ్డుకోలేరు

హథీరామ్‌జీ మఠానికి అవిలాల, తుమ్మలకుంట, చింతలక్ష్మీ కాలనీ.. తదితర అనేక ప్రాంతాల్లో ఉన్న భూములు ఆక్రమణలకు గురయ్యాయి. ముఖ్యంగా అవిలాలలో ఎక్కువగా రాజకీయ నేతలు, ఎర్రచందనం స్మగ్లర్లు, పోలీసుశాఖలో అధికారులు, ప్రముఖులు దర్జాగా భారీ భవంతులు, విల్లాలు నిర్మించుకున్నారు. గత ఏడాది మఠం మహంతును ప్రభుత్వం తొలగించి, ఓ డిప్యూటీ కలెక్టర్‌ను ఫిట్‌ పర్సన్‌గా నియమించింది. ఆ తర్వాత మఠం సిబ్బంది ఏదైనా ఆక్రమణల జోలికి వెళితే.. ముందుగా అవిలాలలో బడాబాబుల భవంతులను కూల్చిన తర్వాత మా దగ్గరకు రండని ఆక్రమణదారులు ఎదురుతిరుగుతున్నారు. అయితే అవిలాలలో ఆక్రమణలు, నిర్మాణాల వెనుక కీలక నేత, ఆయన సోదరుడు ఉండటంతో అధికారులు వాటి జోలికివెళ్లే సాహసం చేయడం లేదు. గతంలో ఉన్న మఠం మహంతు నిర్లక్ష్యం, కోర్టులో సకాలంలో అప్పీళ్లకు వెళ్లపోవడం కారణంగా వివిధ సర్వే నంబర్లలో 174.75 ఎకరాలు వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమిగా మార్చి, ఇళ్లు నిర్మించుకునే అవకాశం ఏర్పడింది. ఈ భూములన్నీ నిషేధిత భూముల జాబితా (22ఎ)లో ఉన్నాయి. వీటి రిజిస్ట్రేషన్‌, క్రయవిక్రయాలకు అవకాశం లేదు. అయినాసరే స్టాంప్‌ పేపర్లపై అగ్రిమెంట్ల ద్వారా దందా సాగిపోతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని