Azad Engineering Listing: ఆజాద్‌ ఇంజినీరింగ్‌ లిస్టింగ్‌ అదుర్స్‌.. 7 రెట్లు పెరిగిన సచిన్‌ పెట్టుబడి!

Azad Engineering Listing: సచిన్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ వంటి దిగ్గజ క్రీడాకారుల పెట్టుబడులు ఉన్న ఆజాద్‌ ఇంజినీరింగ్‌ కంపెనీ షేర్లు గురువారం స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్టయ్యాయి.

Updated : 28 Dec 2023 14:50 IST

దిల్లీ: ఆజాద్‌ ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌ షేర్లు గురువారం స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్టయ్యాయి (Azad Engineering Listing). ఇష్యూ ధర రూ.524తో పోలిస్తే బీఎస్‌ఈలో 35.49 శాతం ప్రీమియంతో రూ.710 దగ్గర అరంగేట్రం చేసింది. ఎన్‌ఎస్‌ఈలో 37.40 శాతం పుంజుకొని రూ.720 దగ్గర ట్రేడింగ్‌ ప్రారంభించింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.4,219.19 కోట్లుగా నమోదైంది. ఐపీఓలో షేర్లు అలాట్‌ అయినవారు కనీసం 28 షేర్లకు రూ.14,672 పెట్టుబడిగా పెట్టారు. వారికి లిస్టింగ్‌లో ఒక్కో లాట్‌పై రూ.5,488 లాభం వచ్చింది.

గత శుక్రవారం ముగిసిన ఆజాద్‌ ఇంజినీరింగ్ ఐపీఓకు 80.60 రెట్ల స్పందన లభించిన విషయం తెలిసిందే. రూ.240 కోట్లు విలువ చేసే తాజా షేర్లతో పాటు రూ.500 కోట్లు విలువ చేసే షేర్లను ‘ఆఫర్‌ ఫర్‌ సేల్‌’ కింద విక్రయించారు. ఐపీఓలో ధరల శ్రేణిని రూ.499- 524గా నిర్ణయించారు. సమీకరించిన నిధులను మూలధన వ్యయం, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఏరోస్పేస్‌, రక్షణ, ఇంధన, చమురు పరిశ్రమలకు చెందిన కంపెనీలకు ఆజాద్‌ ఇంజినీరింగ్‌ తమ ఉత్పత్తులను సరఫరా చేస్తుంటుంది. జనరల్‌ ఎలక్ట్రిక్‌, హనీవెల్‌ ఇంటర్నేషనల్‌, మిట్సుబిషీ హెవీ ఇండస్ట్రీస్‌, సీమెన్స్‌ ఎనర్జీ, ఈటన్‌ ఏరోస్పేస్‌, ఎంఏఎన్‌ ఎనర్జీ సొల్యూషన్స్‌ వంటి ప్రముఖ కంపెనీలు ఆజాద్‌ ఇంజినీరింగ్‌కు కస్టమర్లుగా ఉన్నాయి.

ఆజాద్ ఇంజినీరింగ్‌లో సచిన్‌ తెందూల్కర్‌, సైనా నెహ్వాల్‌, వీవీఎస్ లక్ష్మణ్‌, పీవీ సింధు, నిఖత్‌ జరీన్‌ వంటి ప్రముఖ క్రీడాకారులకు వాటాలున్నాయి. లిస్టింగ్‌ తర్వాత తెందూల్కర్‌ పెట్టుబడి విలువ దాదాపు ఏడు రెట్లు పెరిగింది. ఈ ఏడాది మార్చిలో ఆయన ఒక్కో షేరును రూ.3,423 చొప్పున 14,607 షేర్లను కొనుగోలు చేశారు. తర్వాత కంపెనీ రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరును రూ.2 ముఖ విలువ కలిగిన ఐదు షేర్లుగా విభజించింది (Stock split). అలాగే ఒక్కో షేరుకు మరో ఐదు షేర్లను బోనస్‌గా జారీ చేసింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే తెందూల్కర్‌ షేర్లు 4.5 లక్షలకు చేరాయి. ఫలితంగా ఒక్కో షేరు సగటు కొనుగోలు ధర రూ.110గా ఉంది. తాజా ఐపీఓలో ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద ఆయన షేర్లను విక్రయించలేదు. ఈ లెక్కన ఆయన దాదాపు రూ.ఐదు కోట్లు పెట్టుబడిగా పెట్టగా.. తాజా షేరు ధర ప్రకారం అది దాదాపు రూ.32 కోట్లకు చేరింది.

(గమనిక: స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి నష్టభయంతో కూడుకొన్న వ్యవహారం. ఈ వార్త/కథనం సమాచారం కోసం మాత్రమే. స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని