Gautam Adani: అదానీ కంపెనీకి భారత్‌ కంటే అధిక రేటింగ్‌!

అదానీ గ్రూప్‌నకు చెందిన ఒక కంపెనీ త్వరలోనే భారత సార్వభౌమ రేటింగ్‌ కంటే ఎక్కువ రేటింగ్‌ సాధించే అవకాశం ఉందని ఆ సంస్థ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.

Updated : 14 Oct 2022 08:22 IST

దేశంలోనే ఈ ఘనత సాధించే తొలి సంస్థ

త్వరలోనే ప్రకటనకు అవకాశం

దిల్లీ: అదానీ గ్రూప్‌నకు చెందిన ఒక కంపెనీ త్వరలోనే భారత సార్వభౌమ రేటింగ్‌ కంటే ఎక్కువ రేటింగ్‌ సాధించే అవకాశం ఉందని ఆ సంస్థ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ఆసియా కుబేరుల్లో అగ్రస్థానంలో ఉన్న గౌతమ్‌ అదానీకి చెందిన ఈ సంస్థ తన వ్యాపారంలో వేగవంతమైన వృద్ధిని, తక్కువ రుణాలను నమోదు చేస్తుండడమే ఇందుకు కారణమని, ఎంపిక చేసిన పెట్టుబడిదార్ల సమావేశంలో అదానీ గ్రూప్‌ సీఎఫ్‌ఓ జుగేషిందర్‌ సింగ్‌ పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.  ఆ కంపెనీ పేరును సింగ్‌ తెలపలేదని ఆ సమావేశానికి హాజరైన ఆ వర్గాలు పేర్కొన్నాయి.

రిలయన్స్‌కు వచ్చింది కానీ..

ఎస్‌ అండ్‌ పీ, ఫిచ్‌ వంటి అంతర్జాతీయ రుణ రేటింగ్‌ సంస్థలు భారత్‌కు అతి తక్కువ పెట్టుబడి గ్రేడ్‌ రేటింగ్‌ అయిన ‘బీబీబీ-’ను ఇచ్చాయి. ప్రభుత్వ రంగ దిగ్గజాలతో పాటు చాలా వరకు కంపెనీలు ఈ రేటింగ్‌ లేదా అంతకంటే తక్కువ సార్వభౌమ రేటింగ్‌ను కలిగి ఉన్నాయి. గతేడాది జూన్‌లో ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు భారత సార్వభౌమ రేటింగ్‌ కంటే ఒక మెట్టు ఎక్కువే ఫిచ్‌ రేటింగ్స్‌ ఇచ్చింది. అయితే దేశం వెలుపలా రిలయన్స్‌కు వ్యాపారాలున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోనే తన మొత్తం వ్యాపారాలుండి.. భారత్‌ కంటే అధిక రేటింగ్‌ సాధించనున్న తొలి భారతీయ కంపెనీ అదానీదదే అవుతుందని సింగ్‌ అంటున్నారు.

ఈ రెండింటిలోనేనా?

అదానీ గ్రూప్‌నకు ఉన్న 6 నమోదిత కంపెనీల్లో.. ప్రస్తుతం అదానీ ట్రాన్స్‌మిషన్‌కు సార్వభౌమ రేటింగ్‌కు సమానంగా రేటింగ్‌ ఉంది. దీనిని ఫిచ్‌ నుంచి బీబీబీ-(ప్రతికూల అంచనా); ఎస్‌ అండ్‌ పీ నుంచి బీబీబీ-; మూడీస్‌ నుంచి బీఏఏ3(స్థిర అంచనా) రేటింగ్‌ ఉన్నాయి. సంస్థ పునర్నిర్మాణం నేపథ్యంలో కంపెనీ విజ్ఞప్తి మేరకు ఎస్‌ అండ్‌ పీ తన రేటింగ్‌ను ఉపసంహరించుకుంది. అదానీ గ్రీన్‌ ఎనర్జీకి కూడా సార్వభౌమ రేటింగ్‌తో సమానంగా రేటింగ్‌ ఉంది. మరి ఈ రెండింటిలోనే ఒక కంపెనీ, సార్వభౌమ రేటింగ్‌ను మించిన రేటింగ్‌ సాధించనుందా లేదంటే మరో కంపెనీయా అన్నది తెలియరాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని