Jyoti CNC Automation IPO: జ్యోతి సీఎన్‌సీ ఐపీఓ ధరల శ్రేణి రూ.315-331

Jyoti CNC Automation IPO: రూ.1000 కోట్ల సమీకరణ లక్ష్యంతో జ్యోతి సీఎన్‌సీ ఆటోమేషన్‌ పబ్లిక్‌ ఇష్యూకు వస్తోంది.

Updated : 04 Jan 2024 12:19 IST

Jyoti CNC Automation IPO | దిల్లీ: గుజరాత్‌ కేంద్రంగా పనిచేస్తున్న జ్యోతి సీఎన్‌సీ ఆటోమేషన్‌ పబ్లిక్‌ ఇష్యూ (Jyoti CNC Automation IPO) షేరు ధరల శ్రేణిని కంపెనీ రూ.315-331గా నిర్ణయించింది. ఈ ఐపీఓ జనవరి 9న ప్రారంభం కానుంది. గరిష్ఠ ధర వద్ద రూ.1,000 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలకు 2024లో ఇదే తొలి మెయిన్‌బోర్డ్‌ ఐపీఓ కావడం గమనార్హం. జనవరి 11 వరకు షేర్లకు బిడ్లు దాఖలు చేయొచ్చు.

గత నెలలోనే  జ్యోతి సీఎన్‌సీ ఆటోమేషన్‌ ఐపీఓకు (Jyoti CNC Automation IPO) గత నెలలోనే మార్కెట్ల నియంత్రణా సంస్థ సెబీ అనుమతి ఇచ్చింది. ఈ పబ్లిక్‌ ఆఫర్‌లో పూర్తిగా కొత్త షేర్లను మాత్రమే జారీ చేస్తున్నారు. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద ఎలాంటి షేర్లు అందుబాటులో లేవు. ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను రుణ చెల్లింపులు, దీర్ఘకాల మూలధనం, సాధారణ కార్పొరేట్‌ అవసరాలను ఉపయోగిస్తామని కంపెనీ తెలిపింది.

‘కంప్యూటర్‌ న్యూమరికల్‌ కంట్రోల్‌ (CNC)’ యంత్రాలను తయారు చేస్తున్న ప్రముఖ కంపెనీల్లో జ్యోతి సీఎన్‌సీ ఆటోమేషన్‌ ఒకటి. ఇస్రో, బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ తిరువనంతపురం లిమిటెడ్‌, టర్కిష్‌ ఏరోస్పేస్‌, ఎంబీడీఏ, యూనిపార్ట్స్‌ ఇండియా, టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్‌ లిమిటెడ్‌, టాటా సికోస్కీ ఏరోస్పేస్‌, భారత్‌ ఫోర్జ్‌, కల్యాణి టెక్నోఫోర్జ్‌, రోలెక్స్‌ రింగ్స్‌ వంటి కంపెనీలు జ్యోతి సీఎన్‌సీ కస్టమర్ల జాబితాలో ఉన్నాయి. 2023 సెప్టెంబర్‌ నాటికి కంపెనీ ఆర్డర్‌ బుక్‌ విలువ రూ.3,315 కోట్లుగా ఉంది.

ఈక్విరస్‌ క్యాపిటల్‌, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌.. జ్యోతి సీఎన్‌సీ ఐపీఓకి (Jyoti CNC Automation IPO) బుక్ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. ఈ కంపెనీ షేర్లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో నమోదు కానున్నాయి. 2013లోనూ ఐపీఓకి సన్నాహాలు చేసుకున్నప్పటికీ.. వివిధ కారణాల వల్ల అప్పట్లో ప్రణాళికలను పక్కనపెట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని