Stock Market: కొనసాగుతున్న లాభాల జైత్రయాత్ర.. 18,850 ఎగువన నిఫ్టీ!

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా ఎనిమిదో రోజూ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూలం సంకేతాలు అందుకు దోహదం చేస్తున్నాయి.

Published : 01 Dec 2022 09:36 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీల్లో లాభాల జైత్రయాత్ర కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలోని ర్యాలీ అందుకు దోహదం చేస్తోంది. అమెరికాలో వడ్డీరేట్ల పెంపులో వేగాన్ని తగ్గించనున్నట్లు ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ బుధవారం ప్రకటించారు. దీంతో అక్కడి సూచీలు ఏప్రిల్‌ తర్వాత తొలిసారి ‘200 డే మూవింగ్‌ యావరేజ్‌’ ఎగువన ట్రేడింగ్‌ను ముగించాయి. ఆసియా- పసిఫిక్‌ సూచీల్లోనూ ర్యాలీ కొనసాగుతోంది. మరోవైపు సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో అంచనాలకు అనుగుణంగా భారత జీడీపీ 6.3 శాతంగా నమోదైంది. విదేశీ మదుపర్లు బుధవారం ఏకంగా రూ.9,000 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. ఇవన్నీ సూచీల పరుగుకు కారణమవుతున్నాయి.

ఈ పరిణామాల మధ్య ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్‌ 409 పాయింట్ల లాభంతో 63,509 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 110 పాయింట్లు ఎగబాకి 18,869 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.02 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, టాటా స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌యూఎల్‌, పవర్‌గ్రిడ్‌, ఎంఅండ్‌ఎం, ఏషియన్‌ పెయింట్స్‌, మారుతీ, ఐటీసీ, ఎన్‌టీపీసీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

గమనించాల్సిన స్టాక్స్‌...

ఆల్‌స్టోమ్‌ ఇండియా, టిటాగఢ్‌ వ్యాగన్స్‌, సీమెన్స్‌: 200 లైట్‌వెయిట్‌ వందే భారత్‌ రైళ్ల తయారీ కోసం భారతీయ రైల్వే బిడ్లను ఆహ్వానించింది. రూ.26,000 కోట్లు విలువ చేసే ఈ ఆర్డర్‌ కోసం బిడ్లు దాఖలు చేసిన ఐదు కంపెనీల్లో ఆల్‌స్టోమ్‌ ఇండియా, టిటాగఢ్‌ వ్యాగన్స్‌, సీమెన్స్‌ ఉన్నాయి.

టీసీఎస్‌: యూకేకు చెందిన ‘రైల్‌ డేటా మార్కెట్‌ప్లేస్‌’ రూపకల్పన, అభివృద్ధి, అమలు, నిర్వహణకు సంబంధించిన కాంట్రాక్టును ‘రైల్‌ డెలివరీ గ్రూప్‌’ నుంచి సొంతం చేసుకున్న టీసీఎస్‌ తెలిపింది.

అపోలో హాస్పిటల్స్‌: రూ.105 కోట్లు విలువ చేసే ‘నాన్‌-కన్వర్టబుల్‌ డిబెంచర్స్‌’ జారీకి బుధవారం అపోలో హాస్పిటల్స్ బోర్డు ఆమోదం తెలిపింది.

మనాలీ పెట్రోకెమికల్స్‌: యూకే కేంద్రంగా పనిచేస్తున్న పెన్‌ గ్లోబ్‌ను మనాలీ పెట్రోకెమికల్స్‌ సొంతం చేసుకుంది. ఫోమ్‌ కంట్రోల్‌ ఏజెంట్స్‌, ల్యూబ్రికెంట్స్‌, సర్ఫేస్‌ కోటింగ్స్‌, రిలీజ్‌ ఏజెంట్స్‌, సిలికోన్‌ ఎమల్షన్స్‌ తయారీలో పెన్‌ గ్లోబ్‌ మార్కెట్ లీడర్‌గా కొనసాగుతోంది.

కేపీఐ గ్రీన్‌ ఎనర్జీ: 1:1 నిష్పత్తిలో బోనస్‌ షేర్ల జారీకి కేపీఐ గ్రీన్‌ ఎనర్జీ బోర్డు బుధవారం జరిగిన సమావేశంలో సిఫార్సు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని