Tata Tech IPO: టాటా టెక్‌ ఐపీఓ ధరల శ్రేణి రూ.రూ.475-500.. కనీసం ఎంత పెట్టుబడి పెట్టాలంటే?

Tata Tech IPO: ఇప్పటికే ఐపీఓ తేదీలను ప్రకటించిన టాటా టెక్‌.. తాజాగా పబ్లిక్‌ ఇష్యూ పూర్తి వివరాలను వెల్లడించింది.

Updated : 17 Nov 2023 14:55 IST

Tata Tech IPO | ఇంటర్నెట్‌ డెస్క్‌: మదుపర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాటా టెక్‌ ఐపీఓ (Tata Tech IPO) పూర్తి వివరాలు వెల్లడయ్యాయి. నవంబరు 22న ప్రారంభం కానున్న ఈ పబ్లిక్‌ ఇష్యూ 24న ముగియనున్నట్లు ఆ కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. తాజాగా ధరల శ్రేణి, కనీస పెట్టుబడి సహా ఇతర కీలక సమాచారాన్ని వెల్లడించింది. ఐపీఓలో ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.475-500గా నిర్ణయించింది. ఈ లెక్కన అత్యధిక ధర వద్ద కంపెనీ రూ.3,042 కోట్లు సమీకరించనుంది. రిటైల్‌ మదుపరులు కనీసం 30 షేర్లను కొనాలని నిబంధన విధించింది. దీని ప్రకారం గరిష్ఠ ధర వద్ద కనీసం రూ.15 వేలు పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది.

ఈ ఐపీఓ (Tata Tech IPO)లో 6.08 కోట్ల షేర్లను టాటా టెక్‌ అందుబాటులో ఉంచుతోంది. ఇది కంపెనీ పెయిడ్‌ అప్‌ ఈక్విటీ షేర్‌ క్యాపిటల్‌లో 15 శాతానికి సమానం. ఈ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా టాటా మోటార్స్‌ తమ వాటాలో 11.4 శాతాన్ని ఉపసంహరించుకుంటోంది. అదనంగా ఆల్ఫా టీసీ హోల్డింగ్స్‌ 2.4 శాతం, టాటా క్యాపిటల్‌ గ్రోత్‌ ఫండ్‌-I 1.2 శాతం వాటాలను విక్రయిస్తున్నాయి. ఐపీఓ (Tata Tech IPO) పరిమాణాన్ని గణనీయంగా తగ్గించారు. తొలుత 9.57 కోట్ల షేర్లను విక్రయించాలనుకున్నారు. కానీ, దాన్ని తాజాగా 6.08 కోట్లకు కుదించారు. ఈ ఐపీఓ పూర్తిగా ‘ఆఫర్‌ ఫర్‌ సేల్‌’ ప్రాతిపదికన జరుగుతున్న నేపథ్యంలో సమీకరించిన నిధులు కంపెనీకి చెందబోవు. ఈ ఐపీఓలో 10 శాతం వాటాను ప్రత్యేకంగా టాటా మోటార్స్‌ వాటాదారుల కోసం రిజర్వ్‌ చేశారు.

2004లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ను పబ్లిక్‌ ఇష్యూకు తీసుకొచ్చిన టాటా గ్రూప్‌ దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ మరో సంస్థను ఐపీఓ (Tata Tech IPO)కు తీసుకురావడం ఇదే. కంపెనీకి 18 అంతర్జాతీయ డెలివరీ కేంద్రాలున్నాయి. దాదాపు 11 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇంజినీరింగ్‌, పరిశోధన-అభివృద్ధి (ఈఆర్‌అండ్‌డీ) సేవలు, డిజిటల్‌ ఎంటర్‌ప్రైజ్‌ సర్వీసెస్‌ (డీఈఎస్‌), ఎడ్యుకేషన్‌ ఆఫరింగ్స్‌, వాల్యూ యాడెడ్‌ రీసెల్లింగ్‌ అండ్‌ ఐప్రోడక్ట్స్‌ ఆఫరింగ్స్‌ విభాగాల్లో వ్యాపారాలున్నాయి. టాటా మోటార్స్‌, జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌ సహా టాటా గ్రూప్‌లోని ఇతర సంస్థలకు ఇది ప్రధానంగా సేవలందిస్తోంది.

టీపీజీ క్లైమెట్‌ తొమ్మిది శాతం వాటా కొనుగోలు చేసిన సమయంలో టాటా టెక్‌ విలువను చివరిసారి రూ.16,300 కోట్లుగా అంచనా వేశారు. 2022 డిసెంబరుతో ముగిసిన తొమ్మిది నెలల వ్యవధిలో వార్షిక ప్రాతిపదికన కంపెనీ ఆదాయం 15 శాతం పెరిగి రూ.3,052 కోట్లకు చేరింది. నికర లాభం రూ.407 కోట్లుగా నమోదైంది.

ఐపీఓ వివరాలు సంక్షిప్తంగా..

  • ఐపీఓ తేదీలు: నవంబరు 22-24
  • ఒక్కో షేరు ముఖ విలువ : రూ.2
  • ధరల శ్రేణి : రూ.475- 500
  • కనీసం ఆర్డర్‌ చేయాల్సిన షేర్లు : 30 (ఒక లాట్‌)
  • కనీస పెట్టుబడి: రూ.15,000 (గరిష్ఠ ధర వద్ద)
  • షేర్ల కేటాయింపు తేదీ : నవంబరు 30
  • రిఫండ్ల ప్రారంభ తేదీ : డిసెంబరు 1
  • డీమ్యాట్‌ ఖాతాకు షేర్ల బదిలీ : డిసెంబరు 4
  • లిస్టింగ్‌ తేదీ : డిసెంబరు 5
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని