logo

నాలాలు ఇలా.. వరద పారేదెలా

వర్షాకాలం ఆదిలాబాద్‌ పట్టణవాసులకు చుక్కలు కనపడుతున్నాయి. రోడ్లు, కాలనీలు జలమయమై తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Published : 02 Jun 2023 04:05 IST

బల్దియాలో వానాకాలం పొంచి ఉన్న ముప్పు


కొత్తహౌజింగ్‌బోర్డు కాలనీలో రూ.1.60 కోట్లతో బీటీ రోడ్డు, వరద నీటి కాలువ నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. బీటీ రోడ్డును పూర్తి చేసిన గుత్తేదారు రెండేళ్లుగా నాలాను నిర్మించడం లేదు. దీంతో ఏటా వర్షాకాలం ఇక్కడ వాగును తలపించేలా వరద నీరు పారుతోంది.


నెల కిందట కురిసిన అకాల వర్షంతో రవీంద్రనగర్‌లో ఇరుగ్గా ఉన్న ఈ మురుగు కాలువ చెత్తాచెదారంతో పూడుకుపోయింది. దీంతో వర్షపునీరు నిలిచిపోయి స్థానికులు ఇబ్బందులు పడ్డారు. పట్టణంలోని పలు కాలనీల్లో ఇలా ఇరుకైన పాత మురుగు కాలువలు అనేకమున్నాయి.


న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ అర్బన్‌: వర్షాకాలం ఆదిలాబాద్‌ పట్టణవాసులకు చుక్కలు కనపడుతున్నాయి. రోడ్లు, కాలనీలు జలమయమై తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భారీ వర్షాలు కురిస్తే వరద లోతట్టు కాలనీలను ముంచెత్తుతోంది. బంగారుగూడ, ఖానాపూర్‌, కొత్త హౌజింగ్‌బోర్డు కాలనీ, కేఆర్కే కాలనీ, దివ్యాంగుల కాలనీ, 170 కాలనీ, రాంనగర్‌, శ్రీనగర్‌ కాలనీల్లో గతంలో ఇదే అనుభవం ఎదురైంది. అపుడు అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టేందుకు ఆపసోపాలు పడింది. మరికొన్ని రోజుల్లో వానాకాలం మొదలుకానుంది. ఇప్పటికీ కొన్ని కాలనీల్లో మురుగు, వరదనీటి సమస్యలకు పరిష్కారం లభించలేదు. ఎడతెరిపి లేని వర్షాలు కురిస్తే మళ్లీ ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అసంపూర్తిగా మురుగు కాలువలు

ఇది నిర్మాణంలో ఉన్న ఒక భవనానికి సంబంధించిన చిత్రం. ఇందులో విశేషమేముందని అనుకుంటున్నారా? భవన నిర్మాణం జరుగుతున్నది ఓ మురుగు కాలువపైన. దశాబ్దాల కిందటే ఇక్కడ నాలా నిర్మాణం ఉంది. ద్వారకానగర్‌, బస్టాండ్‌ దిగువ రహదారి నుంచి వచ్చే వర్షపు నీరంతా ఈ నాలాలోకి వస్తుంది. ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులు పూడిక తొలగించే పరిస్థితి లేకుండా పోతోంది. ఈ నిర్మాణంపై అధికారులకు ఫిర్యాదులు వెళ్లినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.


జిల్లా కేంద్రంలో అసంపూర్తి కాలువల నిర్మాణంతో మురుగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఏటా వర్షాకాలంలో సమస్యలు వస్తే సహాయక చర్యలు చేపట్టడమే కానీ వానాకాలం ముగిశాక ఎక్కడెక్కడ సమస్యలున్నాయో గుర్తించి మరోసారి ఆ పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవడంలో యంత్రాంగం విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాన రహదారుల వెంట వరద కాలువలు నిర్మించినా కాలనీల్లో చాలాచోట్ల ఇరుకైన కాలువలే ఉన్నాయి. అవి పూడుకుపోయి నీళ్లు బయటకు వస్తున్నాయి. విలీన కాలనీల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. కొత్త హౌజింగ్‌బోర్డు కాలనీ, రాంనగర్‌, పంజేశామహల్‌, మోచిగల్లీ, ద్వారకానగర్‌ తదితర కాలనీల్లో డ్రైనేజీల నిర్మాణానికి గతంలో నిధులు వెచ్చించినా ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. మరికొందరు నాలాలను ఆక్రమించుకుని అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం లేదు. వాణిజ్య ప్రాంతాల్లో వ్యాపారులు తమ దుకాణాల్లోకి వెళ్లేందుకు వీలుగా నాలాలపై శ్లాబులు నిర్మించుకున్నారు. దీంతో పూడిక తొలగించడం కార్మికులకు కష్టంగా మారింది. వానాకాలం సమీపించడంతో ప్రస్తుతం బల్దియా యంత్రాంగం ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్‌ నిర్వహిస్తోంది. రూ.5 లక్షలతో అదనపు కార్మికులను వినియోగించుకుని కాలువల్లో పూడికను తొలగించే పని చేపడుతున్నారు.


25వ వార్డులో రెండేళ్ల కిందట రూ.30 లక్షలతో మురుగు కాలువ మంజూరైంది. గుత్తేదారు సగం వరకు కాలువ నిర్మించి మధ్యలోనే పనులు వదిలేశారు. కాలువకు సమీపంలో రెండు పాఠశాలలు, నివాసగృహాలున్నాయి. స్థానిక కౌన్సిలర్‌ రాజేష్‌ పలుమార్లు అధికారులను కలిసి కాలువ నిర్మాణం పూర్తి చేయాలని విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని