logo

చదివేదెలా... ఫీజులు కట్టేదెలా?

స్టడీహాల్‌, హాస్టల్‌ ఫీజులు పోటీ పరీక్షల అభ్యర్థులకు భారంగా మారుతున్నాయి.. నియంత్రించే యంత్రాంగం లేకపోవడంతో ఇష్టారీతిన రుసుములు పెంచేస్తున్నారు.

Published : 06 Mar 2023 03:19 IST

పోటీ పరీక్షల అభ్యర్థుల వెతలు
స్టడీ హాళ్లలో డబుల్‌ దందా
ఈనాడు, హైదరాబాద్‌

ఓ స్టడీహాల్‌లో చదువుకుంటున్న అభ్యర్థులు

స్టడీహాల్‌, హాస్టల్‌ ఫీజులు పోటీ పరీక్షల అభ్యర్థులకు భారంగా మారుతున్నాయి.. నియంత్రించే యంత్రాంగం లేకపోవడంతో ఇష్టారీతిన రుసుములు పెంచేస్తున్నారు. దీంతో వ్యయ ప్రయాసలు కోర్చి నగరానికి వస్తున్న అభ్యర్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. లైబ్రరీల్లో చదివేందుకు వెళ్తే రద్దీ ఎక్కువగా ఉండటం, ఆరు బయట చదివేందుకు చెట్ల నీడను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో స్టడీహాల్‌కు నెలకు రూ.800 నుంచి రూ.1000కు ఫీజు వసూలు చేయగా ప్రస్తుతం దానిని రూ.2,000 పెంచడంతో ఆర్థిక భారం పడుతోందని చెబుతున్నారు. కనీస సదుపాయాలు లేకుండా గదుల్లో కుక్కేసి హాస్టల్‌ ఫీజులు అమాంతం పెంచేశారని వాపోతున్నారు.

ఏకాగ్రత కోసం..

పోటీపరీక్షల కోచింగ్‌ కేంద్రాలకు నెలవైన అశోక్‌నగర్‌, ఆర్టీసీ గాంధీనగర్‌లో 150కి పైగా స్టడీహాళ్లున్నాయి. నెలవారీ ఫీజు కడితే ఓ డెస్క్‌, పుస్తకాలు, ఇతర సామగ్రి అమర్చుకునే సొరుగు, వైఫై, తాగునీరు సదుపాయాలు కల్పిస్తారు. ఏకాగ్రత చెదరకుండా ఉండేలా ఇతర అభ్యర్థులు పక్కనే చదువుతుండటంతో చాలామంది స్టడీహాళ్లలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. నివాస గృహాలనే స్టడీహాల్‌గా మార్చేస్తూ దీనిని ఓ లాభసాటి వ్యాపారంగా మలచుకుంటున్నారు. హాస్టల్‌, పుస్తకాలు, కోచింగ్‌ సెంటర్‌ ఫీజు ఇతరత్రా ఖర్చులు తడిసి మోపడవుతున్నాయని అభ్యర్థులు చెబుతున్నారు. హాస్టళ్లలో ఉండి చదువుకునే వెసులుబాటు ఉన్నా.. రెండు గంటల్లో వాట్సాప్‌, సోషల్‌మీడియా, ఇతర వ్యాపకాలతో ఏకాగ్రత చెదిరిపోతోందని, చుట్టూ విద్యార్థులు చదువుతుంటే పోటాపోటీగా చదివే ఆసక్తి ఉంటుందని చెబుతున్నారు.

రూ.2వేలు కడితేనే ప్రాధాన్యం..

స్టడీహాళ్లలో మరో దందా జరుగుతోంది... రూ.1500, రూ.2000 చెల్లించినవారంటూ వర్గాలుగా విభజించి తాత్కాలిక, శాశ్వత సభ్యత్వం అంటూ డబుల్‌ దందాకు నిర్వాహకులు తెరలేపారు. ఒకే స్టడీహాల్‌లో 200 మందిని కూర్చొబెడుతూ... రూ.2వేలు చెల్లించిన వారికి ప్రత్యేక క్యాబిన్‌ ఇస్తూ రూ.1500 చెల్లించిన వారు స్థలం దొరికితేనే కూర్చోవాలంటూ అడ్మిషన్‌ సమయంలోనే చెప్పేస్తున్నారు. ఎక్కడా స్టడీహాల్‌ దొరక్కపోవడంతో చాలామంది ఈ రూ.1500 సభ్యత్వం తీసుకుని ఇబ్బందులు పడుతున్నారు.

హాస్టల్‌ ఫీజులపై నియంత్రణేదీ..?

సివిల్స్‌, రాష్ట్ర స్థాయి పరీక్షల కోసం సన్నద్ధమయ్యే అభ్యర్థులు ఎక్కువగా ఉండే అశోక్‌నగర్‌ ఓ వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందింది. హిమాయత్‌నగర్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌, అశోక్‌నగర్‌, గాంధీనగర్‌ ప్రాంతాల్లో వేలాది మంది అభ్యర్థులు హాస్టళ్లు, అద్దె గదుల్లో ఉంటూ సాధన చేస్తుంటారు. నోటిఫికేషన్లు వెలువడంతో హాస్టళ్ల నిర్వాహకులు కొత్త దందాకు తెరతీశారు. హాస్టల్‌ ఫీజులపై నియంత్రణ లేకపోవడంతో ఇష్టారీతిన పెంచేస్తున్నారు. గతంలో రూ.4000 నుంచి రూ.5000 వరకు చెల్లిస్తే వసతి, భోజన సదుపాయాలు ఉండేవని ఇప్పుడు అమాంతం ఒక్కొక్కరి నుంచి రూ.7000 నుంచి రూ.8వేల వరకు వసూలు చేస్తున్నారు. వేలాది రూపాయలు ఫీజులు చెల్లిస్తున్నా కనీస సదుపాయాలు ఉండటం లేదని వాపోతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని