logo

నిర్వహణ తీసికట్టు

నగరంలో ఏర్పాటు చేసిన ప్రజా మరుగుదొడ్లు కొంతమందికి బంగారు బాతులా మారాయి. వాటిని కొనుగోలు చేయడం నుంచి డ్రైనేజీ లైనుతో అనుసంధానించడం వరకు అన్నింట్లోనూ దోచుకుంటున్నారు.

Published : 28 May 2023 01:45 IST

ప్రజా మరుగుదొడ్ల పేరుతో దోపిడీ
వినియోగంలో లేకున్నా శుభ్రం చేస్తున్నట్లు లెక్కలు

చాంద్రాయణగుట్ట ఆర్‌ఓబీ వద్ద వినియోగంలో లేని మరుగుదొడ్డిని శుభ్రం చేసినట్లు క్యూఆర్‌ కోడ్‌ ద్వారా హాజరు నమోదు చేస్తున్న గుత్తేదారు సంస్థ ప్రతినిధి


ఏర్పాటు చేసిన ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ మరుగుదొడ్లు: 2,260
వాటికి జీహెచ్‌ఎంసీ చేసిన వ్యయం: రూ.56.56 కోట్లు
రెండేళ్లలో నిర్వహణకు చేసిన ఖర్చు: రూ.25.52 కోట్లు


ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో ఏర్పాటు చేసిన ప్రజా మరుగుదొడ్లు కొంతమందికి బంగారు బాతులా మారాయి. వాటిని కొనుగోలు చేయడం నుంచి డ్రైనేజీ లైనుతో అనుసంధానించడం వరకు అన్నింట్లోనూ దోచుకుంటున్నారు. ఇవి ఏర్పాటు చేసిన నెల రోజులు కూడా నిలవలేదు. సుమారు 2 వేల మరుగుదొడ్లు చెత్తకుప్పల్లా మారాయి. వీటిల్లోని నల్లాలు, డబ్బాలు, పైపులు, బేసిన్లు, నీటి ట్యాంకులు, బల్బులు చోరీకి గురయ్యాయి. నిరుపయోగంగా మారినవి బహిరంగ మూత్రవిసర్జనకు అడ్డాలయ్యాయి. ఇదంతా నాణేనికి ఒకవైపు కాగా.. మరోవైపు వీటి నిర్వహణ పేరుతో రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. ఒక్కో మరుగుదొడ్డిని రోజకు రెండుసార్లు శుభ్రం చేయాలి. ఇందుకు నెలకు రూ.8,500 చొప్పున చెల్లించడానికి గుత్తేదారు సంస్థలకు పని ఇచ్చారు. నగర వ్యాప్తంగా పది శాతం కూడా వినియోగంలో లేకపోయినా వంద శాతం బిల్లులు చెల్లిస్తుండటం గమనార్హం.ప్రతినెలా సుమారు రూ.కోటి ప్రజాధనాన్ని నిర్వహణ పేరుతో ఖర్చు చేస్తున్నారంటే దోపిడీ ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.


ప్రణాళికతో.. నిధులు పక్కదారి

టెండరు ప్రక్రియ ముగియగానే గుత్తేదారు సంస్థలు ప్రీఫ్యాబ్రికేటెడ్‌ మరుగుదొడ్లను బల్దియాకు అందించాయి. వాటిని ఎంపిక చేసిన ప్రాంతాల్లో పెట్టి, నీరు, విద్యుత్తు, డ్రైనేజీ కనెక్షన్లు ఇవ్వాల్సిన బాధ్యత జీహెచ్‌ఎంసీది. కానీ బల్దియా ఆ పని చేయలేదు. మరుగుదొడ్డి డబ్బాలను ఎక్కడపడితే అక్కడ పడేసింది. కొన్ని ఇప్పటికే చెత్తలో కలిసిపోయాయి. ఫలక్‌నుమా డిగ్రీ కళాశాల ఎదురుగా ఉన్న చెత్తకుప్పల్లో ఆరు మరుగుదొడ్లు, మొఘల్‌పుర స్పోర్ట్స్‌ కాంప్లెక్సులోని చెత్తకుప్పలో 20కిపైగా మరుగుదొడ్లు కుప్పలుగా పడి ఉండటమే అందుకు నిదర్శనం. దోపిడీకి అలవాటుపడ్డ అధికారులు అంతటితో ఆగలేదు. కాగితాల్లో ఉన్న దొడ్లకు, కాగితాల్లోనే నిర్వహణ లెక్కలు రాసి డబ్బు సంపాదించేందుకు ప్రణాళిక రచించారు. నిర్వహణ పనులను ప్రైవేటు సంస్థలకు ఇచ్చి,  ప్రతి నెలా ఒక్కో మరుగుదొడ్డికి రూ.8,500లు చెల్లిస్తున్నట్లు రెండేళ్లపాటు బిల్లులు చెల్లించారు. ఫిర్యాదులు పెరగడంతో.. తాజాగా కమిషనర్‌ లోకేష్‌కుమార్‌ నెలవారీ బిల్లును రూ.3,500లకు కుదించారని సమాచారం.


దోపిడీకే ‘టెండరు’..

సెప్టెంబరు, 2020 వరకు నగరంలో 450 ప్రజా మరుగుదొడ్లు ఉండేవి. వీటి సంఖ్యను 5వేలకు పెంచాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ఈ పనిని జోనల్‌ కార్యాలయాలకు అప్పగించడంతో.. టెండరు ప్రక్రియను కొందరు అధికారులు దుర్వినియోగం చేశారు. ఉదాహరణకు.. చార్మినార్‌ జోన్‌లో ఆరు సర్కిళ్లు ఉన్నాయి. మారుతి, ఇక్జోరా, కాయా, తదితర సంస్థలు జోన్‌కు అవసరమైన మరుగుదొడ్లను సరఫరా చేస్తామని ముందుకొచ్చాయి. ఇక్జోరా సంస్థ గరిష్ఠంగా ఒక్కో మరుగుగొడ్డి డబ్బాను రూ.9.5లక్షలకు, కనిష్ఠంగా రూ.3.5లక్షలకు విక్రయిస్తామంది. ఓ సంస్థ రూ.94వేలకు, మరో సంస్థ రూ.2.5లక్షలకు, రూ.1.5లక్షలకు విక్రయిస్తామని తెలిపాయి. ఆ లెక్కన అన్ని సంస్థలకు దాదాపు సమాన మొత్తంలో కాంట్రాక్టు ఇచ్చేట్లు కొందరు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. దాని ప్రకారం.. సర్కిళ్లవారీగా టెండర్లు పిలిచి.. పోటీ లేకుండా పనులను పంచారనే విమర్శలున్నాయి. ఇతర జోన్లలోనూ టెండరు ప్రక్రియ దాదాపు ఇలాగే జరిగిందని, విచారణ జరిపించాలని తాజాగా పాతబస్తీ నేత పొన్న వెంకటరమణ కమిషనర్‌ డి.ఎస్‌.లోకేష్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని