logo

స్వచ్ఛత మెరవాలి.. పట్టణం మురవాలి

‘స్వచ్ఛతే హితం..స్వచ్ఛతే ఆరోగ్యం’ అంటూ జిల్లాలోని పురపాలికలు పారిశుద్ధ్యానికి తగిన ప్రాధాన్యం ఇస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో గతంలో స్వచ్ఛత కోసం మున్సిపల్‌ అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు.

Published : 04 Jun 2023 03:22 IST

పురపాలికల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ కేంద్రాల ఏర్పాటు

పరిగిలో పాత సామగ్రి అందజేస్తున్న మహిళలు

న్యూస్‌టుడే, వికారాబాద్‌ మున్సిపాలిటీ, పరిగి: ‘స్వచ్ఛతే హితం..స్వచ్ఛతే ఆరోగ్యం’ అంటూ జిల్లాలోని పురపాలికలు పారిశుద్ధ్యానికి తగిన ప్రాధాన్యం ఇస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో గతంలో స్వచ్ఛత కోసం మున్సిపల్‌ అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ (రెడ్యూస్‌, రీ-యూజ్‌, రీ-సైకిల్‌) కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా పట్టణంలోని వనరుల పునర్వినియోగానికి శ్రీకారం చుట్టారు. వ్యర్థాల సేకరణకు ప్రత్యేకంగా కార్యక్రమాన్ని చేపట్టి అమలు చేస్తున్నారు. జిల్లాలోని వికారాబాద్‌, పరిగి, తాండూరు, కొడంగల్‌ పురపాలికల్లో ఇందుకోసం మూడు నుంచి 5 కేంద్రాలను ప్రారంభించారు. రాను రాను వీటి సంఖ్యను పెంచనున్నారు. ఈ నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ కథనం.

అవగాహనకు మెప్మా, ఆర్పీల సహకారం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్‌, స్వచ్ఛ సర్వేక్షణ్‌ కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆర్‌ఆర్‌ఆర్‌ కేంద్రాలను నెలకొల్పారు. వికారాబాద్‌ పురపాలిక పరిధిలో 3 కేంద్రాలు శివరాంనగర్‌, గాంధీపార్కు, వెంకటేశ్వర కాలనీలో, పరిగి పురపాలికలో 5 కేంద్రాలను ప్రారంభించారు. మెప్మా ఆర్పీల సహకారంతో వార్డుల్లో చెత్త వేరు చేయటం, పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించటం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు.  

పాదరక్షలు మొదలు ఏవైనా సరే..

ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘మేరా లైఫ్‌, మేరా స్వచ్ఛ షెహర్‌’ పేరిట ఆర్‌ఆర్‌ఆర్‌ కార్యక్రమాన్ని చేపట్టింది. పాదరక్షలు, పాత పుస్తకాలు, దుస్తులు, ఇనుప సామగ్రి, ప్లాస్టిక్‌ సామగ్రి, బొమ్మలు, బకెట్లు, మగ్గులు, దిండ్లు, కుర్చీలు తదితరాలను ఈ కేంద్రాలకు అందజేయవచ్చు. వీటిలో ప్రత్యేకంగా సిబ్బంది అందుబాటులో ఉంటారు. తీసుకున్న వస్తువులకు రసీదును అందజేస్తారు. ఉపయోగపడే వాటిని పేదలకు పంపిణీ చేస్తారు. మిగిలిన వాటిని రీసైక్లింగ్‌ కోసం హైదరాబాద్‌కు పంపిస్తారు. రాబోయే రోజుల్లో 5 వాహనాల ద్వారా ఒక్కొక్క వాహనాన్ని వార్డులో తిప్పి పాత సామగ్రిని సేకరిస్తారు.  


ప్రజలు సహకరించాలి: మొయినొద్దీన్‌, పారిశుద్ధ్య ఇన్‌స్పెక్టర్‌, వికారాబాద్‌

వికారాబాద్‌ పట్టణంలో పరిశుభ్రతకు తగిన ప్రాధాన్యం ఇస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటించి అమలు చేస్తున్నాం. ఆర్‌ఆర్‌ఆర్‌ను నిరంతరం కొనసాగించాలన్న యోచనలో ఉన్నాం. మొబైల్‌ వాహనాల ద్వారా ఇంటింటికీ వాహనాలను పంపి సామగ్రిని సేకరించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని