logo

వ్యూహ రచన.. గెలుపు యోచన

చేవెళ్ల పార్లమెంట్‌ స్థానంలో గెలుపు బావుటా ఎగురవేసేందుకు ప్రధాన పార్టీలు వ్యూహ రచన చేస్తున్నాయి.

Updated : 30 Mar 2024 05:53 IST

చేవెళ్లలో ప్రధాన రాజకీయ పార్టీల ఎత్తులకు పైఎత్తులు

చేవెళ్ల పార్లమెంట్‌ స్థానంలో గెలుపు బావుటా ఎగురవేసేందుకు ప్రధాన పార్టీలు వ్యూహ రచన చేస్తున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా దృష్టి కేంద్రీకరించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నియోజకవర్గంపై ఆసక్తి నెలకొంది. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ముఖ్యనాయకులతో సమన్వయ కమిటీలు, మండలాలు, గ్రామాల్లో ఎన్నికల కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రధాన పార్టీలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి అమలు చేసిన, చేయనున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ఓటర్లకు వివరించాలని కాంగ్రెస్‌, ఎన్నికల తరుణంలో ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలను ఎండగట్టాలని భారాస, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, మోదీ ప్రభుత్వం అందిస్తున్న సుస్థిర పాలన తదితర అంశాలను విస్తృతంగా ప్రచారం చేయాలని భాజపా భావిస్తున్నాయి. 

న్యూస్‌టుడే, వికారాబాద్‌.


శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు భారాస..

రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో భారాస కార్యకర్తలు నిరుత్సాహానికి గురయ్యారు. ఈ లోపే లోక్‌సభ ఎన్నికలు రావడం, ఓటమి భారం నుంచి శ్రేణులు ఇంకా కోలుకోకపోవడంతో వారిలో ఆత్మవిశ్వాసం నింపే దిశగా అధిష్ఠానం చర్యలు చేపట్టింది. మేమున్నామంటూ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి భరోసా నింపుతోంది. ఐదేళ్ల అనంతరం పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని, అధైర్యపడవద్దని నమ్మకం కలిగిస్తోంది. జడ్పీ అధ్యక్షురాలు సునీతారెడ్డి, సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరి అభ్యర్థులుగా పోటీ చేయడం వంటి పరిణామాలు కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. అధికారం కోల్పోవడం, ఎంపీలను గెలిపిస్తే కేంద్రంలో క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశాలు లేకపోవడం వంటి అంశాలు ప్రతికూలంగా మారనున్నాయి. జిల్లాలో నాయకులను సమన్వయం చేసే బాధ్యతను మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డికి అప్పగించినట్లు తెలిసింది.  

ఆధిక్యత చాటేందుకు కాంగ్రెస్‌

విజయమే లక్ష్యంగా జిల్లాలోని పరిగి, వికారాబాద్‌, తాండూరు నియోజకవర్గాల్లో ఆధిక్యత చాటేలా కాంగ్రెస్‌ కార్యాచరణ చేపట్టింది. ఈ సందర్భంగా పరపతి, పలుకుబడి ఉన్న నేతలతో ప్రత్యేకంగా చర్చలు జరుపుతున్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో వికారాబాద్‌లో 26,500, పరిగిలో 24,300 కాంగ్రెస్‌కు ఆధిక్యత వచ్చింది. తాండూరులో మాత్రం భారాసకు 1,250 ఓట్ల స్వల్ప ఆధిక్యత వచ్చింది. ఇతర పార్టీల్లోని కీలక నాయకులపై హస్తం పార్టీ దృష్టి సారించింది. శాసనసభ ఎన్నికలకు ముందు పార్టీని వీడిన వారిని తిరిగి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార కాంగ్రెస్‌లో చేరేందుకు ఈ ఎన్నికలను అవకాశంగా తీసుకోవాలని పలువురు ప్రతిపక్ష నాయకులు పార్టీ మారేందుకు సమాలోచనలు చేస్తున్నారు. ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలను చేర్చుకుంటున్నారు.

భాజపాలో సమరోత్సాహం..

కాషాయ జెండా ఎగురవేయాలన్న సమరోత్సాహంతో అవసరమైన వ్యూహానికి భాజపా రూపకల్పన చేస్తోంది. భారీ సభలతో సంబంధం లేకుండా, క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, ప్రజల మధ్యే ఉండేలా కార్యక్రమాలు చేపడుతున్నారు. భారాస ముఖ్యనేతలను పార్టీలోకి ఆహ్వానించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాండూరు నియోజకవర్గంలో భారాసకు చెందిన ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. ప్రధాని మోదీ చరిష్మాతో పాటు, కేంద్ర ప్రభుత్వ పని తీరును ప్రచారాస్త్రాలుగా సంధిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల్లో ఉన్న అదృశ్య మిత్రుల సహకారం కలిసి వచ్చే అంశంగా భాజపా భావిస్తోంది.

జిల్లాలో మొత్తం ఓటర్లు 9,79,155

మార్చి 15న జారీ చేసిన ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో మొత్తం ఓటర్లు 9,79,166 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 4,83,354 మంది ఉండగా, స్త్రీలు 4,95,779, ట్రాన్స్‌జెండర్లు 33 మంది ఉన్నారు. వీటిలో కొడంగల్‌ నియోజకవర్గం మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ పరిధిలోకి వస్తుంది. ఈ ఓట్లను మినహాయిస్తే చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలోకి వచ్చే ఓట్లు 7,38,311 ఉన్నాయి. వీరిలో పురుషులు 3,64,908, స్త్రీలు 3,73,375 మంది ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని