logo

నన్నొదిలేసి వెళ్లిపోతావా బిడ్డా..

షాపింగ్‌కని తల్లిని తీసుకొచ్చిన కుమారుడు వదిలేసి పలాయనం చిత్తగించిన ఘటన కేపీహెచ్‌బీ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌హెచ్‌వో వెంకటేశ్వరరావు వివరాల ప్రకారం..

Updated : 10 May 2024 05:42 IST

తల్లిని వదిలించుకునేందుకు కుమారుడి యత్నం

రాజేశ్వరి

కేపీహెచ్‌బీకాలనీ: షాపింగ్‌కని తల్లిని తీసుకొచ్చిన కుమారుడు వదిలేసి పలాయనం చిత్తగించిన ఘటన కేపీహెచ్‌బీ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌హెచ్‌వో వెంకటేశ్వరరావు వివరాల ప్రకారం.. గురువారం సాయంత్రం నెక్సెస్‌మాల్‌లోని ప్యాంట్‌లూన్‌ షోరూంలో నడవలేని స్థితిలో ఓ వృద్ధురాలు మధ్యాహ్నం నుంచి ఒంటరిగా ఉందని పోలీసులకు సమాచారం అందింది. వెళ్లి ఆరా తీయగా..తన కుమారుడు ఉదయం షాపింగ్‌కు వెళ్దామని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాడని.. వాష్‌రూంకి వెళ్లొస్తానని చెప్పి రాలేదని వాపోయింది. పోలీసులు షోరూంలో సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలించగా..వృద్ధురాలిని వదిలేసిన కుమారుడు తన ఒంటిపై ఉన్న దుస్తులు చెత్తడబ్బాలో వేసి కొత్తవి ధరించి వెళ్లిపోయినట్లు గుర్తించారు. పథకం ప్రకారమే వదిలేసి వెళ్లాడని పోలీసులు భావిస్తున్నారు. తన కుమార్తెకి వివాహమైందని, కుమారుడితో అత్తాపూర్‌లో ఉంటానని, తన పేరు రాజేశ్వరి అని వృద్ధురాలు కన్నీరు పెట్టుకుంది. ఆమెను ఠాణాకు తరలించిన పోలీసులు సమీపంలోని వృద్ధాశ్రమంలో చేర్పించే పనిలో ఉన్నారు. పోలీసులకు లభించిన ఆధార్‌ కార్డు ప్రకారం..వృద్ధురాలి కుమారుడి పేరు సంగీత్‌కుమార్‌ అర్పల్లి అని తెలుసుకున్నారు. వృద్ధురాలిని ఏ పరిస్థితిలో వదిలేశాడో అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని