logo

సొమ్ములు కట్టారు... పట్టాలేవీ?

విశాఖలో శనివారం ఉమ్మడి విశాఖ జడ్పీ సమావేశం నిర్వహించారు. సమావేశం పది గంటలకే మొదలుకావాల్సి ఉన్నా ఆ సమయానికి అందరూ రాకపోవడంతో ఆలస్యంగా ప్రారంభించారు.

Updated : 27 Nov 2022 05:22 IST

జడ్పీ సమావేశంలో ప్రశ్నించిన సభ్యులు


సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ముత్తంశెట్టి, ఎమ్మెల్సీ మాధవ్‌

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: విశాఖలో శనివారం ఉమ్మడి విశాఖ జడ్పీ సమావేశం నిర్వహించారు. సమావేశం పది గంటలకే మొదలుకావాల్సి ఉన్నా ఆ సమయానికి అందరూ రాకపోవడంతో ఆలస్యంగా ప్రారంభించారు. ముందుగా ఛైర్‌పర్సన్‌ సుభద్ర, విశాఖ, అల్లూరి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వచ్చి భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సభ్యులతో ప్రతిజ్ఞ చేయించారు. 11 గంటలకు పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి వచ్చారు. తర్వాత మంత్రి అమర్‌నాథ్‌, విప్‌ ధర్మశ్రీ వేదికపైకి వచ్చారు. కొద్దిసేపటికి అనకాపల్లి కలెక్టర్‌ రవి, ఎమ్మెల్సీ మాధవ్‌, వరుదు కల్యాణి, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ డా.సత్యవతి ఒక్కొక్కరుగా వచ్చారు. నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్‌ విశ్రాంతిలో ఉన్నారు. విశాఖ, అరకు ఎంపీలు, ఎలమంచిలి, పాయకరావుపేట, అరకులోయ, పెందుర్తి ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు ముఖ్యమంత్రితో భేటీ ఉందని హాజరు కాలేదు. జడ్పీటీసీ సభ్యుల్లోనూ కొందరు రాలేదు.

* ఓటీఎస్‌ కింద డబ్బులు తీసుకుని రిజిస్ట్రేషన్‌ చేసిన పట్టాలు ఇవ్వలేదని, ఆ డబ్బులైనా ఇప్పించండి లేకుంటే పట్టాలైనా ఇవ్వాలని దేవరాపల్లి జడ్పీటీసీ సభ్యుడు కర్రి సత్యం కోరారు.

* ఏజెన్సీలో ఇళ్ల నిర్మాణంలో ఉన్న అడ్డంకులను తొలగించాలని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి  అధికారులను కోరారు. తెదేపా హయాంలో కొందరికి ఇళ్లు కేటాయించినా బిల్లులు ఇవ్వకపోవడంతో వేల సంఖ్యలో అసంపూర్తిగా ఉండిపోయాయని, వాటిని పూర్తి చేయిస్తే బాగుంటుందని హుకుంపేట జడ్పీటీసీ సభ్యుడు మత్స్యలింగం చెప్పారు. పాత ఇళ్లకు సుమారు రూ.9 కోట్లు చెల్లించాల్సి ఉందని ఆ ప్రతిపాదన ప్రభుత్వం దృష్టిలో ఉన్నట్లు హౌసింగ్‌ అధికారులు తెలిపారు.

* ‘పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలో జరిగిన పనుల్లో వాస్తవ వివరాలనే చెప్పాలి. ఒకసారి క్షేత్రస్థాయిలో పనులు వివరాలు ఎలా ఉన్నాయో పరిశీలించండి’ అని ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అధికారులకు సూంచించారు.

* గతంలో మంజూరు చేసిన మినీ గోకులాలకు సంబంధించి బిల్లులు చెల్లింపుల్లో పశుసంవర్థక శాఖ, డ్వామా అధికారుల తీరు బాగోలేదని భీమిలి జడ్పీటీసీ సభ్యుడు గాడు వెంకటప్పడు ఆరోపించారు. ఆ రెండు శాఖల సమన్వయ లోపం కారణంగా రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. దీనిపై ఇరుశాఖల అధికారులతో మాట్లాడి బిల్లులు చెల్లించేలా చూస్తానని అనకాపల్లి కలెక్టర్‌ హామీ ఇచ్చారు.

* కేజీహెచ్‌లో ఎస్టీ సెల్‌ సిబ్బంది పనితీరు బాగోలేదని, గిరిజనులు చనిపోతే వారిని మహాప్రస్థానంలోకి పంపించడానికి ఇబ్బందులు పెడుతున్నారని ఏజెన్సీకి చెందిన పలువురు సభ్యులు ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని