జేకేసీలో 188 వినతుల స్వీకరణ
జగనన్నకు చెబుదాం (జేకేసీ)లో అధికారులు 188 అర్జీలు స్వీకరించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ ఎ.మల్లికార్జున, జేసీ కె.ఎస్.విశ్వనాథన్, డీఆర్వో శ్రీనివాసమూర్తి, ఆర్డీవో హుస్సేన్ సాహెబ్, జీవీఎంసీ, పోలీసు అధికారులు పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్ మల్లికార్జున, జేసీ కె.ఎస్.విశ్వనాథన్ తదితరులు
వన్టౌన్, న్యూస్టుడే: జగనన్నకు చెబుదాం (జేకేసీ)లో అధికారులు 188 అర్జీలు స్వీకరించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ ఎ.మల్లికార్జున, జేసీ కె.ఎస్.విశ్వనాథన్, డీఆర్వో శ్రీనివాసమూర్తి, ఆర్డీవో హుస్సేన్ సాహెబ్, జీవీఎంసీ, పోలీసు అధికారులు పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వ్యక్తిగత అంశాలైన రేషను కార్డులు ఇవ్వాలని, కార్డుల్లో తొలగించిన పేర్లను పునరుద్ధరించాలని, ఇళ్లు మంజూరు చేయాలని, రద్దు చేసిన పింఛన్లు పునరుద్ధరించాలని, నగరంలో జీవీఎంసీ పరంగా నెలకొన్న సమస్యలు, భూ సమస్యలపై అధికంగా అర్జీలు అందాయి. మొత్తం అర్జీల్లో రెవెన్యూ-58, జీవీఎంసీ-56, పోలీసు-13, ఇతర శాఖలకు సంబంధించి-61 చొప్పున వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు అర్జీల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. వచ్చిన వినతులే మళ్లీ రాకుండా చూడాలని, సమస్య పరిష్కరించిన తర్వాత ఆయా వివరాలను అర్జీదారునికి తెలియజేయాలన్నారు.
* రానున్న వర్షాకాలం నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వరద ముంపు ప్రాంతాలను గుర్తించి ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. మండల స్థాయిలో మాక్ డ్రిల్ నిర్వహించాలన్నారు. శిథిలావస్థ భవనాల విషయంలో జీవీఎంసీ అధికారులు అప్రమత్తం కావాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గెడ్డలు, కాలువల ఆక్రమణలను వెంటనే తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు.
పోలీసు స్పందనకు 57 అర్జీలు
అర్జీదారులతో మాట్లాడుతున్న సీపీ త్రివిక్రమ వర్మ
ఎం.వి.పి.కాలనీ, న్యూస్టుడే : నగర పోలీసు కమిషనర్ త్రివిక్రమ వర్మ ఆధ్వర్యంలో సోమవారం స్పందన పోలీసు సమావేశమందిరంలో నిర్వహించారు. నగరంలోని వివిధ పోలీసుస్టేషన్ల పరిధిలోని పలువురు అర్జీదారులు స్పందనలో పాల్గొని తమ వినతులు సమర్పించి, తమ సమస్యలను సీపీ త్రివిక్రమ వర్మకు విన్నవించారు. సమస్యలను విన్న ఆయన వెంటనే సంబంధిత స్టేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి తెలుసుకున్నారు. స్పందనకు వచ్చిన అర్జీలను పరిశీలించి, త్వరతగతిన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం జరిగిన స్పందనకు 57 మంది తమ వినతులు సమర్పించారు. క్రైమ్ డీసీపీ నాగన్న, ఏడీసీపీ (పరిపాలన) ఎం.ఆర్.కె.రాజు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.