logo

పంచరత్నాలు.. వావ్‌ అనిపించారు..!

లక్ష్య  సాధన నల్లేరు మీద నడక కాదు.. కష్టాలు, కన్నీళ్లు, ఎన్నో ప్రయత్నాల వెనుకే గెలుపు దాగి ఉంటుందని ఎన్నో విజయ గాథలు మనకు చెబుతున్నాయి.

Updated : 17 Apr 2024 10:42 IST

సివిల్స్‌లో సత్తా చాటిన ఓరుగల్లు బిడ్డలు

లక్ష్య  సాధన నల్లేరు మీద నడక కాదు.. కష్టాలు, కన్నీళ్లు, ఎన్నో ప్రయత్నాల వెనుకే గెలుపు దాగి ఉంటుందని ఎన్నో విజయ గాథలు మనకు చెబుతున్నాయి. అలాంటి ఒడుదొడుకులను దాటుకుని గెలిచే సత్తా ఓరుగల్లు యువతకు ఉందని మరోసారి నిరూపితమైంది.. మంగళవారం యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్‌ ఫలితాల్లో ఓరుగల్లు గడ్డ నుంచి ఐదుగురు యువకిశోరాలు సత్తా చాటి జయకేతనం ఎగురవేశారు.  ప్రజాసేవ చేయాలనే సంకల్పమే వారి విజయానికి ఇంధనం. లక్ష్య ఛేదనలో ఎదురైన వైఫల్యాలను గెలుపునకు సోపానాలుగా మార్చుకుని ప్రతిష్ఠాత్మక సివిల్స్‌లో మెరిశారు. ఈ క్రమంలో ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటూ వారు చేసిన ప్రయాణం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఆదర్శం..

- ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి


మొదటి ప్రయత్నంలోనే..

జనగామ జిల్లా కేంద్రానికి చెందిన వ్యాపారవేత్త మెరుగు సుజాత-సుధాకర్‌ దంపతుల కుమారుడు మెరుగు కౌశిక్‌  మొదటి ప్రయత్నంలోనే 82వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ఈ విజయం పట్ల పట్టణానికి చెందిన పలువురు హర్షం వ్యక్తం చేశారు.  తల్లిదండ్రులు స్పందిస్తూ.. ‘మా అబ్బాయికి చిన్నప్పటి నుంచే చదువుపై ఆసక్తి ఎక్కువ. ఆ మేరకు మంచి విద్యను అందించాలనే బాధ్యతతో చదివించాం. దేశ స్థాయిలో ఇంతమంచి ర్యాంకు రావడమనేది స్వయంకృషికి దక్కిన విజయం. ఐఏఎస్‌ కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చదువును కష్టంగా కాకుండా ఇష్టంగా చదివితే ఏదైనా సాధించవచ్చు.. దీనికి మావాడే నిదర్శనం’ అని చెప్పారు.

- న్యూస్‌టుడే, జనగామ అర్బన్‌


తండ్రి మార్గదర్శకంలో..

హనుమకొండ హంటర్‌రోడ్‌లోని విద్యుత్‌నగర్‌కు చెందిన రావుల జయసింహారెడ్డి  నాలుగో  ప్రయత్నంలో 104 ర్యాంకు సాధించి ఐఏఎస్‌కు చేరువలోకి వచ్చారు.  తండ్రి రావుల ఉమారెడ్డి వరంగల్‌ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఏడీఆర్‌గా పనిచేస్తున్నారు. ఆయన కుమారుడు రావుల జయసింహారెడ్డి ఇంటర్మీడియట్‌ నుంచే కలెక్టర్‌ కావాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. తండ్రి ప్రోత్సాహంతోనే ఎలాంటి శిక్షణ లేకుండా యూట్యూబ్‌,  ఇంటర్నెట్‌లో సమాచారాన్ని సేకరించుకొని సివిల్స్‌కు సిద్ధమైనట్లు జయసింహారెడ్డి చెప్పారు.

-న్యూస్‌టుడే, వరంగల్‌ వ్యవసాయం


కష్టే ఫలి..

 పేరు: కొయ్యడ ప్రణయ్‌ కుమార్‌, ర్యాంకు:  554 

  • ఎన్నో ప్రయత్నం:   మొదటి ప్రయత్నంలో 2022లో 855 ర్యాంకు సాధించారు. ఇండియన్‌ రైల్వే మేనేజ్‌మెంట్‌ సర్వీసు సాధించి ప్రస్తుతం లక్నోలో శిక్షణ పొందుతున్నారు.
  • తల్లిదండ్రులు:  ప్రభాకర్‌, లక్ష్మి
  • చిరునామా:  జనగామ జిల్లా రఘునాథపల్లి 
  •  విద్యాభ్యాసం:  నాగారం ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి, హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో బీటెక్‌ పూర్తిచేశారు
  •  నేపథ్యం:  నిరుపేద కుటుంబం. ఉపాధి లేక హైదరాబాద్‌కు వలస వెళ్లారు.

తల్లిదండ్రుల కష్టాలను తీర్చాలని పట్టుదలతో చదివా:  ప్రణయ్‌కుమార్‌

మా తల్లిదండ్రులది కులాంతర ప్రేమ వివాహం. వారెన్నో అవమానాలు, బాధలను భరిస్తూ నన్ను చదివించారు. తలిదండ్రుల కష్టాలను తీర్చాలనే పట్టుదలతో, ఐఏఎస్‌ కావాలనే లక్ష్యంతోనే సివిల్స్‌లో విజయం సాధించాను.  పేదరిక నిర్మూలన, సమాజంలో అసమానతల తొలగింపు, విద్యా, వైద్యానికి మొదటి ప్రాధాన్యం ఇస్తూ సేవలందిస్తాను.

రఘునాథపల్లి, న్యూస్‌టుడే


విజయమే లక్ష్యంగా..

పేరు: కోటే అనిల్‌కుమార్‌, ర్యాంకు: 764   

  •  ఇండియన్‌ పోస్టల్‌ సర్వీసులో డిప్యూటీ డైరెక్టర్‌ (అకౌంట్్స)గా పనిచేస్తూనే తాజా ఫలితాల్లో 764 ర్యాంకు సాధించారు.  
  •  కొటే కొమురయ్య (సోషల్‌వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంటు విశ్రాంత ఉద్యోగి), సరోజన (గృహిణి)
  • వరంగల్‌ శివనగర్‌ నాలుగు జెండాల ప్రాంతం
  • శివనగర్‌లోని రెనాల్డ్స్‌ స్కూల్‌లో, ఆ తర్వాత ప్లాటినం జూబ్లి స్కూల్‌, ఇంటర్‌ విజయవాడ నారాయణలో పూర్తిచేసి, బీటెక్‌ వరంగల్‌ నిట్లో చదివారు. మొదట హైదరాబాద్‌ ఎల్‌బీనగర్‌లో ఎలక్ట్రిసిటీ శాఖలో ఏఈగా ఉద్యోగం రాగా, కొంతకాలం పనిచేసి మానేశారు. రైల్వేలో ఉద్యోగం వచ్చినా చేరకుండా సివిల్స్‌ సాధనే లక్ష్యంగా ముందుకు సాగారు. 
  • దంపతులకు ముగ్గురు కుమారులు, పెద్దకుమారుడు శ్రీకాంత్‌ బ్యాంకు మేనేజర్‌గా, రెండో కుమారుడు శ్రీధర్‌ జైలువార్డెన్‌గా పనిచేస్తుండగా, మూడో కుమారుడు అనిల్‌కుమార్‌ సివిల్స్‌లో సత్తా చాటారు.

 ప్రస్తుతం అనిల్‌ కోల్‌కతాలో ఉన్నారు. తండ్రి కొమురయ్య మాట్లాడుతూ ఐఏఎస్‌కు బదులుగా ఐఆర్‌ఎస్‌ సర్వీసు వస్తుందన్న ఆశలో తమ కుమారుడున్నాడని తెలిపారు. తన బిడ్డకు పుస్తకాలంటే ఇష్టమని, చరవాణి కేవలం మాట్లాడేందుకే ఉపయోగిస్తారని చెప్పారు.

న్యూస్‌టుడే, శివనగర్‌


పట్టు వదలకుండా..

పేరు: సయింపు కిరణ్‌, ర్యాంకు: 568

  •   బీటెక్‌ పూర్తయిన తర్వాత 2018లో సివిల్స్‌ మొదటి ప్రయత్నం చేశారు. ప్రిలిమ్స్‌ కూడా క్వాలిఫై కాలేదు. లోపాలను సవరించుకుంటూ మరింత పట్టుదలతో ప్రయత్నం కొనసాగించారు. 2019, 2020లో మెయిన్స్‌ వరకు 2021, 2022లో ఇంటర్వ్యూ వరకు హాజరై పోస్టల్‌ సర్వీస్‌లో ఉద్యోగం సాధించారు. ఉద్యోగం చేస్తూనే 2023లో చివరి ప్రయత్నం చేశారు. ఈ సారి విజయం కిరణ్‌ సొంతమైంది అత్యుత్తమ ర్యాంకు సాధించారు.
  •   ప్రభాకర్‌రావు, జయలక్ష్మి
  •  పెదనందిపాడు మండలం గొరిజవోలుగుంటపాలెం గ్రామం. దశాబ్దాల కిందటే తల్లిదండ్రులు వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం అనంతారం గ్రామానికి వలస వచ్చారు.
  •   వరంగల్‌లోని జవహర్‌ నవోదయ విద్యాలయంలో పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఇంటర్మీడియట్ ప్రైవేటు కళాశాలలో పూర్తి చేసి జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 1598 ర్యాంకు సాధించి దిల్లీ ఐఐటీలో బీటెక్‌ పూర్తి చేశారు
  •  వ్యవసాయ కుటుంబం, సోదరి గిరిజ

నిరంతరం శ్రమిస్తే విజయం: కిరణ్‌

వ్యవసాయ కుటుంబంలో పుట్టాను. మట్టి వాసన తెలిసిన వ్యక్తిగా సామాన్య ప్రజల కష్టాలను తీర్చడంలో  మెరుగ్గా పని చేస్తాను.. అపజయాలతో కుంగిపోకుండా నిరంతరంగా శ్రమిస్తే విజయం సాధించవచ్చు.

న్యూస్‌టుడే, గీసుకొండ  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని