397ఏళ్ల అనంతరం..ఆకాశంలో మరో అద్భుతం!

దాదాపు నాలుగు శతాబ్దాల సుదీర్ఘ తర్వాత ఆకాశంలో మరో అద్భుతం జరుగబోతోంది. ఈ నెల 21వ తేదీన గురు-శని గ్రహాలు అతి దగ్గరగా చేరి అత్యంత ప్రకాశవంతంగా కనిపించనున్నాయి.

Published : 07 Dec 2020 01:03 IST

దగ్గరగా కనిపించనున్న గురు-శని గ్రహాలు

కోల్‌కతా: దాదాపు నాలుగు శతాబ్దాల సుదీర్ఘకాలం తర్వాత ఆకాశంలో మరో అద్భుతం జరుగబోతోంది. ఈ నెల 21వ తేదీన గురు-శని గ్రహాలు అతి దగ్గరగా చేరి అత్యంత ప్రకాశవంతంగా కనిపించనున్నాయి. 1623 తర్వాత ఈ రెండు గ్రహాలు ఇంత దగ్గరగా ఎప్పుడూ రాలేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీంతో ఈ అరుదైన సన్నివేశంపై ఆసక్తి నెలకొంది.

భూమినుంచి చూస్తే ఏవేని రెండు గ్రహాలు అతి దగ్గరగా చేరినట్లు కనిపించే దృశ్యాన్ని కంజక్షన్‌గా పిలుస్తారు. ఇలా గురు-శని గ్రహాలు కనిపించడాన్ని మాత్రం గ్రేట్‌ కంజక్షన్‌గా అభివర్ణిస్తారు. ప్రస్తుతం ఈ రెండు గ్రహాలు నిత్యం కొంతదగ్గరగా వస్తున్నాయి. భూమిపై నుంచి చూస్తోన్న మనకు సాయంత్రం సమయాల్లో ఇవి స్పష్టంగానే కనిపిస్తాయి. అయితే, డిసెంబర్‌ 21వ తేదీన మాత్రం అతి దగ్గరకు వచ్చినట్లు కనిపిస్తాయి. అప్పుడు వీటి మధ్య దూరం దాదాపు 73.5కోట్ల కిలోమీటర్ల దూరం ఉండనున్నట్లు శాస్త్రవేత్తల అంచనా.

అయితే, ప్రతినెల చంద్రుడు(భూమికి ఉపగ్రహం)-అంగారకుడు, చంద్రుడు-గురు, చంద్రుడు-శని సహా ఇతర గ్రహాలు దగ్గరగా కనిపించడాన్ని చూస్తూనే ఉంటాం. అంతేకాకుండా ఇలా చంద్రుని సహాయంతో గ్రహాలను గుర్తించే ప్రక్రియ కూడా ఎంతో కాలంగా జరుగుతూనే ఉంది. మనం భూమిపై నుంచి చూసినప్పుడు ఇలా గ్రహాలు దగ్గరకు వచ్చినట్లు కనిపించడాన్ని కంజక్షన్‌గా పిలుస్తుంటాం. అయితే, చంద్రుడు కాకుండా మిగతా గ్రహాలు కూడా ఒక్కోసారి దగ్గరగా వచ్చినట్లు కనిపిస్తుంటాయి. ఇందులో భాగంగానే మనకు గతకొద్ది కాలంగా గురు-శని గ్రహాలు దగ్గరకు వచ్చినట్లు కనిపిస్తున్నాయి. డిసెంబర్‌ 21వ తేదీ నాటికి మరింత దగ్గరగా చేరి మనకు ప్రకాశవంతంగా కనిపించనున్నాయి.

భూమినుంచి చంద్రుడు దాదాపు 3,84,000కి.మీ దూరంలో ఉండగా వేరే గ్రహాలు మాత్రం లక్షలు, కోట్ల కి.మీ దూరంలో ఉన్నాయి. భూమితో పాటు ఇతర గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతున్న విషయం తెలిసిందే. ఇలా తిరిగే సమయంలో ఏవేని రెండు గ్రహాలు ఒక్కోసారి కొంత దగ్గరగా చేరుకుంటాయి. అయినప్పటికీ వాటిమధ్య లక్షల కి.మీ దూరం ఉంటుంది. భూమి ఒకసారి సూర్యుని చుట్టూ తిరిగిరావడానికి 365రోజులు పడితే, గురు గ్రహానికి మాత్రం 12సంవత్సరాలు పడుతుంది. అదే శనికి మాత్రం దాదాపు 28-30 సంవత్సరాలు పడుతుంది. ఇలా ఒక్కో గ్రహానికి కొంత కాలం పడుతుంది. ఇలా సూర్యుడి చుట్టూ తిరుగుతున్న సమయంలో అవి ఒకేసారి దగ్గరకు వచ్చినట్లు మనకు కనిపిస్తుంటాయి. ఇలాంటి అరుదైన అద్భుత దృశ్యాలు ఆకాశంలో ఎన్నో జరుగుతూనే ఉంటాయి. వాటిని కొన్నింటిని మాత్రమే మనం నేరుగా చూసే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం కనిపిస్తోన్న గురు, శని గ్రహాలు కూడా అలాంటివే. భారత్‌లోని ప్రధాన నగరాల్లో సూర్యాస్తమయం తర్వాత ఈ అరుదైన దృశ్యాన్ని వీక్షించవచ్చు.

ఇవీ చదవండి..
చందమామపై చైనా జెండా
భూమికి చేరిన గ్రహశకల నమూనాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని