Punjab: ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం చన్నీ కుమారుడు.. ప్రతిపక్షాల ఫైర్‌

పంజాబ్‌ నూతన ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ కొత్త చిక్కుల్లో పడ్డారు. రాష్ట్ర భద్రతా వ్యవహారాలపై చన్నీ ఇటీవల డీజీపీ ఇక్బాల్‌ ప్రీత్‌ సింగ్‌ సహోటాతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో సీఎం కుమారుడు రిథమ్‌జిత్‌ సింగ్‌...

Published : 04 Oct 2021 01:08 IST

చండీగఢ్‌: పంజాబ్‌ నూతన ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ కొత్త చిక్కుల్లో పడ్డారు. రాష్ట్ర భద్రతా వ్యవహారాలపై చన్నీ ఇటీవల డీజీపీ ఇక్బాల్‌ ప్రీత్‌ సింగ్‌ సహోటాతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో సీఎం కుమారుడు రిథమ్‌జిత్‌ సింగ్‌ సైతం పాల్గొన్నట్లు కనిపిస్తున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీంతో ప్రతిపక్ష నేతలు ముఖ్యమంత్రితోపాటు అధికారులపై విమర్శలకు దిగారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అశ్వని శర్మ ఈ వ్యవహారంపై మాట్లాడుతూ.. ‘మాజీ కేబినెట్ మంత్రిగా సీఎం చన్నీకి సమావేశాల నియమాలు, నిబంధనల గురించి తెలుసు. పరిపాలన గౌరవం, విశ్వసనీయతను ఆయన కాపాడాలి. మరోవైపు సీనియర్‌ అధికారులూ ముఖ్యమంత్రి కుమారుడిని ఉన్నత స్థాయి సమావేశానికి అనుమతించడం దురదృష్టకరం’ అని వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చన్నీ.. రెండు రోజుల క్రితం ప్రధాని మోదీతో భేటీ అయిన విషయం తెలిసిందే. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఆందోళనలకు వీలైనంత తొందరగా పరిష్కారం చూపించాలని మోదీని కోరినట్లు ఆయన వెల్లడించారు. మరోవైపు రైల్వే ట్రాక్‌లపై నిరసన తెలిపిన అన్నదాతలపై కేసులను ఉపసంహరించుకోవాలని ఆయన శనివారం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్‌పీఎఫ్)కు లేఖ రాశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని